ETV Bharat / sports

ముంబయికి కలిసిరాని మెగా ఆక్షన్​​.. గతంలోనూ వరుస ఓటములు

author img

By

Published : Apr 10, 2022, 8:23 AM IST

Updated : Apr 10, 2022, 8:45 AM IST

Mumbai Indians in IPL
ముంబయి ఇండియన్స్​

Mumbai Indians IPL: మెగా టీ20 లీగ్​లో ముంబయి ఇండియన్స్​ వరుసగా నాలుగు మ్యాచ్​ల్లో ఓటమిపాలై అభిమానులను నిరాశపరిచింది. అయితే.. ఇలా జరగటం కొత్తేమి కాదు. మెగా ఆక్షన్​ తర్వాత జరిగిన పలు సీజన్​లలో ముంబయి వరుస ఓటములు నమోదు చేసింది. మరోవైపు.. చెన్నై సూపర్​ కింగ్స్​ సైతం ఈ ఏడాది వరుసగా నాలుగు మ్యాచ్​ల్లో ఓడింది.

Mumbai Indians IPL: ముంబయి ఇండియన్స్​.. ఐపీఎల్​ 2022 సీజన్​ను అత్యంత పేలవ ప్రదర్శనతో ప్రారంభించింది. నాలుగు మ్యాచ్​లు ఆడినా బోణీ కొట్టలేక అభిమానులను నిరాశపరిచింది. 5 టైటిళ్లను ఖాతాలో వేసుకున్న జట్టు.. ఈ సీజన్​లో వరుసగా నాలుగు మ్యాచ్​లు ఓడిపోవటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే.. ఇది ముంబయికి కొత్తేమీ కాదు. మెగా ఆక్షన్​ జరిగిన తర్వాత పలు సీజన్లలో ముంబయికి శుభారంభం లభించలేదు. వరుస ఓటములతోనే లీగ్​ను ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి.

స్టార్​ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని విభాగాల్లో బలహీనంగా ఉండటం కూడా ముంబయి విజయాలను అందుకోకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్​ విభాగం బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ముంబయి బౌలింగ్​ అంటే ప్రత్యర్థి జట్లకు దడగా ఉండేది. ప్రారంభ ఓవర్లలో బౌల్ట్​ కంట్రోల్​ చేస్తే.. మిడిల్​, డెత్ ఓవర్లలో బుమ్రా అదరగొట్టేవాడు. పొలార్డ్​ కీలక సమయంలో స్లో బౌలింగ్​తో వికెట్లు తీసేవాడు. అయితే.. ఇప్పుడు బుమ్రా ఒక్కడి మీదే భారమంతా పడుతోంది. యువ బౌలర్లు బాసిల్​ థంపి, మురుగన్​ అశ్విన్​ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. పొలార్డ్​, డానియల్​ సామ్స్​ విఫలమవుతున్నారు.

  • 2008లో వరసుగా నాలుగు ఓటములు: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ తొలి సీజన్​లో ముంబయి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. తొలి నాలుగు మ్యాచ్​ల్లో ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంది.
  • 2014లో తొలి 5 మ్యాచుల్లో పరాజయం: 2013 సీజన్​తో మంచి ఫామ్​లోకి వచ్చిన ముంబయి ఇండియన్స్​ జట్టు ఆ తర్వాత జరిగిన మెగా ఆక్షన్​తో మళ్లీ డీలా పడింది. 2014 మెగా ఆక్షన్​లో జట్టు కూర్పులో మార్పుతో ఆ సీజన్​లో శుభారంభం లభించలేదు. ఏకంగా వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది.
  • 2015లో 4 వరుస ఓటములు.. అయినా విజేత: 2015లో జరిగిన మెగా లీగ్​లో వరుసగా తొలి నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది ముంబయి ఇండియన్స్​. బోణీ కొట్టేందుకు ఇబ్బంది పడినా.. చివరకు టోర్నీ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్య పరిచింది. క్రమంగా పుంజుకున్న జట్టు ఆల్​రౌండ్​ ప్రదర్శనతో విజయతీరాలకు చేరింది. ఈ సీజన్​ సైతం మెగా ఆక్షన్​ తర్వాతే జరగటం విశేషం.
  • 2018లో వరుసగా మూడు ఓటములు: 2018 సీజన్​ సైతం మెగా ఆక్షన్​ తర్వాతే జరిగింది. ఈ లీగ్​లోనూ ముంబయి ఇండియన్స్​కు కలిసిరాలేదు. వరుసగా మూడు మ్యాచ్​లు ఓడిన తర్వాతే బోణీ కొట్టింది.
  • ఐపీఎల్​ 2022లో వరుసగా నాలుగు ఓటములు: లీగ్​ ప్రారంభమైనప్పటి నుంచి టాప్ జట్టుగా చలామణి అవుతున్న రోహిత్​ సేన.. 2022లో బోణీ కొట్టేందుకు ఇబ్బంది పడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్​లు ఓడిపోయి నిరాశపరిచింది.

