ETV Bharat / sitara

'నీకు మాత్రమే చెప్తా'తో పదేళ్ల అనుభవమొచ్చింది:తరుణ్

author img

By

Published : Mar 13, 2020, 7:25 AM IST

Updated : Mar 13, 2020, 11:39 AM IST

'నీకు మాత్రమే చెప్తా'తో పదేళ్ల అనుభవమొచ్చింది:తరుణ్
హెస్ట్ తరుణ్ భాస్కర్

టాక్ షో 'నీకు మాత్రమే చెప్తా'.. ఈ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హోస్ట్ తరుణ్ భాస్కర్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

తొలి చిత్రం 'పెళ్లిచూపులు'తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఆ చిత్రంతో జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాడు. డైరక్టర్​గానే కాకుండా నటుడిగా, రచయితగానూ ప్రతిభ చూపుతున్నాడు. సినిమాతోపాటు వెబ్‌ సిరీస్‌, టెలివిజన్‌ షోలతోనూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 'మీకు మాత్రమే చెప్తా' చిత్రంతో వెండితెరపై కనిపించి అలరించిన తరుణ్.. బుల్లితెరపై 'నీకు మాత్రమే చెప్తా' అంటూ సందడి చేయబోతున్నాడు. తన తోటి దర్శకులతో కలిసి చేసిన ఆ టాక్‌ షో.. ఈ నెల 14 నుంచి ప్రతి శనివారం రాత్రి 9గంటలకు ఈటీవీ ప్లస్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌తో ముచ్చటించింది 'ఈనాడు'.

  • ఒక పక్క దర్శకత్వం, మరోపక్క నటన కొనసాగిస్తున్నారు. ఇప్పుడేమో 'నీకు మాత్రమే చెప్తా' అంటూ బుల్లితెరపై సందడికి సిద్ధమయ్యారు?

తొలినాళ్లలో పోస్టర్లు డిజైన్‌ చేశా. ఆ తర్వాత పెళ్లిళ్లకు ఫొటోలు తీసేవాడిని. అప్పట్లో నాకొక చిన్న ఆఫీస్‌ ఉండేది. దానికి అద్దె కట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు ఏ అవకాశంతో నా దగ్గరికొచ్చినా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటుంటా. శ్రీకాంత్‌, శరత్‌, ప్రభు వచ్చి... ఒక టెలివిజన్‌ షో చేయాలి, అందులో దర్శకుల అనుభవాల్ని పంచుకోవాలని చెప్పేసరికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. దర్శకులు వాళ్ల వ్యక్తిగత ప్రయాణాన్ని, అనుభవాల్ని పంచుకునే షో ఇది. చాలా మంది దర్శకులు వాళ్ల జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాల్ని, కొన్ని ఆసక్తికరమైన సంఘటనల్ని పంచుకున్నారు. ఎప్పుడూ బయటికి చెప్పని షాకింగ్‌ నిజాల్ని చెప్పారు.

  • మీతోటి దర్శకులు వాళ్ల అనుభవాల్ని పంచుకున్నప్పుడు మీకు మీ ప్రయాణం గుర్తుకొచ్చిందా?

జేబులో వంద రూపాయలు ఉండేవి కాదు కానీ, రూ.100 కోట్ల సినిమాని ఊహించుకుంటూ, స్క్రిప్టులు పట్టుకుని పరిశ్రమలో తిరిగేవాణ్ని. వాళ్ల కష్టాలు చెబుతున్నప్పుడు నా జీవితం మరోసారి కళ్ల ముందు తిరిగింది. అనిల్‌ రావిపూడి, మారుతి... ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన కష్టాల్ని ఎదుర్కొన్నారు. 'కేరాఫ్‌ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా, నేను చాలా రోజులుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అతడు నా షోలో పంచుకున్న విషయాలు నాకే షాకింగ్‌గా అనిపించాయి. పరిశ్రమలోకి రావాలనుకునేవాళ్లకు ఈ షో మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

  • ఒక దర్శకుడిగా ఈ షోతో మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలేమైనా ఉన్నాయా?

ఒకొక్క దర్శకుడిని ఒక్కో కోణంలో చూస్తుంటాం. అది ఇప్పుడు మారిపోయింది. ఎవరు ఏ జోనర్‌లో సినిమాలు చేసినా అందరి భావోద్వేగాలు ఒకేలా ఉంటాయని అర్థమైంది. దర్శకులతో మాట్లాడినప్పుడు వాళ్ల నుంచి నేర్చుకునేది చాలా ఉందనే విషయం తెలిసింది. అదనంగా పదేళ్లు పనిచేసిన అనుభవం ఈ కొద్దిరోజుల్లోనే వచ్చింది.

  • సినిమా... టెలివిజన్‌. ఈ రెండింటి మధ్య మీరు గమనించిన తేడాలేమిటి?

ఈ షో చేశాక టెలివిజన్‌ పరిశ్రమపై మరింత గౌరవం పెరిగింది. సినిమా అంటే ముందు పూర్వ నిర్మాణ పనులు చేస్తాం. కావల్సినంత సమయం ఉంటుంది. టెలివిజన్‌ అలా కాదు. రోజువారీగా 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ పని చేస్తేనే, నిజంగా పని నేర్చుకున్నట్టు అనిపించింది. ఈ షో ఒప్పుకున్నాకే జబర్దస్త్‌ షోకు న్యాయనిర్ణేతగా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్లాకే తెలిసింది ఇది ఎంత పెద్ద పరిశ్రమో అని.

  • ఇకపై ఇలాగే దర్శకుడిగా, నటుడిగా సినిమాలు చేస్తారా?

నేను చెప్పాల్సిన కథలు కొన్ని ఉన్నాయి. అందుకే ఇకపై దర్శకత్వంపైనే దృష్టి పెట్టాలనుకున్నా. ఇప్పట్లో నటనవైపు దృష్టిపెట్టను.

  • వెంకటేశ్​తో సినిమా ఎంతవరకు వచ్చింది?

స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. 'నారప్ప' చిత్రీకరణ నుంచి వెంకటేశ్ సర్‌ రాగానే ఆయనకు మరోసారి పూర్తి కథ వినిపించి చిత్రీకరణ మొదలుపెడతాం. అందరూ ఆస్వాదించేలా చాలా కొత్తగా ఉంటుంది ఆ సినిమా. స్పోర్ట్స్‌ జోనర్‌లోకే వస్తుంది ఆ చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఒక వెబ్‌సిరీస్‌ చేశాం. తెలుగులో ఆ సంస్థ చేసిన తొలి సిరీస్‌ అది.

Last Updated :Mar 13, 2020, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.