ICC టీ20 క్రికెటర్​ ఆఫ్​ ద ఇయర్​గా సూర్య.. ఈ 'స్కై'కి ఆకాశం కూడా హద్దు కాదు!

author img

By

Published : Jan 25, 2023, 5:29 PM IST

surya kumar yadav

ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్​గా టీమ్ ​ఇండియా స్టార్‌ బ్యాటర్ సూర్య కుమార్‌ యాదవ్‌ నిలిచాడు. మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకునే ఈ స్టార్​ ప్లేయర్​కు ఈ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2022 ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్​గా టీమ్​ఇండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపికయ్యాడు. గతేడాది మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్కైను ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్​(ఐసీసీ) బుధవారం ప్రకటించింది. 2022లో ఈ క్రికెటర్​ ఆడిన 31 మ్యాచ్‌ల్లో 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

గతేడాది జరిగిన పలు కీలక మ్యాచ్‌ల్లో టీమ్​ ఇండియాను విజేతగా నిలపడంలోనూ తనదైన పాత్ర పోషించాడు సూర్యకుమార్​. అలా ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్​గా నిలిచాడు. ఇంతే కాకుండా తన లిస్ట్​లో ఎన్నో రికార్డులున్నాయి. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 68 సిక్సర్లు బాది పొట్టిఫార్మాట్లో ఏడాది కాలంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగానూ సూర్య కుమార్​ రికార్డుకెక్కాడు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్​లోనూ సూర్య కుమార్ చెలరేగిపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన ఈ స్టార్​ ప్లేయర్​ 189కు పైగా స్ట్రైక్‌రేటుతో దుమ్మురేపాడు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్‌ ద్వైపాక్షిక సిరీస్‌లో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 890 రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు​. కాగా గతేడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన నాటింగ్‌హాం మ్యాచ్‌లో సూర్య తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ శతకం బాదాడు. ఉత్కంఠంగా జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించి సంచలనాన్ని సృష్టించాడు స్కై. తాజాగా ఐసీసీ అవార్డు గెలుచుకోవడం వల్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కైకి ఆకాశం కూడా హద్దు కాదని ట్వీట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.