ETV Bharat / sports

టీమ్​ఇండియా- బంగ్లాదేశ్​ వన్డే సిరీస్​.. గెలుపెవరిదో?

author img

By

Published : Dec 3, 2022, 8:11 PM IST

india bangladesh first one day match preview
ఇండియా- బంగ్లాదేశ్‌

వన్డే ప్రపంచకప్‌నకు సమయం సమీపిస్తున్న వేళ టీమ్​ఇండియా బంగ్లాదేశ్‌తో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు బంగ్లాతో రోహిత్‌ సేన తొలి వన్డే ఆడనుంది. కివీస్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్‌ ఆటగాళ్లు మళ్లీ జట్టులో చేరడం వల్ల భారత్‌ పటిష్టంగా కనిపిస్తోంది. పసికూన ముద్రను తొలగించేసుకున్న బంగ్లా పులులు సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఈ సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. రేపు జరగబోయే తొలి మ్యాచ్‌లో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

టీమ్​ఇండియా బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. కివీస్‌ పర్యటనకు దూరంగా ఉన్న సీనియర్‌ ఆటగాళ్లు మళ్లీ జట్టులో చేరడంతో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్‌తో పాటు ఓపెనింగ్‌కు ధవన్‌, కేఎల్ రాహుల్‌లో ఎవరు వస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. చాలా కాలంగా భారత్ టాప్‌ ఆర్డర్‌ లయ కుదరక ఇబ్బందులు జట్టు ఎదుర్కొంటోంది.

గతంలో రోహిత్‌కు జోడీగా ధావన్‌ బాగానే రాణించినా కొన్ని రోజులుగా పవర్‌ ప్లేలో పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ధావన్‌కు మొదటి మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే రోహిత్‌ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. మూడో నెంబర్‌లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. రిషభ్ పంత్.. ఇషాన్ కిషన్‌లలో ఎవరికీ జట్టులో చోటు దక్కనుందో చూడాలి. రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠీలను తుది జట్టులో తీసుకునే అవకాశాలున్నాయి. వన్డే ప్రపంచకప్‌నకు సమయం సమీపిస్తున్న వేళ జట్టు కుర్పునకు ఈ సిరీస్‌ను అవకాశంగా భావించుకోవాలి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

గాయం కారణంగా పేసర్ మహ్మద్‌ షమీ దూరం కావడంతో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. షమీ స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ తుది జట్టులోకి రానున్నాడు. దీపక్ చాహర్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌లతో పేస్‌ విభాగం పర్వాలేదనిపిస్తోంది. ఇటీవల టీ-20 ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌ను బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ లిట్టన్ దాస్ ఊచకోత కోశాడు. నూతనంగా సారథిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో లిట్టన్ దాస్ మరింత బాధ్యతగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన బౌలర్ తస్కిన్‌ అహ్మద్‌ లేకపోవడం బంగ్లాదేశ్‌ను కలవరపెడుతోంది. ముస్తాఫిజుర్, ఎబడాట్ హుస్సేన్ , షకీబ్‌ అల్ హసన్‌లు ఫాంలో ఉండటం బంగ్లాదేశ్‌కు కలిసిరానుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌తో భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.