ETV Bharat / sports

IPL 2023 KKR VS RCB : ఆర్సీబీ పేలవ ఫీల్డింగ్​.. 580 రోజుల తర్వాత కోహ్లీ అలా..

author img

By

Published : Apr 26, 2023, 10:31 PM IST

Updated : Apr 26, 2023, 10:47 PM IST

IPL 2023
IPL 2023 KKR VS RCB : ఆర్సీబీ పేలవ ఫీల్డింగ్​.. 580 రోజుల తర్వాత కోహ్లీ అలా..

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్​తో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు చెత్త ఫీల్డింగ్ చేసింది. అయితే ఈ పోరులో కెప్టెన్​గా కోహ్లీకి.. దాదాపు 580 రోజుల తర్వాత అలా జరిగింది. ఇక కేకేఆర్ బ్యాటర్​ జేసన్​ రాయ్ హాఫ్​ సెంచరీతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ వివరాలు..

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం స్టాండ్​ ఇన్​ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో.. గత రెండు మ్యాచుల నుంచి డుప్లెసిస్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే చేస్తున్నాడు. అయితే తాజాగా బుధవారం కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్‌లోనూ డుప్లెసిస్‌ మరోసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలో దిగగా.. కోహ్లీ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన కోహ్లీ.. ఈసారి మాత్రం గెలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ సారథిగా 580 రోజుల తర్వాత టాస్‌ నెగ్గాడు. విరాట్​ ఆఖరిసారిగా 2021 ఐపీఎల్‌లో కోల్​కతాతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అతడు.. తాజాగా ఈ సీజన్​లో మళ్లీ అదే కోల్​కతా మ్యాచ్‌లోనే తాత్కాలిక కెప్టెన్‌గా టాస్‌ నెగ్గాడు.

ఆర్సీబీ దారుణ ఫీల్డింగ్​.. ఈ మ్యాచ్​లో బెంగళూరు జట్టు దారుణంగా ఫీల్డింగ్‌ చేసింది. ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల.. కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రానా మూడుసార్లు ఔటయ్యే ఛాన్స్​ నుంచి తప్పించుకున్నాడు. మొదట నితీష్‌ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌కుమార్‌ బౌలింగ్‌లో లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడాడు. అయితే సిరాజ్‌.. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. రెండోసారి సిరాజ్‌ బౌలింగ్​లో ఫైన్‌లెగ్‌ దిశగా ఆడాడు. అప్పుడు అక్కడే ఉన్న ఫీల్డర్‌ మరోసారి క్యాచ్‌ను వదిలేశాడు. ముచ్చటగా మూడోసారి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో రానా లాంగాన్‌ దిశగా షాట్​ బాదగా.. మ్యాక్స్‌వెల్‌ క్యాచ్​ను జాడవిరిచాడు. ఇలా మూడుసార్లు ఔటయ్యే ఛాన్స్​ నుంచి తప్పించుకున్నాడు.

జేసన్​ రాయ్​ సూపర్​ ఇన్నింగ్స్​.. ఇకపోతే ఈ మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ వరుసగా రెండో హాఫ్​సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన అతడు 22 బంతుల్లోనే ఈ హాఫ్​ సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. 4 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో ఈ ఫీట్​ను అందుకున్నాడు. అలానే ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన షాబాజ్‌ అహ్మద్​ను బెంబేలెత్తించాడు జేసన్‌ రాయ్‌. ఆ ఓవర్​లో నాలుగు సిక్సర్లు బాదిన అతడు 24 పరుగులు సాధించాడు. మొత్తంగా 29 బంతుల్లో 56 పరుగులు చేసిన అతడు విజయ్‌కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్​గా వెనుదిరిగాడు. ఇకపోతే ఈ మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హసరంగ, విజయకుమార్ వైశాఖ్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

కేకేఆర్‌ తరపున అత్యధిక సిక్సర్లు.. ఇంకా ఈ మ్యాచ్​లో సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు నితీశ్ రానా. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే హసరంగా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే ఓ రికార్డును కూడా అందుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో కోల్​కతా తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా ఘనత సాధించాడు.

ఇదీ చూడండి: అదరగొడుతున్న అభినవ్​.. టీమ్ఇండియాకు కొత్త ఫినిషర్ దొరికినట్టేనా?

Last Updated :Apr 26, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.