ETV Bharat / sports

వారితో నేను పోటీ పడలేదు.. ఎందుకంటే: గంగూలీ

author img

By

Published : Jun 13, 2022, 8:35 AM IST

ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కన్నా భారత టీ20 లీగ్​కే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌ చాలా అభివృద్ధి చెందిందన్నాడు. టీమ్​ఇండియాలో తన కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాడు. ఏమన్నాడంటే...

ganguly
గంగూలీ

Ganguly IPL: ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కన్నా ఐపీఎల్​కే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. తాజాగా ఇండియా లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న అతడు భారత టీ20 లీగ్‌ గురించి, టీమ్‌ఇండియాలో తన కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌ చాలా అభివృద్ధి చెందిందన్నాడు.

"ఈ గేమ్‌ ఎంత అభివృద్ధి చెందిందో నేను కళ్లారా చూశాను. నాలాంటి క్రికెటర్లు ఇక్కడ వందల్లో సంపాదిస్తే.. ఇప్పటి ఆటగాళ్లు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఐపీఎల్​ అనేది క్రికెట్‌ అభిమానుల నుంచి పుట్టింది. వాళ్లే ఈ టోర్నీని నడిపిస్తున్నారు. ఇదెంతో బలమైన లీగ్‌. మున్ముందు ఇలాగే మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కన్నా అధిక ఆదాయం ఆర్జిస్తోంది. నేను ఎంతగానో ఇష్టపడే ఆట ఈ స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉందిఠ అని గంగూలీ చెప్పాడు.

అలాగే టీమ్‌ఇండియాలో తన కెప్టెన్సీ ఎలా ఉండేదని కూడా తెలిపాడు. "నాకు కెప్టెన్సీ అనేది మైదానంలో జట్టును ముందుండి నడిపించడం. లీడర్‌షిప్ అనేది జట్టును బలంగా తీర్చిదిద్దడం. అలాంటప్పుడు నేను.. అజహరుద్దీన్‌తో పనిచేసినా.. సచిన్‌, ద్రవిడ్‌లతో పనిచేసినా వారితో పోటీపడలేదు. వాళ్లతో కలిసిపోయి బాధ్యతలను పంచుకున్నా" అని వివరించాడు. భారత్‌లో అద్భుత నైపుణ్యం ఉందని.. యువ క్రికెటర్ల నుంచి యువ వ్యాపారవేత్తలు, ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారని చెప్పాడు. తాను విజయవంతమైన కెప్టెన్‌గా ఉండాలంటే తన తోటి ఆటగాళ్లను గౌరవప్రదంగా చూడాలనుకున్నట్లు చెప్పాడు. దాంతో వాళ్లు అత్యుత్తమ క్రికెటర్లుగా తయారవుతారని నమ్మినట్లు గంగూలీ పేర్కొన్నాడు.

2023-27 ఐపీఎల్‌ మీడియా ప్రసార హక్కుల కోసం ప్రారంభించిన వేలం బీసీసీఐకి భారీగానే కాసుల వర్షం కురిపిస్తోంది. ఆదివారం ఈ-వేలం ప్రారంభం కాగా ఊహించినట్లుగానే అనూహ్య స్పందన వ్యక్తమైంది. తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్ల రూపాయలు పలికింది. వేలం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, ఈ విలువ మరింత పెరుగుతుందని అంచనా. దీని గురించి దాదా మాట్లాడుతూ.. "గతంలో టీ20 లీగ్ టీవీ ప్రసారాల కోసం తీవ్ర పోటీ ఉండేది. కానీ ఇప్పుడు దీనికి దీటుగా డిజిటల్‌ ప్రసారాల కోసం సంస్థలు సై అంటున్నాయి. తొలి రోజు వేలం చివరకు ప్యాకేజీ 'ఎ'లోని టీవీ ప్రసారాల హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.57 కోట్ల ధర పలికితే.. ప్యాకేజీ 'బి'లోని డిజిటల్‌ ప్రసారాల కోసం ఆ ధర ఏకంగా రూ.48 కోట్లకు చేరడం విశేషం. గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌, ఓటీటీలకు ఆదరణ పెరగడంతో డిజిటల్‌ ప్రసారాల కోసం మునుపెన్నడూ లేనంత డిమాండ్‌ ఏర్పడింది. 2017లో 2018-22కి గాను అయిదేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం 14 సంస్థలు పోటీపడ్డాయి. ఈ సారి ఏడు సంస్థలు.. డిస్నీ స్టార్‌, సోనీ, రిలయన్స్‌ వయాకామ్‌, జీ, ఫన్‌ ఆసియా, సూపర్‌ స్పోర్ట్‌, టైమ్స్‌ ఇంటర్నెట్‌ బిడ్డింగ్‌లో నిలిచాయి. అయినప్పటికీ గత మొత్తం రూ.16,347.50 కోట్ల (స్టార్‌ ఇండియా సొంతం చేసుకుంది)తో పోలిస్తే తొలి రోజు వేలంలో దానికంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర పలకడం విశేషం.

ఇదీ చూడండి: అర్థం లేదనిపించింది.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా: మిథాలీ రాజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.