ఐపీఎల్ 14వ సీజన్కు ముందు కరోనా కలవర పెడుతోంది. తాజాగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఎనిమిది మంది గ్రౌండ్ స్టాఫ్కి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. దీంతో ఫ్రాంఛైజీలు కరోనా మార్గదర్శకాలను మరింత కఠినం చేయనున్నాయి. మొత్తం పది ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది ఈ మైదానం.
"లీగ్ ప్రారంభానికి మరో వారం రోజులు కూడా లేదు. కొవిడ్ కేసుల వార్త కొంచెం కలవరపాటుకు గురిచేస్తోంది. మేము ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైనంత ఎక్కువగా మార్గదర్శకాలను కఠినతరం చేయనున్నాం" అని ముంబయిలో ఉన్న ఓ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.
ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు ఇలాంటి సంఘటన మేల్కొలుపు లాంటిందని మరో ఫ్రాంఛైజీ పేర్కొంది. "మేము కొన్నిసార్లు బబుల్ లోపల సౌకర్యవంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ, ప్రతి నిబంధన తప్పకుండా పాటించాలని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి" అని తెలిపింది.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 10 నుంచి 25 వరకు పది మ్యాచ్లు జరగనున్నాయి. ఈ గ్రౌండ్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న దిల్లీ, చెన్నై మధ్య జరగనుంది.
మహారాష్ట్రలో రోజురోజుకీ కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 47వేల 827 కొత్త కేసులు వెలుగుచూశాయి. 202 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 8,832 కేసులు వచ్చాయి. 8,500 పైగా కేసులు రావడం ఇది వరుసగా రెండో రోజు.
ఇదీ చదవండి: విండీస్ను రెండోసారి జగజ్జేతగా నిలిపిన బ్రాత్వైట్