IND VS NZ: రోహిత్ మళ్లీ ఫెయిల్​​.. కానీ ధోనీ రికార్డ్​ బ్రేక్​!

author img

By

Published : Jan 18, 2023, 4:12 PM IST

IND VS NZ First ODI uppal match Rohith break dhoni record

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో హిట్​మ్యాన్​ తక్కువ స్కోరుకే ఔటైనప్పటికీ మాజీ సారథి ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ వివరాలు..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్​ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాలో ఓపెనర్​గా బరిలోకి దిగిన రోహిత్‌ 38 బంతుల్లో 2 సిక్స్​లు, 4 ఫోర్లు సాయంతో 34 పరుగులు చేశాడు. అయితే మూడో ఓవర్‌లో కివీస్‌ బౌలర్‌ హెన్రీ షిప్లే బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా ఓ సిక్సర్‌ బాదాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్‌ బద్దలు కొట్టాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలిం‍గ్‌లోనే రోహిత్‌ మరో సిక్స్‌ కొట్టాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై తన ఖాతాలో ఉన్న సిక్స్​ల సంఖ్య 125కు చేరింది. ఆ తర్వాత ధోనీ 123, యువరాజ్ సింగ్​ 71 బాదారు.

శుభారంభం అందించినా.. వరుస వైఫల్యాలు.. ఇకపోతే రోహిత్‌ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మూడు అంకెల స్కోరు సాధించలేక కష్టపడుతున్నాడు. అయితే గత కొన్ని మ్యాచుల నుంచి హిట్​మ్యాన్​ను గమనించినట్టైతే.. అతడు బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ఆరంభాలే అందించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు.

  • రీసెంట్​గా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఇదే జరిగింది. లంకపై తొలి వన్డేలో 83 పరుగులు(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు హిట్‌మ్యాన్‌. ఈ మ్యాచ్‌లో అతడు సెంచరీ సాధిస్తాడని అంతా ఊహించినప్పటికీ విఫలమయ్యాడు. 17 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
  • రెండో వన్డేలో 21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 17 పరుగులు చేసి నిరాశపరిచాడు.
  • మూడో వన్డేలో 42 పరుగులు(49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి శుభారంభాన్ని అందించినా ముందుకు సాగలేకపోయాడు.
  • అంతకుముందు బంగ్లాదేశ్‌ పర్యటనలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించాడు. తొలి వన్డేలో 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 27 పరుగులు చేశాడు.
  • రెండో వన్డేలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 51 రన్స్​(28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి నాటౌట్​గా నిలిచాడు. కానీ భారీ స్కోరు చేయలేకపోయాడు.
  • అంతకుముందు టీ20 వరల్డ్‌కప్‌-2022లోనూ రోహిత్‌ వరుసగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ 53 పరుగులు (39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. కానీ మిగతా టోర్నీలో అస్సలు రాణించలేకపోయాడు.
  • ఇక పాకిస్థాన్​పై జరిగిన మ్యాచ్​లో 4(7), దక్షిణాఫ్రికాపై 14(17), బంగ్లాదేశ్‌పై 2 (8), జింబాబ్వేపై 15 (13), సెమీస్‌లో ఇంగ్లాండ్​పై 27(28).. ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. చివరిసారిగా 2021 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్​పై సెంచరీ సాధించిన రోహిత్​.. దాదాపు ఏడాదిన్నరగా ఆ మార్కును అందుకోలేకపోతున్నాడు.

ఇదీ చూడండి: డోపింగ్​ పరీక్షలో ఫెయిల్​.. ద్యుతి చంద్​పై తాత్కాలిక నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.