ETV Bharat / sports

అప్పుడు రాయల్స్.. ఇప్పుడు ముంబయి ఇండియన్స్.. తొలి ట్రోఫీ ఆ జట్టుదేనా?

author img

By

Published : Mar 15, 2023, 1:50 PM IST

wpl mumbai indians
అప్పుడు రాయల్స్.. ఇప్పుడు ముంబయి ఇండియన్స్..

ఐపీఎల్​ తొలి సీజన్​లో జరిగిన సెంటిమెంట్​.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి సీజన్‌‌లోనూ కొనసాగుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ​ దీంతో ముంబయి ఇండియన్సే ట్రోఫీని ముద్దాడుతుందని అనుకుంటున్నారు. ఆ వివరాలు..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి సీజన్‌‌లో ముంబయి ఇండియన్స్ జట్టు ప్రదర్శన గురించి క్రికెట్​ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్​ మెగాలీగ్​లో మెన్స్​ టీమ్​ ఎలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో... అలాగే ఈ మహిళల లీగ్​లోనూ టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ సేన తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసిన ముంబయి ఇండియన్స్.. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

మరోపైపు ఈ ఉమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో జట్టు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాత్రం పేలవ ప్రదర్శనతో చతికిల పడుతోంది. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్​లో ఆర్సీబీ మెన్స్​ టీమ్ ఎలా అయితే అంచనాలతో బరిలోకి దిగి చతికిల పడుతుందో ఇప్పుడు దాన్నే కొనసాగిస్తోంది అమ్మాయిల జట్టు. ఈ సీజన్‌లో ఒక్క విజయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ బోణీ కొట్టాలని ఆశిస్తోంది. తొలి ఐదు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన స్మృతి మంధాన సేన.. ప్లేఆఫ్స్ చేరేది కష్టమే అని క్రికెట్​ అభిమానులు అంటున్నారు.

అయితే ఈ ప్రదర్శన విషయం పక్కన పెడితే.. ఇక్కడ ఓ సెంటిమెంట్​ ప్రకారం ఉమెన్స్​ లీగ్​లో ముంబయి ఇండియన్సే ట్రోఫీని ముద్దాడుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ 2008 తొలి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఫస్ట్​ టీమ్​ రాజస్థాన్ రాయల్స్. అలానే ఈ టీమే ఆ సీజన్​ టైటిల్​ను గెలుచుకుంది. అలాగే డబ్ల్యూపీఎల్ 2023 తొలి సీజన్‌లోనూ నాకౌట్‌ స్టేజీకి వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది ముంబయి ఇండియన్స్. కాబట్టి ఐపీఎల్ తొలి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి వెళ్లిన తొలి జట్టు ట్రోఫీని ముద్దాడడంతో.. ఈ డబ్ల్యూపీఎల్​లోనూ ప్లేఆఫ్స్​కు వెళ్లిన తొలి జట్టు ముంబయి ఇండియన్సే టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాగా, మూడు అర్ధ సెంచరీలు చేయడంతో పాటు మూడు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' నిలిచిన హర్మన్‌ ప్రీత్ కౌర్‌.. అలాగనే 5 మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టిన సైకా ఇషాక్.. ముంబయి విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే.. ఈ లీగ్​ ఫస్ట్​ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలిచిన ముంబయి ఇండియన్స్, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబయి.. ఆ తర్వాత యూపీ వారియర్స్‌ను కూడా 8 వికెట్ల తేడాతో ఓడించింది. అలా మొదటి రౌండ్‌లో నాలుగు జట్లను ఓడించిన ముంబయి.. రెండో రౌండ్​లోనూ అదే జోరు కొనసాగిస్తూ.. గుజరాత్ జెయింట్స్‌ను 55 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ హిస్టరీలో మొదటి ఐదు మ్యాచుల్లో గెలిచిన తొలి జట్టుగా నిలిచింది ముంబయి. ఇదీ చూడండి: నార్వే గ్రూప్​తో కోహ్లీ డ్యాన్స్​.. ఫైర్​ అయిన అనుష్క శర్మ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.