ETV Bharat / sports

విశ్వక్రీడల్లో మనం.. దేశానికి రావాలి మరెన్నో పతకాలు!

author img

By

Published : Aug 9, 2021, 10:26 AM IST

neeraj
నీరజ్​

2020 టోక్యో ఒలింపిక్స్​ భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హాకీకి పూర్వవైభవం వచ్చే విధంగా అడుగులు పడింది ఇక్కడే! అటు పురుషుల హాకీ జట్టు, ఇటు మహిళల హాకీ జట్టు దుమ్మురేపి భారత్​కు గర్వకారణంగా నిలిచారు. ఇక నీరజ్​ చోప్డా పసిడి సాధించి భారత కీర్తిని మరోస్థాయికి చేర్చాడు. కానీ దాదాపు 140కోట్ల జనాభా ఉన్న దేశం 7 పతకాలే సాధించింది. భవిష్యత్తులో భారత్​ అద్భుత ప్రదర్శన చేయాలి.

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో టోక్యో చేరిన భారత్‌కు ఒలింపిక్స్‌లో ఆరంభమూ అదిరింది.. ముగింపూ అదిరింది. వెయిట్ లిఫ్టర్‌ చాను పతక పోటీల తొలి రోజే దేశానికి రజతం అందిస్తే.. బల్లెం వీరుడు నీరజ్‌ ముగింపులో పసిడితో మురిపించాడు. కానీ ఈ మధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఏడు పతకాలతో దేశానికి ఉత్తమ ఒలింపిక్స్‌గా నిలిచినా.. ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు కలిగించినా.. భారత్‌కు మిశ్రమ అనుభూతుల ఒలింపిక్స్‌ ఇది.

తొలి తొలిగా..

ఈ ఒలింపిక్స్‌లో 'తొలి' విశేషాలు చాలానే ఉన్నాయి. ముగింపులో అదిరే ప్రదర్శనతో అదగొట్టిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్డా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని (స్వర్ణం) అందించి వందేళ్ల స్వపాన్ని సాకారం చేశాడు. 13 ఏళ్లలో భారత్‌కు అదే తొలి ఒలింపిక్‌ స్వర్ణం. పురుషుల హాకీ జట్టు 41 ఏళ్లలో తొలి పతకం చేజిక్కించుకుంది. కాంస్యం గెలిచిన సింధు.. రెండు ఒలింపిక్‌ పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. చాను సాధించింది వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్‌ రజతం. మొత్తం 202 కిలోలు ఎత్తిన 4 అడుగుల 11 అంగుళాల చాను.. ఆకారం ముఖ్యం కాదని చాటింది. లవ్లీనా కాంస్య ప్రదర్శనా మురిపించేదే. లాక్‌డౌన్‌ల కారణంగా ఏడాది పాటు సరైన ప్రాక్టీస్‌ లేకున్నా మనోళ్లు ఈ ప్రదర్శన చేయడం గొప్ప విషయమే.

India at tokyo olympics
దేశానికి పతకాన్ని అందించిన వీరులు

షాక్‌.. షాక్‌

పతకాల తొలి రోజే చాను అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఎంత మురిసిపోయిందో.. ఆ తర్వాత అంత నీరసించిపోయింది. ఎన్నో అంచనాలున్న ఈవెంట్లు ముగుస్తుండగా... కొన్ని రోజుల పాటు ఖాతాలో మరో పతకం చేరలేదు. ముఖ్యంగా షూటర్ల ప్రదర్శన పెద్ద షాకే. ప్రపంచ శ్రేణి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. 15 మంది సభ్యుల బృందం ఒక్కటంటే ఒక్క పతకమూ సాధించలేకపోయింది. ఇంకా దిగ్భ్రాంతి కలిగించే విషయమేంటంటే.. సౌరభ్‌ చౌదరి మినహా ఒక్కరంటే ఒక్కరూ కనీసం ఫైనల్స్‌కు చేరలేకపోయారు. ఈ ఘోర వైఫల్యానికి కారణమేంటన్న దానికి ఎవరి వద్దా స్పష్టమైన సమాధానం లేదు. ఆటగాళ్లు, కోచ్‌లకు మధ్య.. కోచ్‌లకు కోచ్‌లకు మధ్య విభేదాలు కూడా పేలవ ప్రదర్శన కారణమని అంటున్నారు. మొత్తం కోచింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని షూటింగ్‌ సమాఖ్య ఇప్పటికే ప్రకటించేసింది. ఒక్క షూటర్లేనా..? కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న బాక్సర్లు, ఆర్చర్లు కూడా నిరాశపరిచారు.

