టీమ్ఇండియాకు వేర్వేరు పాత్రలు పోషించే, వేర్వేరు స్థానాల్లో ఆడగలిగే క్రికెటర్ల అవసరం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అప్పుడే మ్యాచులను ముగిస్తున్న హార్దిక్ పాండ్యపై ఒత్తిడి తగ్గుతుందని అన్నాడు. డెత్ ఓవర్లలో అతడికి ఎవరో ఒక ఆటగాడు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నాడు. ఆసీస్తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో పాండ్య దుమ్మురేపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"భారత క్రికెట్ జట్టు స్వర్ణయుగాన్ని చూడండి. ఎంఎస్ ధోనీకి యువీ ఉన్నాడు. ప్రపంచంలోనే మహీ అత్యుత్తమ ఫినిషర్. కానీ అతడికీ ఎవరో ఒకరు కావాల్సి వచ్చింది. ఒక్కడే అన్ని మ్యాచులనూ ముగించలేడు. జట్టులో ఒక్క హార్దిక్ మాత్రమే ఫినిషర్గా ఉంటే అతడి పాత్రలు, బాధ్యతలు చాలా మారతాయి" అని చోప్రా అన్నాడు.
జట్టులో విరాట్ కాకుండా ఇంకొకరు మరో ఫినిషర్ బాధ్యతను తీసుకోవాల్సి ఉందని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. "జట్టులో ఐదారుగురు బ్యాట్స్మెన్ ఉంటే ప్రతి ఒక్కరికీ వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. యాంకర్ రోల్ పోషించడం కోహ్లీకి నప్పుతుంది. ప్రపంచంలో మరెవ్వరూ అతడిలా ఆ పాత్రను పోషించలేరు. అందుకే వన్డే, టీ20ల్లో భిన్నమైన పాత్రలు పోషించే వారు అవసరం. ఎందుకంటే అతడు 170 స్ట్రైక్రేట్తో పరుగులు చేయలేడు. ప్రతిసారీ భారీ షాట్లు ఆడలేడు కదా" అని ఆకాశ్ చెప్పాడు.