టీమ్ఇండియా సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప కెప్టెనో అందరికీ తెలిసిందే. తొలిసారి సారథ్యం వహించిన టీ20 అరంగేట్రం ప్రపంచకప్లోనే జట్టును విజేతగా నిలబెట్టాడు. తర్వాత 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ప్రపంచ క్రికెట్లో ఏ కెప్టెన్కూ సాధ్యంకాని మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అలాగే టీమ్ఇండియాను అత్యుత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ కెరీర్లో మొత్తం 72 టీ20 మ్యాచ్ల్లో నాయకత్వం వహించగా, అందులో 41 విజయాలు సాధించాడు. దాంతో పొట్టి క్రికెట్లో అతడి విజయ శాతం 59.28గా నమోదైంది.
కాగా, అఫ్గానిస్థాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ధోనీ సరసన చేరాడు. అతడు ధోనీ కన్నా ఒకింత మెరుగైన రికార్డు నెలకొల్పాడు. యూఏఈ వేదికగా అఫ్గాన్ ప్రస్తుతం జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో ఆ జట్టు 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో 2-0 ఆధిక్యంలో దూసుకుపోతోంది. అఫ్గాన్ కెప్టెన్గా అస్గర్కిది 41వ విజయం కావడం విశేషం. దీంతో అతడు ధోనీ సరసన నిలిచాడు. అయితే, మొత్తం 51 టీ20లకు నాయకత్వం వహించిన అస్గర్ కేవలం 10 మ్యాచ్ల్లోనే విఫలమయ్యాడు. దాంతో అతడి విజయ శాతం 81.37గా నమోదైంది. ఇది ధోనీ కన్నా గొప్ప రికార్డు.