అలా లేచింది..

జులై 24న చాను పతకం గెలిచాక.. తర్వాతి పతకం కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. భారత్‌ కథ ఇంత త్వరగా ముగుస్తుందా అన్న బాధ అభిమానులను వెంటాడింది. కానీ క్రమం కథ మారింది. అభిమానులు ప్రతి రోజూ పతకం వస్తుందని ఆశతో ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్‌ లవ్లీనా.. సెమీస్‌ చేరడం భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఆ తర్వాత సింధు పతకాన్ని చేజిక్కించుకుంది. రెజ్లర్‌ రవి దహియా ఫైనల్‌ చేరడం ద్వారా కనీసం రజతం ఖాయం చేయడం, పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల నిరీక్షణ తర్వాత పతకం (కాంస్యం) నెగ్గడం భారత క్రీడాభిమానులకు గొప్ప ఉపశమనం. ఇక శనివారం కాంస్యంతో బజ్‌రంగ్‌, స్వర్ణంతో నీరజ్‌.. భారత్‌ పతక వేటకు ఇచ్చిన ముగింపు అదరహో.

olympics
మువ్వనెల జెండా

పాపం వీళ్లు..

విజయానికి, ఓటమికి మధ్య ఒక చిన్న గీత! ఆ గీతను దాటితే పట్టరాని సంతోషం. లేదంటే అంతులేని బాధ. టోక్యో ఒలింపిక్స్‌లో గీతకు అవతల ఆగిపోయిన భారత క్రీడాకారులు చాలామందే ఉన్నారు. శనివారం గోల్ఫర్‌ అదితి అశోక్‌ త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. మూడు రోజుల పాటు రెండో స్థానంలో సాగిన ఈ అమ్మాయి.. చివరి రోజు నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం రెజ్లింగ్‌లో దీపక్‌ పునియా కూడా త్రుటిలో కాంస్యం చేజార్చుకున్నాడు. చివరి పది సెకన్ల ముందు వరకు అతడిదే ఆధిక్యం. కానీ చివరి క్షణాల్లో పట్టు కోల్పోయి ఒక్క పాయింట్‌ తేడాతో కంచు పతకం కోల్పోయాడు. మహిళల హాకీ జట్టు సైతం స్వల్ప తేడాలో కాంస్యం చేజార్చుకుంది. కంచు పోరులో ఒక్క గోల్‌ తేడాతో బ్రిటన్‌కు తలవంచింది. లేకుంటే రాణీ రాంపాల్‌ సేన చరిత్రలో నిలిచిపోయేదే. ఇక బాక్సింగ్‌లో మేరీకోమ్‌, సతీశ్‌ కుమార్‌ సైతం క్వార్టర్స్‌లో ఓడి.. పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయారు. వీళ్లందరూ ఇంకొక్క విజయం సాధించి ఉంటే.. భారత్‌ రెండంకెల సంఖ్యలో పతకాలతో మరింత గొప్ప స్థాయిలో ఉండేదే.

ఇదే చాలా..!

ఓ నీరజ్‌.. ఓ చాను.. ఓ దహియా.. ఓ సింధు.. ఓ పునియా, ఓ లవ్లీనా, హాకీ ఆటగాళ్లు..! వీళ్ల పోరాటం స్ఫూర్తిదాయకం! కానీ ఇక్కడితోనే సంతృప్తి చెందుదామా!
నిజమే.. వందేళ్లకు పైగా పోటీపడుతున్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది అత్యుత్తమ ప్రదర్శనే. ఏడు పతకాలతో లండన్‌ (6)ను దాటేసింది. కచ్చితంగా ఇది సంతోషించాల్సిన విషయమే! కానీ 140 కోట్లకు చేరవవుతున్న జనాభా మనది. అందుకే.. యే దిల్‌ మాంగే మోర్‌..!

ఇదీ చూడండి:- 'ఒలింపిక్ రికార్డ్​కూ ట్రై చేశా.. కానీ కుదరలే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.