ETV Bharat / sports

టీ20 రికార్డులపై కన్నేసిన కోహ్లీ, రోహిత్​

author img

By

Published : Mar 11, 2021, 4:04 PM IST

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​ రికార్డులను వేదికగా కానుంది. అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల మైలురాయికి టీమ్ఇండియా కెప్టెన్​ మరో 72 పరుగుల దూరంలో ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్​లో 12 వేల పరుగుల నమోదు చేసేందుకు కోహ్లీ మరో 17 పరుగులు దూరంలో ఉండడం విశేషం. మరోవైపు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. 67 రన్స్​ చేస్తే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

Kohli, Rohit eye batting milestones as India gear up for T20I challenge vs England
టీ20 రికార్డులపై కన్నేసిన కోహ్లీ, రోహిత్​

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో విజేతగా నిలిచిన కోహ్లీసేన టీ20 సిరీస్​లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మార్చి 12 (శుక్రవారం) నుంచి జరగనున్న ఈ సిరీస్​కు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టెస్టు సిరీస్​లో పరాభవాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్​ జట్టు.. టీ20 సిరీస్​నైనా చేజిక్కించుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది.

ఈ సిరీస్​ రాబోయే టీ20 ప్రపంచకప్​కు సన్నాహకంగా మారనుందని ఇరుజట్లు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో సత్తా చాటిన ఆటగాళ్లనే ప్రపంచకప్​ తుదిజట్టులో అవకాశం కల్పిస్తామని టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్​ విక్రమ్​ రాథోడ్​ ఇటీవలే స్పష్టం చేశాడు.

టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య ఇప్పటివరకు జరిగిన 14 టీ20ల్లో చెరో 7 మ్యాచ్​ల్లో విజయం సాధించాయి.

ఆ రికార్డుల వివరాలు.. ​

అయితే ఈ సిరీస్​లోనే బ్యాటింగ్​లో సరికొత్త​ రికార్డులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో 3వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి.. టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మరో 72 పరుగులు చేయాల్సిఉంది. అదే విధంగా టీ20ల్లో అత్యధిక రన్స్​ చేసిన రెండో బ్యాట్స్​మన్​ను మార్టిన్​ గప్తిల్​ను అధిగమించేందుకు వైస్​కెప్టెన్​ రోహిత్​ శర్మ.. మరో 67 పరుగులు చేయాల్సిఉంది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..

విరాట్​ కోహ్లీ - 2,928

మార్టిన్​ గప్తిల్​ - 2,839

రోహిత్​ శర్మ - 2,773

ఆరోన్​ ఫించ్​ - 2,346

షోయబ్​ మాలిక్​ - 2,335

అంతర్జాతీయ క్రికెట్​లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకోవాడానికి టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మరో 17 పరుగుల దూరంలో ఉండడం విశేషం. ఈ రికార్డును అందుకుంటే.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో బ్యాట్స్​మన్​గా కోహ్లీ నిలుస్తాడు. ఇందులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​ (15,440) అగ్రస్థానంలో ఉండగా.. గ్రేమ్​ స్మిత్​ (14,878) రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ రికార్డులన్నీ ఇంగ్లాండ్​తో జరగనున్న సిరీస్​లో నమోదయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: పృథ్వీ షా రికార్డ్​- హజారే టోర్నీలో మరో శతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.