ఆర్సీబీపై ఓటమి కారణాలు రోహిత్​ మాటల్లో: ఆర్సీబీతో శనివారం జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఓడిపోయి.. టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ముంబయి కెప్టెన్​ రోహిత్​ శర్మ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించారు. 'కొన్ని పిచ్​లు, ప్రత్యర్థులపై కీలకంగా మారుతారనుకునే ఇద్దరు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేరు. మా బ్యాటింగ్​ను బలోపేతం చేసుకోవాలి. వారు ఇద్దరి గైర్హాజరుతో ఆ లోటు కనిపిస్తోంది. నేను ఎక్కువ సమయం క్రీజ్​లో ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు రాంగ్​ టైమ్​లో ఔవుట్​ అయ్యా. అది మమ్మల్ని దెబ్బతీసింది. మా జట్టు 150 చేరుకుందంటే ఆ క్రెడిట్​ సూర్యాదే. అది సరిపోదని తెలుసు. బౌలింగ్​లో రాణించాలనుకున్నా.. వారు బ్యాటింగ్​లో నైపుణ్యం ప్రదర్శించారు. బ్యాటింగ్, బౌలింగ్​తో కూడిన ఆల్​రౌండ్​ ప్రదర్శన అవసరమని ప్రతిసారి చెబుతాను. అదే ఈ మ్యాచ్​లో మిస్సైంది' అని పేర్కొన్నారు.

గత సీజన్​లో ఛాంపియన్.. వరుసగా నాలుగు ఓటములు: చెన్నై సూపర్​ కింగ్స్​.. నాలుగు సార్లు ఛాంపియన్​. గత సీజన్​లో అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచిన ఆ జట్టు.. ఐపీఎల్​ 2022 సీజన్​లో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి అభిమానులను నిరాశపరిచింది. గత సీజన్​లో అత్యధిక పరుగులు సాధించిన రుతురాజ్​ గైక్వాడ్​ ఈసారి తన మార్క్ ఆటను చుపించటం లేదు. చెన్నైని ఓపెనింగ్​ సమస్య వెంటాడుతోంది. రుతురాజ్​కు తోడుగా డుప్లెసిస్​ చాలా కీలక ఇన్నింగ్స్​లు ఆడాడు. ఇప్పుడు డుప్లెసిస్​ బెంగళూరు సారథిగా వెళ్లిపోయాడు. మరోవైపు.. కొత్త సారథి రవీంద్ర జడేజా కూడా ఇటు బౌలింగ్​, బ్యాటింగ్​లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత సీజన్​ వరకు చెన్నై బౌలింగ్​కు ఆయువుపట్టులా దీపక్​ చాహర్​, శార్దూల్​ ఠాకూర్​, రవీంద్ర జడేజా, మొయిన్​ అలీ ఉండేవారు. ఈసారి శార్దూల్​ లేకపోవటం వల్ల లోటు తెలుస్తోంది.

టాస్​ కంటే జట్టు కూర్పే కీలకం: మ్యాచ్​ విజయంలో టాస్​ కీలకమవుతుందో లేదా కోనీ జట్టు కూర్పు మాత్రం చాలా ముఖ్యం. టాస్​ ఓడి భారీ స్కోరు చేసినా లక్ష్యాలను కాపాడుకోవడం కష్టం. బౌలింగ్​ సరిగా లేకపోతే ఓటమి చవిచూడాల్సి వచ్చిందనేది చెన్నై, ముంబయి జట్లు ఇప్పటికే తెలుసుకొని ఉంటాయి. బ్యాటింగ్​ ఆర్డర్​పైనా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా చెన్నై ఈ సమస్యను ఎదుర్కొంటోంది. టాప్​ఆర్డర్​ బలోపేతంగా ఉంటే మిడిలార్డర్​ బ్యాటర్లు స్వేచ్ఛగా హిట్టింగ్​ చేయగలరు. అన్ని విభాగాలపై దృష్టిసారించి ఇక నుంచైనా విజయాలను నమోదు చేయాలని చెన్నై, ముంబయి అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై(10వ స్థానం), ముంబయి(9వ స్థానం)లకు పరిమితం కావటం గమనార్హం.

ఇదీ చూడండి: IPL 2022: బెంగళూరు హ్యాట్రిక్ విజయం.. ముంబయి నాలుగో ఓటమి

Last Updated :Apr 10, 2022, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.