ETV Bharat / opinion

పంట వ్యర్థాల దహనానికి పరిష్కారమేది?

author img

By

Published : Nov 18, 2021, 6:55 AM IST

దిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం (Delhi Pollution News) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పంజాబ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో పలువురు రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుండటం  కొంతవరకు వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. అయినా పరిస్థితి మెరుగుపడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

stubble burning
పంట వ్యర్థాలు

దిల్లీలో వాయు కాలుష్యానికి పరిశ్రమలు, రవాణా, రహదారి ధూళి ప్రధాన కారణమని, కొన్ని ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల సమస్య తలెత్తుతోందని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. పంజాబ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో పలువురు రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుండటం కొంతవరకూ వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు గడచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.

నవంబరు మొదటివారంలోనే పంజాబ్‌లో 22వేల సస్యక్షేత్రాల్లో వ్యర్థాలను తగలబెట్టారని పంజాబ్‌ కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. పంట వ్యర్థాల దహనంతో దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో వాయునాణ్యత పడిపోతోంది. పంజాబ్‌ రైతుల ఆరోగ్యంపైనా ఈ కాలుష్యం ప్రభావం చూపుతోందని ఇంధన వనరుల సంస్థ(తేరి) ఇటీవలే వెల్లడించింది.

వ్యవసాయ యాంత్రీకరణ వల్లే పంట వ్యర్థాలను తగలబెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అంతకుముందు కూలీలతో కోయించినప్పుడు పొలాల్లో కొయ్యలు అంతగా మిగిలేవి కావు. యంత్రాలతో కోయిస్తున్నప్పటి నుంచి అవి దాదాపు అడుగు ఎత్తున మిగిలిపోతున్నాయి. వాటిని మళ్ళీ తీయించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో సులభంగా అయిపోతుందని తగలబెడుతున్నారు. హరియాణాలో చిన్న, సన్నకారు రైతులు కూలీలతోనే కోయిస్తున్నారు. దీనివల్ల పంజాబ్‌లో ఉన్నంత తీవ్రంగా సమస్య అక్కడ లేదు. ఎరువుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న రైతులు పంట వ్యర్థాలను కోయిస్తే మరింత ఆర్థికభారం పడుతుందని అంటున్నారు.

తొలుత వరి, ఆ తరవాత గోధుమ సాగుచేసే రైతులకు రెండు పంటల మధ్య గడువు ఎక్కువ లేకపోవడం సైతం ఇబ్బందిగా మారింది. గతంలో మే నెలలో వరి నాట్లు వేసి, సెప్టెంబరు లేదా అక్టోబరులో కోతలు కోసేవారు. ఆ తరవాత గోధుమ పంట వేయడానికి ఒక నెల సమయం ఉండేది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో జూన్‌ కంటే ముందు నాట్లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. దాంతో అక్టోబరు నెలాఖరుకుగానీ కోతలు ఉండటం లేదు. మరోవైపు నవంబరు రెండోవారం తరవాత గోధుమ నాట్లు వేయాలి. పొలాలను వేగంగా పంటకు సిద్ధం చేసేందుకు వ్యర్థాలను తగలబెట్టేస్తున్నారు. బయో-డీకంపోజర్లను వాడితే సమస్య ఉండదు గానీ, అందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుండటంతో దహనం వైపే మొగ్గుచూపుతున్నారు.

పంజాబ్‌ ప్రభుత్వం 2019-21లో 49 వేలకు పైగా పంటకోత యంత్రాల కొనుగోలుకు రూ.462 కోట్ల రాయితీ ఇచ్చింది. రైతులు వ్యక్తిగతంగా కొంటే యాభై శాతం, బృందంగా కొనుగోలు చేస్తే ఎనభై శాతం రాయితీ ఇస్తారు. సహజంగానే ఈ యంత్రాలన్నీ పెద్ద రైతులకే వెళ్ళిపోతున్నాయి. వాటితో కోతలు చేపడుతున్న రైతులు- ఆ తరవాత మిగిలిన వ్యర్థాలను యథేచ్ఛగా దహనం చేస్తున్నారు. ఈ లెక్కన వ్యర్థాల దహనాన్ని పాలకులే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు అవుతోంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న సూపర్‌ సీడర్‌ లేదా హ్యాపీ సీడర్‌ వంటి యంత్రాలైతే ఒకేసారి భూమిలో మిగిలిన కొయ్యలను దున్నేసి, అదే సమయంలో విత్తనాలు విత్తగలవు. వాటికి మాత్రం ప్రభుత్వాల నుంచి అంతగా ప్రోత్సాహం అందడం లేదు.

పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సాయం అందించి, దహనాలను తగ్గించాలని సుప్రీంకోర్టు లోగడే ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాలకు రాయితీలు ఇవ్వడం, అవి పక్కదోవ పట్టడంతో లక్ష్యం నెరవేరడం లేదు. అయిదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు వ్యర్థాలను తగలబెట్టకుండా పొలం నుంచి తీయిస్తే ఎకరాకు రూ.2,500 నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని పంజాబ్‌ ప్రభుత్వం గతంలో తలపోసింది. అదీ అంతగా అక్కరకు రావడం లేదు. వరిచేల నుంచే ఏడాదికి రెండు కోట్ల టన్నుల వ్యర్థాలు వస్తాయి.

పంజాబ్‌లోని 12 బయోగ్యాస్‌ ప్లాంట్లు రైతుల నుంచి టన్ను మూడు వేల రూపాయల చొప్పున ఈ వ్యర్థాలను కొంటున్నాయి. ఆ ప్లాంట్లు అన్నీ కలిపి కొనేది 10-12 లక్షల టన్నులే. అది మొత్తం వ్యర్థాల్లో అయిదు శాతమే! పాశ్చాత్య దేశాల్లో పంట వ్యర్థాలతో పలు వస్తువులు తయారుచేస్తున్నారు. వాటి నుంచి సేంద్రియ ఎరువులనూ ఉత్పత్తి చేయవచ్చు. దేశీయంగా అటువంటి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను పట్టించుకోనంత కాలం- పంటవ్యర్థాల సమస్య, వాటినుంచి వెలువడే కాలుష్యభూతాలను అరికట్టడం అసాధ్యమే!

- కామేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.