ఒకప్పుడు అగ్రశ్రేణి జట్టుగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా... ప్రస్తుతం సరైన నాయకత్వం, సీనియర్ క్రీడాకారులు లేక సతమతమవుతోంది. అందుకే దేశంలో క్రికెట్ను, జట్టును రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది సఫారీ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగానే మాజీ క్రికెటర్, ప్రపంచ టాప్ సారథుల్లో ఒకరైన గ్రేమ్ స్మిత్ను బోర్డు అధ్యక్షుడిగా నియమించి, ప్రధాన కోచ్గా మార్క్ బౌచర్కు పదవీ బాధ్యతలు అప్పగించింది. వీరిద్దరి రాకతో మళ్లీ సఫారీ జట్టులో పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నారు ప్రొటీస్ జట్టు అభిమానులు. తాజాగా వారి ఆశలకు బలం చేకురుస్తూ మాజీ క్రికెటర్, టాప్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ను జట్టులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు బౌచర్.
" డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాడు. అతడిలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఇంకా ఉంది. ఏబీ తన రిటైర్మెంట్పై మళ్లీ ఆలోచించాలని కోరతాను. అతడితో పాటు మరికొంతమంది మాజీ ఆటగాళ్లతోనూ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ప్రక్షాళన చేసేందుకే కోచ్గా పదవీ బాధ్యతలు చేపట్టాను".
- మార్క్ బౌచర్, దక్షిణాఫ్రికా కోచ్
వరల్డ్ కప్ కోసమేనా..!
గతేడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత... డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. జాతీయ జట్టులో ఆడటం వల్ల పనిభారం ఎక్కువ అయిపోయిందని వెల్లడించాడు. ఈ కారణంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఈ ఏడాది వన్డే వరల్డ్కప్ జరిగినప్పుడు మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్ ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. అయితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఇతడిని వెనక్కి పిలుస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్లో మాత్రమే...
2018 మే నెలలో జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. ఆ తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్లోనూ ఆడలేదు. ఐపీఎల్ 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఏబీడీ మొత్తం 13 మ్యాచ్ల్లో 44.20 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్లో ఆడాలనుకున్నా అవకాశం దక్కలేదు.