టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. ఒక్కప్పుడు ఆసీస్పై విజృంభించిన కోహ్లీ.. ప్రస్తుతం మాత్రం ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లో బోల్తా పడ్డాడు. ఈ ఐదు ఇన్నింగ్స్ కలిపి విరాట్ అత్యధిక స్కోర్ 44 మాత్రమే చేశాడు. మొత్తంగా 111 రన్స్ చేశాడు.
వాస్తవానికి 2020-21 కాలంలో ఫామ్లేమితో తీవ్రంగా ఇబ్బంది పడిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ఆసియా కప్ 2022తో తిరిగి గాడిలో పడిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆఫ్ఘానిస్థాన్పై సెంచరీతో అదరగొట్టిన విరాట్.. తనలోని పాత కోహ్లీని బయటకు తీశాడు. సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు ఆస్ట్రేలియాపై బాగా ఆడతాడనుకుంటే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అసలతడు ఈ టెస్ట్ ఫార్మాట్లో శతకం బాది ముడేళ్లకు పైగానే అయింది. 2019 నవంబరులో బంగ్లాదేశ్పై కొట్టాడు.
శతకం విషయం పక్కనపెడితే తాజా టోర్నీలో విరాట్ కనీసం అర్ధశతం కూడా చేయలేదు. అయితే అది ఈ ఒక్క సిరీస్లోనే కాదు. అతడు ఈ హాఫ్ సెంచరీ చేయక ఏకంగా పదేళ్లు ఏళ్లు అయిపోయింది. స్వదేశంలో ఆసీస్పై అతడు అర్ధ శతకం బాదక పదేళ్లు గడిచిపోయాయి. గతంలో 2013లో స్వదేశంలో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో కంగారులపై హాఫ్ సెంచరీ 67* బాదాడు. కానీ ఆ తర్వాత నుంచి చేతులెత్తేస్తున్నాడు. 2013 తర్వాత స్వదేశంలో ఆసీస్పై తన చివరి 10 ఇన్నింగ్స్లో .. వరుసగా 0, 13, 12, 15, 6, 12, 44, 20, 22, 13 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఇదే సమయంలో ఆసీస్ను వారి గడ్డపై మాత్రం బాగానే ఎదుర్కొంటున్నాడు.
అలా అతడికి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మంచి రికార్డులు ఉన్నాయి. కానీ, స్వదేశంలో ఆడే టెస్టుల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. మరి అహ్మాదాబాద్ వేదికగా ఆసీస్తో జరిగే ఆఖరి టెస్టు మ్యాచులోనైనా విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని, సెంచరీ బాదాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...
ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా తొలి రెండు టెస్టుల్లో మంచి విజయాన్ని అందుకుంది. స్పిన్ మాయాజాలంతో స్పిన్ పిచ్లపై ఆసీస్ జట్టును మట్టికరిపించింది. అయితే అదే ఫార్ములాతో ఆసీస్ కూడా మూడో టెస్టులో టీమ్ఇండియాను గట్టి దెబ్బ తీసింది.
ఇదీ చూడండి: ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి సన్నిధిలో విరుష్క జంట పూజలు