ETV Bharat / sports

విశ్వ వేదికపై మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా

author img

By

Published : Jul 24, 2022, 8:17 AM IST

Updated : Jul 24, 2022, 12:24 PM IST

World Athletics Championships 2022 Neeraj Chopra Wins Silver Medal
World Athletics Championships 2022 Neeraj Chopra Wins Silver Medal

12:21 July 24

10:31 July 24

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో ప్రదర్శనపై మాట్లాడుతున్న నీరజ్​ చోప్రా

08:15 July 24

విశ్వ వేదికపై మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా

World Athletics Championships 2022 Neeraj Chopra Wins Silver Medal
జావెలిన్​ త్రో ఫైనల్​

Neeraj Chopra Final: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లోనూ ఒలింపిక్ ఛాంపియన్​, భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్​ త్రో ఫైనల్లో.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడీ 24 ఏళ్ల స్టార్​. డిఫెండింగ్​ ఛాంపియన్​, గ్రెనెడాకు చెందిన అండర్సన్​ పీటర్స్​ మరోసారి విజేతగా నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్​లో రజతం గెల్చిన వద్లెచ్​ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు.

పీటర్స్​ బల్లెం విసిరిన 3 సార్లు.. 90 మీటర్ల మార్కు దాటాడు. చివరి అటెంప్ట్​లో 90.54 మీటర్ల దూరం బల్లెం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 90.21, రెండోసారి 90.48 మీటర్ల దూరం ఈటె విసిరాడు. మిగతా ఎవరూ ఆ మార్కును అందుకోలేదు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్​.. రెండు, మూడు అటెంప్ట్స్​లో వరుసగా 82.39, 86.37 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. ఇక నాలుగో ప్రయత్నంలో మంచి వేగం అందుకున్న నీరజ్​.. 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదు, ఆరు ప్రయత్నాల్లోనూ నీరజ్​ ఫౌల్​ చేశాడు. అయినా రెండో స్థానంలోనే నిలిచి.. చరిత్ర సృష్టించాడు. మరో భారత జావెలిన్​ త్రోయర్​ రోహిత్​ యాదవ్​ ఆకట్టుకోలేకపోయాడు. మూడు రౌండ్ల తర్వాత పదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 78.72 మీటర్లు మాత్రమే.
అంతకుముందు గ్రూప్​-ఏ క్వాలిఫికేషన్​ రౌండ్​లో 88.39 మీటర్ల త్రో వేసిన నీరజ్​.. ఒకే ఒక్క అటెంప్ట్​తో నేరుగా ఫైనల్​కు చేరాడు. గ్రూప్​- బీ నుంచి పీటర్స్​ 89.91 మీ.. జావెలిన్​ విసిరాడు.
మరోవైపు పురుషుల ట్రిపుల్​ జంప్​ ఫైనల్లో భారత అథ్లెట్​ ఎల్దోస్​ పాల్​ నిరాశపరిచాడు. 9వ స్థానంలో నిలిచిన అతడు.. పతకం తేలేకపోయాడు. 16.79 మీటర్ల దూరం దూకడం అతడి అత్యుత్తమ ప్రదర్శన. మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచిన అతడు.. మరో మూడు అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​ ట్రిపుల్​ జంప్​ విభాగంలో ఫైనల్​ చేరిన భారత తొలి అథ్లెట్​ పాల్​ కావడం విశేషం. 4x400 రిలే టీం విభాగంలో భారత్​ 12వ స్థానంతో ముగించింది.

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్​గా, పురుషుల విభాగంలో తొలి భారత ఆటగాడిగా నిలిచాడు నీరజ్​ చోప్రా. 2003లో పారిస్​ వేదికగా జరిగిన వరల్డ్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​ జంప్​ విభాగంలో కాంస్యం గెల్చుకుంది అంజు బాబి జార్జ్​. ఇప్పుడు నీరజ్​ ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది జపాన్​ టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్​లో భారత్​ గర్వపడేలా చేశాడు నీరజ్​. ఒలింపిక్స్​లో స్వర్ణం దక్కించుకున్న భారత తొలి అథ్లెట్​గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్​ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన రెండో భారత ఆటగాడిగానూ నిలిచాడు. అంతకుముందు 2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో బంగారు పతకం నెగ్గాడు షూటర్​ అభినవ్​ బింద్రా.

మోదీ ట్వీట్​.. రజత పతకం గెల్చిన నీరజ్​ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర సృష్టించిన నీరజ్​ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్రీడల్లో భారత్​కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. రానున్న టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు మోదీ. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు సహా పలువురు ప్రముఖులు నీరజ్​కు అభినందనలు తెలిపారు.
నీరజ్​ శ్రమకు ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉందని అన్నారు అతడి తల్లి సరోజా దేవి. నీరజ్​ పతకం సాధిస్తాడని తమకు ముందే తెలుసని చెప్పారు. ప్రపంచ వేదికపై పతకం గెల్చిన నీరజ్​ సొంత గ్రామమైన హరియాణాలోని పానీపత్​లో సంబరాలు అంబరాన్నంటాయి. అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు డ్యాన్స్​లు చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

ఇవీ చూడండి: ఇకపై అంపైర్లకు స్పెషల్​ కేటగిరీ.. టాప్‌లో ఎవరున్నారంటే?

టీమ్​ఇండియా మరో సిరీస్​ పట్టేస్తుందా.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే

Last Updated :Jul 24, 2022, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.