ETV Bharat / sitara

ఇప్పుడు వందల కోట్ల వసూళ్లు కష్టమే: నిర్మాత బన్నీ వాసు

author img

By

Published : Jun 11, 2021, 7:46 AM IST

producer bunny vaas about tollywood present situation
బన్నీ వాసు

ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితుల గురించి మాట్లాడారు నిర్మాత బన్నీ వాసు. చిన్న చిత్రాల నిర్మాతలు ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మేలని సూచించారు. అలానే అల్లు అర్జున్ తర్వాత చేయబోయే ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు.

"ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటిలా వందల కోట్ల వసూళ్లు చూడటం కష్టమే. దానికి ఓవర్సీస్‌ మార్కెట్లు పూర్తిస్థాయిలో తెరచుకోవాల్సి ఉంటుంది. ఇది పాన్‌ ఇండియా చిత్రాలు, పెద్ద స్టార్ల సినిమాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంలో చిత్రసీమ పూర్తిగా కోలుకోవడానికి 2022 వేసవి వరకు వేచి చూడక తప్పదు" అని అన్నారు నిర్మాత బన్నీ వాసు. ‘100% లవ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘గీత గోవిందం’ లాంటి విజయవంతమైన చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారు. శుక్రవారం బన్నీ వాసు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నారా?

గతేడాది నుంచి చిత్రసీమ చాలా నష్టపోయింది. మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వీటిని తిరిగి గాడిన పెట్టుకోవాలి. ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్ట్‌లు మొదలుపెడుతున్నాం. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవంగా జరిగిన కథతో ఓ చిత్రం రూపొందించనున్నాం. ఒక సీనియర్‌ దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కిస్తారు. అలాగే రాహుల్‌ రవీంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాం.

కరోనా దెబ్బ చిన్న సినిమాలు, పెద్ద చిత్రాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

తొలి దశ కరోనా తర్వాత తెలుగు చిత్రసీమ చక్కగా పుంజుకుంది. ఇక్కడ పడినన్ని హిట్లు, ఇక్కడ వచ్చినంత రెవెన్యూ మరే పరిశ్రమలో రాలేదు. ఈ జోరు అలాగే కొనసాగుంటే బాగుండేది. కానీ, సెకండ్‌ వేవ్‌ వల్ల పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఏప్రిల్‌ నుంచి రావాల్సిన పెద్ద చిత్రాలన్నీ ఆగిపోయాయి. ఈ ప్రభావం మే, జూన్‌, జులైలలో విడుదల కావాల్సిన భారీ సినిమాలపైనా పడుతోంది. ఇప్పటికే చిన్న, మీడియం రేంజ్‌ బడ్జెట్‌ సినిమాలు చాలా వరకు చిత్రీకరణలు పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు తెరచుకున్నా.. పెద్ద స్టార్ల సినిమాల మధ్య చిన్న చిత్రాలకు దారి దొరకడం కష్టమే. వచ్చే వేసవి వరకు ఇలాంటి పరిస్థితే కన్పిస్తోంది. కాబట్టి చిన్న చిత్ర నిర్మాతలు ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మేలు’’.

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘గని’, ‘18 పేజీస్‌’ చిత్రాలు ఎంత వరకు వచ్చాయి?

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మూడు రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలో ఆ పని పూర్తి చేసి.. విడుదలకు సిద్దం చేస్తాం. ‘18 పేజీస్‌’ మరో పదిరోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ రెండు చిత్రాల్ని థియేటర్లోకి తీసుకురావాలా? ఓటీటీ వైపు తీసుకెళ్లాలా? అన్నది ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఉన్న పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. వరుణ్‌ తేజ్‌తో నిర్మిస్తున్న ‘గని’, అల్లు శిరీష్‌ ‘ప్రేమ కాదంట’ సినిమాలు తుది దశ చిత్రీకరణలోనే ఉన్నాయి.

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ చేయనున్న కొత్త చిత్రమేంటి?

‘పుష్ప’ రెండు పార్ట్‌లుగా మారుతుందని మేం ఊహించలేదు. ఇప్పుడు రెండో భాగం కథ విషయమై కాస్త కసరత్తు చేయాల్సి ఉంది. అందుకే తొలి భాగం విడుదలయ్యాక.. ‘ఐకాన్‌’ చిత్రం పట్టాలెక్కిస్తారు. అది పూర్తయ్యాక.. మళ్లీ ‘పుష్ప 2’ చేస్తారు. ఈ లైనప్‌లో ఎలాంటి మార్పు ఉండదు. బన్నీ.. దర్శకుడు మురుగదాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్‌లోనూ ఒక చిత్రం చేయాలి. వీటిలో ముందు పట్టాలెక్కే చిత్రమేదన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. కొరటాల శివతో చేయాల్సిన సినిమా కూడా కచ్చితంగా ఉంటుంది.

allu arjun pushpa
పుష్పలో అల్లు అర్జున్

చిత్రీకరణలు, థియేటర్లు తిరిగి గాడిన పడటానికి ఎంత సమయం పట్టొచ్చు?

ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉంది. కాబట్టి త్వరలోనే చిత్రీకరణలన్నీ ప్రారంభమవుతాయి. అయితే జనాలు థియేటర్లకు రావడానికి మరింత సమయం పట్టొచ్చు. దసరాకు ముందే థియేటర్లు తెరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎంత ఆక్యుపెన్సీకి అనుమతిస్తారో చూడాలి. మునపటిలా వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవాలంటే నవంబరు, డిసెంబరు వరకు వేచి చూడక తప్పదు. ఈలోపు సమర్థంగా వ్యాక్సినేషన్‌ పూర్తయితే.. డిసెంబర్‌ నాటికి ప్రజలు ధైర్యంగా థియేటర్లకు రాగలుగుతారు. అయితే ఇదంతా ఆగస్టు, సెప్టెంబరులో కరోనా తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మూడో దశ ఉద్ధృతి మొదలైతే ఇప్పట్లో థియేటర్లు కష్టమే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.