ETV Bharat / sports

ఇలాగే ప్రయోగాలు చేస్తే.. టీ20 వరల్డ్​ కప్​ కష్టమే

author img

By

Published : Sep 11, 2022, 10:53 PM IST

team india stop shuffle in batting and bowling
team india stop shuffle in batting and bowling

T20 World Cup 2022 India Squad : ఆసియా కప్​లో టైటిల్​ ఫేవరెట్​గా బరిలో దిగిన టీమ్​ ఇండియా తీవ్రంగా విఫలమైంది. దీనిపై మాజీ క్రికెటర్లు స్పందించారు. రాబోయే వరల్జ్​ కప్​లో జట్టు పరిస్థితిపై హెచ్చరిస్తున్నారు. జట్టును ఎంపిక చేయడంలో.. టీమ్​ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సెలక్షన్​ కమిటీకి, కెప్టెన్​ రోహిత్​ శర్మకు పలు సూచనలు చేస్తున్నారు. ఆసియా కప్​లో నిరాశపర్చిన జట్టు ఆటపై, వరల్డ్ కప్​ జట్లు ఎలా ఉండాలో అన్ని దానిపై నిపుణుల విశ్లేషణ.

T20 World Cup 2022 India Squad : ఆసియా కప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తీవ్రంగా నిరాశపర్చింది. సూపర్‌-4లోనే ఇంటిముఖం పట్టింది. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడం.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మధ్యలోనే వైదొలగడం.. బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కారణాలుగా క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టు సరిగ్గా లేదనే విమర్శలూ వస్తున్నాయి. బుమ్రా లేని సమయంలో మరో సీనియర్‌ బౌలర్‌ షమీని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదనిపిస్తోందని ఇప్పటికే పలువురు అభిప్రాయపడ్డారు. వచ్చే ప్రపంచకప్‌ కోసం అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని చెబుతున్నారు. ఇకనైనా జట్టులో ప్రయోగాలకు సెలవు ఇవ్వాలని సునిల్‌ గావస్కర్‌ వంటి క్రికెట్ దిగ్గజం సూచించాడు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆర్పీ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.

ఇలాంటి ప్రదర్శనతో టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగడం చాలా కష్టమని ఆర్పీ సింగ్‌ తెలిపాడు. "ఆసియా కప్‌లో దారుణ ప్రదర్శన చేసిన టీమ్‌ ఇండియా.. వచ్చే ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగలేదు. ట్రోఫీని గెలుచుకోవాలంటే కొన్ని మార్పులు చేయాల్సిందే. ప్రపంచ కప్‌ లోపు జరిగే అన్ని మ్యాచుల్లోనూ (ఆసీస్‌, దక్షిణాఫ్రికా) తుది 11 మంది సభ్యులను ఆడించాలి. ఒకవేళ బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తూ పోతే మాత్రం ఇంకా అయోమయం పెరిగిపోయే ప్రమాదం ఉంది" అని ఆర్పీ సింగ్‌ వివరించాడు.

T20 World Cup 2022 India Squad
టీమ్​ ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ

ప్రయోగాలు ఆపాలి..
ఆర్‌పీ సింగ్‌ చెప్పినట్లు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇప్పటివరకు చేసిన మార్పులు ఇకనైనా ఆపేయాలి. ఓపెనింగ్‌ కోసం టీమ్‌ఇండియా దాదాపు ఐదారుగురు బ్యాటర్లను ప్రయత్నించింది. రోహిత్ శర్మతో కేఎల్ రాహుల్‌, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్ ఓపెనింగ్‌కు దిగారు. చివరికి ఆసియా కప్‌లో మాత్రం రోహిత్-కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌ చేశారు. రాహుల్‌ లేకపోతేనే కోహ్లీతో ఓపెనింగ్‌ చేయించాలని మాజీలు సూచించారు. అప్పుడు సూర్యకుమార్‌ను మూడో స్థానంలో ఆడించాలి. కేఎల్ రాహుల్‌ ఫామ్‌ అందుకొని ఆడితే మాత్రం విరాట్‌ వన్‌ డౌన్‌లోనే రావాలి. నాలుగో స్థానంలో సూర్యకుమార్‌.. తర్వాత రవీంద్ర జడేజా (జట్టులో ఉంటే), హార్దిక్ పాండ్య, దినేశ్‌ కార్తిక్‌/రిషభ్‌ పంత్ వస్తే బ్యాటింగ్‌ లైనప్‌ బాగుండే అవకాశం ఉంది.

