విలీనాధీశుడు.. భారతావని రూపశిల్పి.. ఉక్కుమనిషి సర్దార్ పటేల్

author img

By

Published : Oct 31, 2022, 7:58 AM IST

PATEL BIOGRAPHY

ఉక్కు సంకల్పం ఆయన నైజం. నిర్భీతి ఆయన తత్వం. అద్భుత రాజనీతజ్ఞత, దార్శనికత, నాయకత్వ పటిమ ఆయన విశిష్ట లక్షణాలు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి, స్వాతంత్య్ర సంగ్రామాన అగ్రపథాన నిలిచిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్వతంత్ర భారతాన్ని తీర్చిదిద్ద్దిన రూపశిల్పి. సంస్థానాల విలీనంతో విశాల భారతావనిని ఆవిష్కరించిన రాజకీయ దురంధరుడు.

Sardar Patel jayanti 2022: స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌.. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అయితే ఆయనకు నాయకత్వ పటిమ సహజసిద్ధంగానే అబ్బింది. పోరాట పటిమ ఆయన సొంతం. వీటికితోడు నిర్వహణ, దౌత్య సామర్థ్యాలను కలిగి ఉన్నారు. అలాగే పాలనాదక్షత, రాజనీతిజ్ఞత వంటి విశిష్ట లక్షణాలను ఆయన పుణికి పుచ్చుకున్నారు. పైకి కటువుగా, ముభావంగా కనిపించినప్పటికీ ఆయన సహృదయుడు. హాస్యచతురత అధికమే. త్యాగాలకు సదా సిద్ధంగా ఉండేవారు.

విద్యార్థి దశలోనే పటేల్‌ తన నాయకత్వ లక్షణాలను చాటారు. అప్పట్లో.. నదియా మున్సిపల్‌ కమిటీకి ఓ పాటిదార్‌ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే గుండు కొట్టించుకుంటానని ఆయన సవాల్‌ విసిరారు. దీన్ని స్వీకరించిన పటేల్‌.. ఆ పాటీదార్‌కు వ్యతిరేకంగా తన పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌ను బరిలోకి దింపి, గెలిపించుకున్నారు.

కుటుంబ పరిస్థితుల వల్ల 22 ఏళ్లకుగాని పటేల్‌ మెట్రిక్యులేషన్‌ను పూర్తి చేయలేకపోయారు. ఈ కారణాల వల్లే ఆయన ప్రైవేటుగా చదువుకొని, పరీక్షలు పాసై, జిల్లా ప్లీడర్‌ అయ్యారు. బారిస్టర్‌ చదవడానికి బ్రిటన్‌ వెళ్లాలనుకున్నారు. నిజానికి 7వేల మైళ్ల దూరం నుంచి భారత్‌ వంటి పెద్ద దేశాన్ని అంత చిన్న దేశం ఎలా నియంత్రించగలుగుతోందన్నది తెలుసుకోవడానికి కూడా ఆయన లండన్‌ ప్రయాణాన్ని పెట్టుకున్నారు.

అన్న కోసం త్యాగం..
1905లో లండన్‌లోని కోర్ట్స్‌ ఆఫ్‌ ఇన్‌లో ప్రవేశం సాధించారు. వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు విటల్‌భాయ్‌ పటేల్‌ అనే అన్న కూడా ఉన్నారు. ఇద్దరినీ వీజే పటేల్‌ అనే పిలుస్తారు. ఈ నేపథ్యంలో వల్లభ్‌భాయ్‌ ఇంగ్లండ్‌ వెళ్లడానికి పాస్‌, టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే టికెట్‌.. 'వీజే పటేల్‌' పేరిట జారీ అయింది. దీన్ని ఉపయోగించుకొని ఆ ప్రయాణపత్రాలతో తాను ఇంగ్లండ్‌ వెళ్లి చదువుకోవాలనుకుంటున్నట్లు విటల్‌భాయ్‌ కోరుకున్నారు. దీన్ని వల్లభ్‌భాయ్‌ మన్నించారు. ఐదేళ్ల తర్వాత తానూ లండన్‌ వెళ్లి బారిస్టర్‌ చదివారు. ఆరు నెలల ముందే కోర్సును పూర్తి చేయడమే కాకుండా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. స్వదేశానికి తిరిగొచ్చాక అహ్మదాబాద్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రఖ్యాత న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చేటప్పటికి న్యాయవాదిగా వల్లభ్‌భాయ్‌ ఉన్నత స్థితిలో ఉన్నారు. రాజకీయాలపైనా ఆసక్తి ప్రదర్శించారు. గాంధీ నేతృత్వంలో దేశానికి స్వాతంత్య్రం వస్తుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన సిద్ధాంతాలపై వ్యంగ్యోక్తులు విసిరారు. 1916 అక్టోబరులో గోద్రాలో జరిగిన రాజకీయ సదస్సులో గాంధీ చేసిన ప్రసంగం, బిహార్‌లోని చంపారన్‌లో ఆయన సాగించిన ఉద్యమం పటేల్‌ ఆలోచనతీరును మార్చేసింది. 1917లో గాంధీ గుజరాత్‌ సభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన సూచన మేరకు కార్యదర్శి పదవిని పటేల్‌ చేపట్టారు. 1920-21లో ఈ సభను గుజరాత్‌ ప్రావిన్షియల్‌ కాంగ్రెస్‌ కమిటీగా మార్చారు. దీనికి తొలి అధ్యక్షుడిగా పటేల్‌ ఎన్నికయ్యారు. 1946 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు.

