ETV Bharat / sports

భారీ షాట్లు ఆడనివ్వలేదు: కోహ్లీ.. పట్టుదలతో ఆడాం: విలియమ్సన్

author img

By

Published : Oct 7, 2021, 10:09 AM IST

బుధవారం సన్​రైజర్స్​ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(SRH vsRCB 2021) మధ్య జరిగిన మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్​లో తమను భారీ షాట్లు ఆడనివ్వకుండా హైదరాబాద్​ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli News). మ్యాక్స్​వెల్ రనౌట్​ కావడమే ఈ మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు. మరోవైపు.. మ్యాక్స్​వెల్​ను ఎలాగైనా ఔట్​ చేయాలని అనుకున్నట్లు విలియమ్సన్(Williamson News) తెలిపాడు.

virat kohli, williamson
విరాట్ కోహ్లీ, విలియమ్సన్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో(SRH vs RCB 2021) ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli News) అన్నాడు. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ నాలుగు పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ మాట్లాడుతూ చివర్లో తమని హైదరాబాద్‌ బౌలర్లు భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారని చెప్పాడు.

సన్​రైజర్స్​ ఆధిపత్యం చూపింది

"మేం వీలైనంత త్వరగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నాం. ఇలాంటి స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లను ఆఖరివరకూ తీసుకెళ్లాలనుకోలేదు. కానీ, ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోవడం వల్ల ఇన్నింగ్స్‌ను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, మ్యాక్స్​వెల్ రనౌట్‌ కావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. మరోవైపు డివిలియర్స్‌ క్రీజులో ఉన్నంతవరకూ మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. తొలుత బౌలింగ్‌లో బాగా రాణించినా బ్యాటింగ్‌లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయాం. చివర్లో షాబాజ్ అహ్మద్‌ ‌(14) విలువైన పరుగులు చేశాడు. ఇది స్వల్ప స్కోర్ల మ్యాచ్‌ అయినా సన్‌రైజర్స్‌ చివరిబంతి వరకూ పోరాడింది. ఆఖర్లో వాళ్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి మమ్మల్ని భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారు. మాది ప్రొఫెషనల్‌ జట్టు అయినందున గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాం. ఒక్కోసారి ఇలాంటి ఓటములు ఎదురవుతుంటాయి. అయినా, మేం ముందుకు సాగుతుంటాం. అలాగే ఈ ఐపీఎల్‌ టోర్నీ ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి యువకుడు 150 కిమీ వేగంతో బౌలింగ్‌ చేయడం బాగుంది. ఫాస్ట్‌ బౌలర్లు ఇలా రాణించడం టీమ్‌ఇండియా క్రికెట్‌కు శుభపరిణామం" అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

అదే మా విజయానికి కారణం

ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(williamson news) మాట్లాడుతూ.. ఇది తమకు కష్టతరమైన సీజన్‌ అయినా ఇలాంటి విజయాలు సాధించడం గొప్పగా ఉందని చెప్పాడు. "చిన్న చిన్న మార్పులతో ఇలాంటి ఫలితాలు సాధించడం బాగుంది. మేం చేసింది 141 పరుగులే అయినా బెంగళూరును అడ్డుకోవడానికి సరిపోతాయని అనుకున్నాం. చివరి వరకూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తే గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఎలాగైనా మ్యాక్స్​వెల్​ను ఔట్ చేయాలనుకున్నాం. అదే మా విజయానికి బాటలు వేస్తుందని భావించాం. మేం ప్లేఆఫ్స్‌ పోటీలో లేకున్నా ఆటగాళ్లలో ఇలాంటి పట్టుదల చూడటం అద్భుతంగా ఉంది. అలాగే మా బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రత్యేకమని చెప్పాలి. అతడు నెట్స్‌లోనూ అంతే తీవ్రంగా సాధన చేస్తాడు. మరీ ముఖ్యంగా స్లో పిచ్‌లపైనా తన ప్రభావం చూపిస్తున్నాడు. అతడికి జట్టులో చాలా మంది సీనియర్లు సహకరిస్తున్నారు. ఇక శుక్రవారం కూడా మేం ఇలాగే ఆడి చివరి మ్యాచ్‌ను గెలుస్తామనే నమ్మకం ఉంది" అని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ వివరించాడు.

ఇదీ చదవండి:

RCB Vs SRH: ఉత్కంఠ పోరులో సన్​రైజర్స్​దే విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.