ETV Bharat / sports

'ఇదే నా చివరి IPL!.. 'జూనియర్​ మలింగ' కేక.. సచిన్​లా 16 ఏళ్లకే స్టార్ట్​ చేసుంటే..'

author img

By

Published : Apr 22, 2023, 10:21 AM IST

dhoni
dhoni

చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు సారథి ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్​లో తాను చివరి దశలో ఉన్నట్లు తెలిపాడు. సీఎస్​కే పేసర్​ మతీషా పతిరనపై మిస్టర్​ కూల్​ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఐపీఎల్‌ 16వ సీజన్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో చెన్నై జట్టు ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తమ హోం గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించడంపై సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ స్పందించాడు. ఆ జట్టు యువ పేసర్‌ మతీషా పతిరనపై ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు.

"నేను నా కెరీర్‌లో చివర దశలో ఉన్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. వారు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రావడం లేదు. కానీ మ్యాచ్‌ల్లో మేము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా పతిరన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు బౌలింగ్‌ యాక్షన్‌ అద్భుతంగా ఉంది. అతడిని బ్యాటర్లు ఎదుర్కొవడం అంత సులభం కాదు. పతిరన అచ్చం మలింగ బౌలింగ్‌ యాక్షన్‌ను పోలి ఉన్నాడు."

-- ఎంఎస్​ ధోనీ, చెన్నై జట్టు కెప్టెన్​

"నేను ఎప్పుడూ ఫాస్ట్‌ బౌలర్లకు సపోర్ట్‌గా ఉంటాను. ఫీల్డ్‌ కూడా పేసర్లకు నచ్చిన విధంగానే సెట్‌చేస్తాను. వికెట్‌పై మంచు ప్రభావం ఉంటుందనే నేను తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాను. నేను ఊహించిన విధంగానే సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కన్పించింది. కాన్వే మరోసారి క్లాస్‌ను చూపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో నాకు బెస్ట్‌ క్యాచ్‌ అవార్డు రాలేదు.​ గతంలో రాహల్‌ ద్రవిడ్‌ కూడా అచ్చం ఇటువంటి క్యాచ్‌నే తీసుకున్నాడు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇక వయసు పెరిగితే అనుభవం వస్తుంది. నా వయసు కూడా పైబడింది. ఈ విషయం చెప్పేందుకు నేను ఏ మాత్రం సిగ్గుపడను. సచిన్‌లా 16 ఏళ్లకే కెరీర్‌ మొదలపెడితే ఆటను మరింత ఆస్వాదించవచ్చు" అంటూ చెప్పుకొచ్చాడు.

dhoni
ధోనీ

ధోనీ మార్క్‌ రనౌట్‌
వయసు పెరిగినా తన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాల్లో ఏ మార్పూ లేదని మహేంద్రసింగ్‌ ధోనీ మరోసారి రుజువు చేశాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో.. జడేజా బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడబోగా.. బంతి అతడి బ్యాట్‌కు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేశాడు ధోనీ. అలాగే చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేయడంలోనూ ధోనీ తన మార్కు చూపించాడు. 41 ఏళ్ల వయసులోనూ ఈ సీఎస్కే కెప్టెన్‌ తాజాగా టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.