ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం బీసీసీఐ విశ్వప్రయత్నాలు.. ఎందుకు?

author img

By

Published : May 21, 2021, 5:03 PM IST

IPL 2021: Why the show must go on
ఐపీఎల్

ఈ ఏడాది కొందరు ఆటగాళ్లకు కరోనా రావడం వల్ల ఐపీఎల్ సీజన్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే మిగిలిన మ్యాచ్​ల విషయంలో బీసీసీఐ కచ్చితంగా ఉంది. పలువురు మాత్రం టోర్నీ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది?

ఐపీఎల్​.. బీసీసీఐకి వేలకోట్ల రూపాయలు తెచ్చిపెట్టే ఆదాయవనరు. ప్రతి ఏడాది వేసవిలో మన దేశంలో జరిగే ఈ టోర్నీ కోసం విదేశీ క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదృష్టం బాగుంటే ఒక్క సీజన్​తో స్టార్లు అయిపోతారు. అలాంటిది ఈ సీజన్​లో పలువురు ఆటగాళ్లు వైరస్​ బారిన పడటం వల్ల ఎప్పుడూ లేనిది లీగ్ నిరవధిక వాయిదా పడింది.

కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఓవైపు మనుషులు చనిపోతుంటే, లీగ్ నిర్వహించడమేంటి? అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ మాత్రం మిగిలిన మ్యాచ్​ల్ని ఈ ఏడాదే కచ్చితంగా నిర్వహిస్తామనే పట్టుదలతో ఉంది.

గతేడాది సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య యూఏఈ వేదికగా బీసీసీఐ, ఐపీఎల్​ 13వ సీజన్​ నిర్వహించింది. అది జరిగిన నాలుగు నెలల తర్వాత, అంటే ఏప్రిల్ 9 నుంచి కొత్త సీజన్​ను స్వదేశంలో​ ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో భారత్​లో కరోనా సెకండ్​ వేవ్ మొదలవడం, వైరస్​ ప్రభావంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అలాంటి సమయంలోనూ ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు విజయవంతంగా జరిగాయి.

IPL TROPHY
ఐపీఎల్ ట్రోఫీ

ఆ కారణం వల్లే సీజన్​ వాయిదా!

సీజన్​లోని 31 మ్యాచ్​లు బాగానే జరిగాయి. అయితే దిల్లీ, అహ్మదాబాద్​ చేరుకున్న తర్వాత కోల్​కతా, చెన్నై, దిల్లీ, హైదరాబాద్​ జట్లలోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అప్పుడు తొలుత మ్యాచ్​ల్ని వాయిదా వేశారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం సీజన్​ను వాయిదా వేసినట్లు బోర్డు వెల్లడించింది.

రద్దయితే బీసీసీఐకి భారీ నష్టం!

ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్​ కచ్చితంగా జరుపుతామని బీసీసీఐ చెప్పడానికి కారణం దాని ద్వారా వచ్చే ఆదాయం. ఒకవేళ ఈ సీజన్​ రద్దయితే దాదాపు రూ.2500 కోట్లు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే కరోనా కారణంగా దేశవాళీ మ్యాచ్​లు, స్వదేశంలో సిరీస్​లు లేక బోర్డు చాలా నష్టపోయింది. ఈ సీజన్ కూడా జరగకపోతే అంతే సంగతులు!

dhoni rohit sharma
ధోనీ రోహిత్ శర్మ

ఎస్​జీఎమ్ మీటింగ్​తో రానున్న క్లారిటీ

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా, ఐపీఎల్​ పాలకమండలి అధ్యక్షుడు బ్రిజేశ్ పటేల్.. మే 29న స్పెషల్ జనరల్ మీటింగ్​లో(ఎస్​జీఎమ్) ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​లు, దేశవాళీ సీజన్​ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా వీటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

మ్యాచ్​లపై బోర్డు సందిగ్ధత

మిగిలిన ఐపీఎల్ మ్యాచ్​ల్ని ఎప్పుడు, ఎక్కడ జరపాలో బోర్డు నిర్ణయం తీసుకోలేకపోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​ కోసం త్వరలో ఇంగ్లాండ్​ వెళ్లనున్న టీమ్​ఇండియా.. ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడతుంది. అనంతరం టీ20 ప్రపంచకప్​ కోసం స్వదేశానికి వస్తుంది. కోహ్లీసేనకు ఇంత పకడ్బందీ షెడ్యూల్​ ఉండటం వల్ల ఐపీఎల్​ మ్యాచ్​ల్ని ఎప్పుడు జరపాలో బోర్డుకు అర్థం కావట్లేదు.

kohli rohit sharma
విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ

మిగతా సీజన్​ అప్పుడేనా?

టీ20 ప్రపంచకప్​ తర్వాత దక్షిణాఫ్రికా మన దేశానికి రావాల్సి ఉంది. ఇప్పుడు ఆ పర్యటనను రద్దు చేసి, ఆ స్థానంలో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్​ల్ని జరపాలని బీసీసీఐ భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.