ఐపీఎల్ సీజన్-13 ఎప్పుడు జరిగినా ఆటగాళ్ల వేతనాల్లో కోత ఉండదని స్పష్టం చేశాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. టోర్నీ జరగకపోతే మండలికి దాదాపు రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపాడు.
"బీసీసీఐ ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వత దాన్ని బట్టి ముందడుగు వేయాలి. ఐపీఎల్ నిర్వహించకపోతే రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఒకవేళ ఐపీఎల్ జరిగితే ఆటగాళ్లకు వేతనాల్లో కోతలు లేకుండా మేము చూస్తాము".
- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
కరోనా కారణంగా ప్రపంచ దేశాలు విధించిన ప్రయాణ పరిమితులను పరిగణలోకి తీసుకుంటే ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. టోర్నీలన్నీ ప్రారంభమైన తర్వాత ఐపీఎల్ జరపడానికి బీసీసీఐ ఎలాంటి ప్రణాళికలు చేస్తుందో చూడాల్సి ఉంది.
ఈ ఏడాది మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ లాక్డౌన్ కారణంగా మొదట ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఎక్కువ అవ్వడం వల్ల లీగ్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఉండవు
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా పాల్గొనాల్సి ఉంది. కానీ అందుకు అదనంగా మరో టెస్టును నిర్వహించే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఇరుదేశాల మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగుతాయని చెప్పింది. కానీ ఈ ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో ఐదు టెస్టుల నిర్వహణ సాధ్యం కాదని గంగూలీ స్పష్టం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్ అనుకున్న ప్రకారం జరుగుతుందని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి.. సచిన్, రోహిత్, దియా మీర్జాలకు యువీ ఛాలెంజ్