కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్​బై

author img

By

Published : Sep 16, 2021, 6:04 PM IST

Updated : Sep 16, 2021, 6:46 PM IST

kohli

18:00 September 16

అనుకున్నట్లే జరిగింది. టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్‌ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్​ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్​కు గురయ్యారు. 

"భారత్​కు కెప్టెన్​గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నా. సారథిగా నా జర్నీలో అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్​ కమిటీ, కోచ్​లు, ప్రతి భారతీయుడి ప్రార్థనలతోనే ఇదంతా సాధించా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లకు ఆడుతున్నా. ఐదారేళ్లుగా 3 ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. పని ఒత్తిడి కారణంగా ఇప్పుడు తప్పుకొంటున్నా. టెస్టు​, వన్డేలలో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు ఇది దోహదపడుతుంది. టీ20 కెప్టెన్​గా నా కెరీర్​లో జట్టుకు కావాల్సిన ప్రతిదీ చేశా. టీ20 బ్యాట్స్​మన్​గా కొనసాగుతాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. రవిభాయ్​, రోహిత్​తో ఎన్నో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా, సెలక్టర్లతో మాట్లాడాను. నా వంతుగా జట్టుకు అత్యుత్తమ సేవలందిస్తా."

-కోహ్లీ.

కెప్టెన్​గా 45 టీ20లకు సారథ్యం వహించాడు కోహ్లీ. అందులో 29 గెలవగా.. 13 ఓడిపోయాడు. రెండు మ్యాచ్​ల్లో ఫలితాలు తేలలేదు. అతడి విజయ శాతం 65.11గా ఉంది.  

స్పందించిన బీసీసీఐ

కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించే అరగంట ముందు మాత్రమే తమకు చెప్పినట్లు తెలిపింది బీసీసీఐ. దానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది.      

Last Updated :Sep 16, 2021, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.