T20 World Cup 2022 India Squad
టీమ్​ ఇండియా

ఫైనల్‌ XI.. క్లారిటీ ఉండాలి
ఏ జట్టుకైనా తుది 11మంది ఆటగాళ్లు ఎవరు ఉంటారనే దానిపై పూర్తి స్పష్టత ఉండాలి. ఎప్పుడు ఏ మ్యాచ్‌లో ఎవరు ఉంటారో అనే సందిగ్ధత అటు ఆటగాళ్లకు.. జట్టు మేనేజ్‌మెంట్‌కు ఉండకూడదు. ఆసియా కప్‌లో అదే లోపించినట్లు అనిపించింది. దినేశ్ కార్తిక్‌.. వీరిద్దరిలో సీనియర్‌ అయిన కార్తిక్‌ మంచి ఫినిషర్‌గా పేరు సాధించాడు. అయితే ఆసియా కప్‌లో మాత్రం అతడి సేవలను వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. ఇక రిషభ్ పంత్ అయితే ధాటిగా ఆడటంలో పూర్తిగా విఫలమైనప్పటికీ.. తుది జట్టులో స్థానం కల్పించడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో కార్తిక్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆసీస్‌, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లకు ఎంపిక చేసి ఆడించాల్సిందే. హార్దిక్‌, సూర్యకుమార్‌ ఏదో ఒక మ్యాచ్‌లో మెరిశారు. వీరద్దరూ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

T20 World Cup 2022 India Squad
టీమ్​ ఇండియా

బౌలర్లను వినియోగించుకోలేక..
ఇక బౌలింగ్ దాడిని కూడా కెప్టెన్‌ రోహిత్ శర్మ సరిగ్గా వాడుకోలేకపోయాడు. జట్టులో ఉన్నదే ముగ్గురు రెగ్యులర్ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్‌.. హార్దిక్‌ పాండ్య పేస్‌ ఆల్‌రౌండర్‌. వీరితోపాటు చాహల్, బిష్ణోయ్‌, అశ్విన్‌ ఉన్నారు. దీపక్ హుడా కూడా ఆల్‌రౌండరే. కానీ ఈ టోర్నమెంట్‌లో ఒక్కసారిగా కూడా దీపక్‌ హుడాతో బౌలింగ్‌ చేయించే సాహసం రోహిత్ చేయలేకపోయాడు. మిగతా బౌలర్లు పరుగులు ఇస్తున్నా.. కనీసం బౌలింగ్‌లో మార్పు కూడా చేయకపోవడం రోహిత్ కెప్టెన్సీ వైఫల్యమని విశ్లేషకులు చెబుతున్నారు. అవేశ్‌ ఖాన్‌ ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా జ్వరంతో టోర్నమెంట్‌కే దూరం కావాల్సి వచ్చింది. ఇక ఆఖర్లో అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్నా.. డెత్‌ ఓవర్లలో సహకారం కరవైంది. భువనేశ్వర్‌ ఆరంభంలో వేసినట్లుగా కీలకమైన చివరి ఓవర్లలో వేయలేక భారీగా పరుగులు ఇవ్వడంతో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. బుమ్రా, హర్షల్‌ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు సీనియర్‌ షమీ, దీపక్ చాహర్, అర్ష్‌దీప్‌ను తీసుకోవాలని రాబిన్‌ ఉతప్ప పేర్కొన్నాడు. అందుకే మెగా టోర్నీకి కనీసం ఆరుగురు ఫాస్ట్‌ బౌలర్లతో వెళ్లాలని రవిశాస్త్రి వంటి మాజీ కోచ్ సూచించాడు.

ఇవీ చదవండి: కోహ్లీపై దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఏమన్నాడంటే?

టీమ్​ ఇండియాకు గుడ్​ న్యూస్​.. వరల్డ్​ కప్​ జట్టులో ఆ బౌలర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.