Microsoft: విండోస్‌ 10 కొత్త ఫీచర్.. ఇక బ్రౌజింగ్​ భద్రంగా

author img

By

Published : Aug 8, 2021, 9:00 PM IST

micrsoft

మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వెబ్​ బ్రౌజింగ్​ చేసేటప్పుడు సైబర్​ నేరగాళ్లకు చిక్కుతుంటాం. ఇలాంటి తప్పిదాల నుంచి రక్షణ పొందడానికి మైక్రోసాఫ్ట్ సరికొత్త చర్యలు చేపట్టింది. మైక్రోసాఫ్ట్​ ఎడ్జ్​ బ్రౌజర్​లో 'సూపర్​ డూపర్​ సెక్యూర్ మోడ్​' పేరుతో కొత్త ఫీచర్​ను తీసుకొస్తుంది.

వెబ్‌ బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల విలువైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది. యూజర్‌ గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా వెబ్‌ బ్రౌజింగ్ సంస్థలు పటిష్ఠమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అయిన కూడా యూజర్ సమాచారం లక్ష్యంగా హ్యాకర్స్ దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్‌ విహారం మరింత భద్రంగా సాగేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో 'సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్' (ఎస్‌డీఎస్‌ఎమ్‌) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు జావా స్క్రిప్ట్‌లో జస్ట్‌-ఇన్‌-టైమ్‌ (జేఐటీ) కంపైలేషన్‌ను డిసేబుల్ చేసి వెబ్ బ్రౌజింగ్‌కు మరింత రక్షణ కల్పించడం ఈ సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ ప్రధాన ఉద్దేశం.

microsoft-to-introduce-new-secure-feature-in-edge-browser
సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్

వెబ్‌ బ్రౌజింగ్‌లో జావా స్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. కానీ ఇందులోని జేఐటీ ద్వారా 45 శాతం హ్యాకింగ్ ముప్పు ఉందని సైబర్ నిపుణులు అంటున్నారు. అందుకే జేఐటీ కంపైలేషన్‌ను డిసేబుల్ చేస్తే జావా స్క్రిప్ట్‌లోని సగానికి పైగా బగ్స్‌ని అడ్డుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌కి చెందిన జొనాథన్ నార్మన్ అనే సైబర్‌ నిపుణుడు తెలిపారు. అయితే పరీక్షల దశలో జేఐటీ కంపైలేషన్‌ను డిసేబుల్ చేయడం వల్ల కొన్నిసార్లు బ్రౌజింగ్ పనితీరు నెమ్మదించడం, మరికొన్ని సందర్భాల్లో మెరుగ్గా ఉన్నట్లు గుర్తించామని మైక్రోసాఫ్ట్‌ బృందం వెల్లడించింది. ఎడ్జ్‌లో సూపర్‌ డూపర్ సెక్యూర్ మోడ్‌తో పాటు ఆర్బిటరీ కోడ్ గార్డ్‌ (ఏసీజీ) అనే కొత్త ఫీచర్‌ను కూడా భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ తీసుకురానుంది. దీనివల్ల ఎడ్జ్ బ్రౌజర్‌కి అదనపు రక్షణ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఎడ్జ్‌ బీటా యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

విండోస్‌ డిఫెండర్‌ కొత్త ఫీచర్

microsoft-to-introduce-new-secure-feature-in-edge-browser
విండోస్​ డిఫెండర్​ కొత్త ఫీచర్​

అలానే విండోస్‌ 10 ఓఎస్‌లో పొటెన్షియల్లీ అన్‌వాంటెడ్ అప్లికేషన్స్ (పీయూఏ)ను కట్టడి చేసేందుకు విండోస్‌ డిఫెండర్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇవి యూజర్ ప్రమేయం లేకుండా కంప్యూటర్లలోకి ప్రవేశించి థర్డ్‌-పార్టీ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. అవి యాడ్స్‌ని జనరేట్ చేసి కంప్యూటర్ పనితీరుపై తీవ్రప్రభావం చూపిస్తాయి. ఇందుకోసం పీయూఏ బ్లాకింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. కంప్యూటర్‌లో దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత కంప్యూటర్‌లో పీయూఏలను గుర్తిస్తే డెస్క్‌టాప్‌ పైన నోటిఫికేషన్ చూపిస్తుంది. వాటిని తొలగించాలా.. కొనసాగించాలా అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ పలు రకాల టొరెంట్ సాఫ్ట్‌వేర్‌లను కూడా పీయూఏలుగా గుర్తిస్తున్నందు వల్ల.. యూజర్స్ ఈ ఫీచర్‌ను ఇష్టపడకపోవచ్చంటున్నారు సైబర్ నిపుణులు. దీన్ని ఎనేబుల్ చేసేందుకు విండోస్ 10లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి విండోస్‌ సెక్యూరిటీపై క్లిక్ చేయాలి. అందులో యాప్స్‌ & బ్రౌజర్‌ కంట్రోల్‌లో రెప్యూటేషన్ బేస్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే పొటెన్షియల్లీ అన్‌వాంటెడ్ యాప్ బ్లాకింగ్ ఫీచర్ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ పలువురు యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చింది.

ఇదీ చదవండి: ఈ-మెయిల్​ని షెడ్యూల్​ చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.