ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన తెలుగుతేజం.. ఆర్చరీ ప్రపంచకప్​లో స్వర్ణం

author img

By

Published : Jun 26, 2022, 7:08 AM IST

archery World Cup
jyothi surekha gold medal

పారిస్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్​లో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ జోడీ రికార్డు సృష్టించింది. మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణంతో చరిత్ర లిఖించింది. అంతేకాక వ్యక్తిగత విభాగంలో రజతం సొంతంచేసుకుంది జ్యోతి.

అడ్డంకులను దాటుతూ.. సవాళ్లను అధిగమిస్తూ.. లక్ష్యానికి గురి పెట్టిన బాణంలా.. తిరుగులేని వేగంతో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ దూసుకెళ్తోంది. విలువిద్యలో పతకాలు కొల్లగొడుతోంది. తాజాగా ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో ఈ విజయవాడ ఆర్చర్‌ అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. అభిషేక్‌ వర్మతో కలిసి కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‌ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ- అభిషేక్‌ రికార్డుల్లోకెక్కారు. వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ప్రపంచకప్‌ వ్యక్తిగత విభాగంలో ఆమెకు ఇదే తొలి పతకం.

archery World Cup
పసిడి పతకాలతో జ్యోతి జోడీ

శనివారం మిక్స్‌డ్‌ ఫైనల్లో సురేఖ జోడీ 152-149 తేడాతో సోఫీ- జీన్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. ఆరంభం నుంచి భారత ద్వయం ఆధిపత్యం చలాయించింది. తొలి రౌండ్లో బాణాలను కచ్చితమైన లక్ష్యానికి గురి పెట్టి 40-37తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్‌లో ప్రత్యర్థి పుంజుకుని ఆ ఆధిక్యాన్ని ఒక్క పాయింట్‌కు తగ్గించింది. మూడో రౌండ్‌ 39-39తో టైగా ముగిసింది. ఇక కీలకమైన నాలుగో రౌండ్లో సురేఖ- అభిషేక్‌ జంట తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా రాణించింది. 37-35తో ఆధిక్యంలో నిలిచి పసిడి పట్టేసింది.

archery World Cup
రజతంతో జ్యోతి సురేఖ

మరోవైపు కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో సురేఖ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయింది. పసిడి కోసం గట్టిగా ప్రయత్నించిన ఆమె తుదిపోరులో షూటాఫ్‌లో ఎల్లా గిబ్సన్‌ (బ్రిటన్‌) చేతిలో ఓడింది. అయిదు రౌండ్లు ముగిసే సరికి స్కోరు 148-148తో సమమైంది. దీంతో షూటాఫ్‌ నిర్వహించగా.. అందులోనూ ఇద్దరు ఆర్చర్లు చెరో 10 పాయింట్లు సాధించారు. కానీ కేంద్రం నుంచి చూస్తే సురేఖ బాణం ప్రత్యర్థి దాని కంటే కొన్ని మిల్లీమీటర్ల దూరంలో ఉండడంతో తను రజతంతో సంతృప్తి చెందక తప్పలేదు. టైటిల్‌ కోసం ఇద్దరు ఆర్చర్లు హోరాహోరీగా తలపడ్డారు. తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి ఇద్దరూ 60-60తో సమంగా నిలిచారు. మూడో రౌండ్లో 29-30తో సురేఖ వెనకబడింది. నాలుగో రౌండ్‌ 29-29తో టై అయింది. అయిదో రౌండ్లో 30-29తో సురేఖ ప్రత్యర్థిని అందుకుంది. షూటాఫ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ దురదృష్టవశాత్తూ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.

ఇదీ చూడండి: టీమ్​ ఇండియాకు షాక్​.. కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.