ETV Bharat / sports

భారత్​ X న్యూజిలాండ్: గెలిచిన జట్టుకే సెమీస్​ ఛాన్స్​!

author img

By

Published : Oct 30, 2021, 4:40 PM IST

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) పాకిస్థాన్‌ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన టీమ్​ఇండియా ఆదివారం న్యూజిలాండ్‌తో(IND vs NZ T20) తలపడనుంది. నాకౌట్‌ దశకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ పోరులో ఓడితే టోర్నీలో నాకౌట్‌ దశకు చేరకుండానే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. మరి ఈ కీలక మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో?

IND vs NZ
భారత్, న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం(అక్టోబర్​ 31) భారత్‌, న్యూజిలాండ్‌(IND vs NZ T20 Match) అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాకౌట్‌ దశకు చేరాలంటే.. ఈ మ్యాచ్‌లో గెలవడం.. రెండు జట్లకు కీలకం. పాకిస్థాన్‌తో(IND vs PAK T20) జరిగిన పోరులో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ మినహా మిగతా భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్ సహా సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్య , రవీంద్ర జడేజా ఉసూరుమనిపించారు. ఓర్పుతో బ్యాటింగ్‌ చేస్తే పరుగులు సాధించవచ్చని పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ నిరూపించాడు.

లెఫ్ట్​ అండ్ రైట్ కాంబో..

ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ కుడి చేతివాటం బ్యాటర్లు. ఓపెనింగ్‌ విషయంలో కుడి, ఎడమ కలయిక ఉంటే బాగుంటుందని పరిశీలకులు చెబుతుంటారు. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌లో ఓపెనర్లు పంపితే బౌలర్ల లైన్‌, లెంగ్త్‌ కుదురుకోనీయకుండా చేయొచ్చనేది వారి ఆలోచన. దీని కోసం ఇషాన్‌ కిషన్‌ను(Ishan Kishan Opener) తుదిజట్టులోకి తీసుకోవాలనే వాదన వినిస్తోంది. ఐపీఎల్‌ సహా వార్మప్‌ మ్యాచుల్లో ఇషాన్‌ కిషన్‌ చక్కటి ప్రదర్శన చేశాడు. ఫామ్‌లో లేని హార్దిక్‌ పాండ్య(Hardik Pandya News) స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే రోహిత్‌శర్మకు తోడుగా ఓపెనింగ్‌ చేస్తాడు. అవసరాన్ని బట్టి విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్‌లో ఒకరు మూడో స్థానంలో దిగొచ్చు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంత లోతుగా ఉంటే ఒత్తిడిలో ఎవరో ఒకరు ఆదుకునే అవకాశం ఉంటుంది.

బౌలింగ్​లోనూ రాణించాలి..

బ్యాటర్ల సంగతి పక్కనపెడితే బౌలింగ్ దళం ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో ఒక్కటంటే ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయారు. సీనియర్‌ బౌలర్లు భువనేశ్వర్‌ , మహమ్మద్‌ షమీ(Shami Last Match) ప్రభావం చూపలేకపోయారు. ఫామ్‌లో లేని భువికి బదులు బ్యాటింగ్‌కూ ఉపయోగపడే శార్దూల్‌ ఠాకూర్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే బాగుండేదనే వాదనా ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో షమీ ఘోరంగా విఫలం కాగా.. బుమ్రా, భువి, వరుణ్‌ చక్రవర్తి, జడేజా ఫర్వాలేదనిపించారు. అయితే వికెట్‌ మాత్రం తీయలేకపోయారు. మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తి రాణిస్తాడని అంతా భావించారు. బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టినా వికెట్ల విషయంలో వరుణ్‌ ప్రభావం చూపించలేకపోయాడు. కివీస్‌తో మ్యాచ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌ లేదా షమీ, శార్దూల్‌, అశ్విన్‌, జడేజాతో బౌలింగ్‌ దాడి చేయించాలని విశ్లేషకులు చెబుతున్నారు.

టాస్​ కూడా కీలకమే..

టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి(Virat Captaincy) ఇదే ఆఖరి టోర్నీ. ఇందులో నాకౌట్‌కు చేరకుండానే వెనుదిరిగితే వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా కోహ్లీ తప్పుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటాయి. సాయంత్రం వేళల్లో మంచు ఎక్కువగా కురుస్తున్నందున టాస్‌ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. టాస్‌ గెలిచే జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.

కివీస్‌, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌, నమీబియా మీద గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా టీమ్​ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కివీస్‌ మీద ఓడి, మిగతా జట్ల మీద విజయం సాధిస్తే.. అప్పుడు గ్రూప్‌లో ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని మ్యాచులను భారత్‌ గెలవాలి. అప్పుడే ఎలాంటి సమీకరణాల లెక్క లేకుండా ముందుకెళ్లొచ్చు. భారత్‌, న్యూజిలాండ్‌(IND vs NZ head to head) ఇప్పటివరకు 14 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కివీస్ ఎనిమిది, టీమ్​ఇండియా ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో అయితే కివీస్‌దే పైచేయి. ఇప్పటివరకు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ కివీస్‌నే విజయం వరించింది.

ఇదీ చదవండి:

Kohli Azam: 'కోహ్లీ రికార్డులను బ్రేక్​ చేయడమే అతడి పని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.