ETV Bharat / sports

అదరగొట్టిన బౌలర్లు.. మహిళల రెండో T20లో బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

author img

By

Published : Jul 11, 2023, 5:26 PM IST

Updated : Jul 11, 2023, 5:52 PM IST

India vs Bangladesh
India vs Bangladesh womens t20

India W vs Bangladesh W 2nd T20 : భారత మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.

India W vs Bangladesh W 2nd T20 : బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్‌తో బంగ్లా జట్టును బెంబేలెత్తించి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్​కు దిగిన హర్మన్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. అయితే, ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కాపాడుకుంది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు అవసరం కావడం వల్ల మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారింది. అయితే చివరి ఓవర్‌లో షెఫాలీ వర్మ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక ఈ ఓవర్‌లో ఓ రనౌట్‌ కూడా ఉంది. ఇక ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ (19) టాప్‌ స్కోరర్​గా నిలవగా.. అమన్‌జ్యోత్‌ కౌర్‌(14), స్మృతి మంధాన (13), యస్తికా భాటియా (11), దీప్తి శర్మ (10) పరుగులు చేశారు. మరోవైపు తొలి టీ20లో హాఫ్​ సెంచరీ బాదిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా 3, ఫాహిమా 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు 87 పరుగులకు ఆలౌట్‌ చేశారు. ఆ టీమ్​కు చెందిన నిగర్ సుల్తానా (38) మాత్రమే రెండంకెల స్కోర్​ చేయగలిగింది. దీప్తి శర్మ (3/12), షెఫాలీ వర్మ (3/15), మిన్ను మణి (9/2) బంగ్లా పతనాన్ని శాసించారు. మూడో టీ20 జులై 13న జరగనుంది.

తొలి మ్యాచ్​లోనూ అదుర్స్..
India W vs Bangladesh W 1st T20 : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లోనూ ఉమెన్​ క్రికెటర్స్​ సత్తా చాటారు. తొలి టీ20లో హర్మన్​ప్రీత్​​ సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్​ను.. భారత బౌలర్లు 114/5కు కట్టడి చేశారు. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ఇండియా.. 16.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షెఫాలీ వర్మ (0), జెమీమా రోడ్రిగ్స్‌ (11) విఫలమయ్యారు. దీంతో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (54; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (38; 34 బంతుల్లో 5 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో భారత్ సునాయాశంగా విజయం సాధించింది.

Last Updated :Jul 11, 2023, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.