బ్రిటిషర్లపై కొరడా..
పటేల్‌లో నిర్భీతి మెండు. ఆంగ్లేయులను నిగ్గుదీయడానికి వెనుకాడేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆయన 1917లో అహ్మదాబాద్‌ మున్సిపల్‌ బోర్డుకు ఎన్నికయ్యారు. పారిశుద్ధ్య కమిటీ ఛైర్మన్‌ హోదాలో ఆయన.. విధుల్లో అలక్ష్యం వహించిన ఇద్దరు బ్రిటిష్‌ అధికారులపై కొరడా ఝళిపించారు. 1924లో మున్సిపల్‌ బోర్డు ఛైర్మన్‌ అయ్యారు. ఆ హోదాలో అద్భుత పాలనా దక్షతను ప్రదర్శించారు.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ రెండు వార్షిక సదస్సులు నిర్వహించినప్పుడూ పటేల్‌ సంస్థాగత నైపుణ్యాలు విస్పష్టంగా కనిపించాయి. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి సదస్సులో ఆయన విస్తృతంగా ఖాదీని ఉపయోగించారు. 1938లో తపతి నది ఒడ్డున హరిపుర గ్రామంలో జరిగిన రెండో సదస్సులో పటేల్‌.. 500 ఎకరాల్లో ఒక తాత్కాలిక గ్రామాన్ని నిర్మించారు. 7,500 మంది ప్రతినిధులు, సందర్శకులకు అందులో వసతి కల్పించారు.

  • 1917 నుంచి 1929 మధ్య ఆయన బ్రిటిష్‌కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, సత్యాగ్రహాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో ఆయన ప్రణాళిక, సన్నద్ధత, నాయకత్వ పటిమ, చర్చల నైపుణ్యం విస్పష్టంగా కనిపించేవి. పటేల్‌ ఏ పని అప్పజెప్పినా నిబద్ధతతో పూర్తిచేసేవారు.
  • బర్డోలీ ఉద్యమంతో ఆయన సర్దార్‌ పటేల్‌గా ప్రజాదరణ పొందారు. 1931 మార్చిలో కరాచీ వేదికగా జరిగిన సదస్సులో పటేల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంపూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యమని లాహోర్‌లో పార్టీ తీర్మానించింది.
  • 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ పటేల్‌ చురుగ్గా పాల్గొన్నారు. భూశిస్తును చెల్లించబోమన్న ఉద్యమాన్ని చేపట్టారు.
  • స్వాతంత్య్రోద్యమంలో పటేల్‌ను మూడుసార్లు జైల్లో బ్రిటిషు పాలకులు నిర్బంధించారు.
  • 1935లో పటేల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్‌ అయ్యారు. ఎన్నికల యంత్రాంగాన్ని అద్భుతంగా నడిపించారు. 1935-37లో కేంద్ర, ప్రావిన్షియల్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నిధుల సమీకరణ, శాసనసభా పక్ష నేతల ఎంపిక వంటి బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు.
  • 1936లో నెహ్రూను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గాంధీ నామినేట్‌ చేశారు. ఆ మరుసటి సంవత్సరం.. మరో విడత ఆ పదవిలో సాగాలని నెహ్రూ వాంఛించారు. మరోసారి నెహ్రూకు అనుకూలంగా గాంధీ మొగ్గారు. వివిధ అంశాలపై పటేల్‌కు, నెహ్రూకు మధ్య విభేదాలు ఉండేవి.
  • దేశానికి స్వాతంత్య్రం విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై పటేల్‌కు గాంధీకి అరుదుగానే అభిప్రాయభేదాలు ఉండేవి. అలాంటి సందర్భాల్లో పటేల్‌ తన ఆలోచనలను కుండబద్ధలు కొట్టినట్లు తెలిపేవారు.
  • నెహ్రూ వలే పటేల్‌కు కరిష్మా, ఉన్నత విద్య, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేకపోయినా స్వాతంత్య్ర పోరాటంలో ఉక్కుమనిషికి గొప్ప చరిత్ర, విజయాలు ఉన్నాయి. అలాగే పటేల్‌ పోటీ చేయాలని భావిస్తే కచ్చితంగా గెలిచేవారు.
  • స్వాతంత్య్రంపై బ్రిటిష్‌ వారితో చర్చల సందర్భంగా ప్రధానమంత్రి పదవికి పటేల్‌ సరైన వ్యక్తని, ఆయన తరువాత ఆ పదవిని నెహ్రూ చేపట్టవచ్చని భావించారు. అయితే గాంధీ నిర్ణయం కారణంగా ప్రధానమంత్రి అవకాశం నెహ్రూకు దక్కడంతో కశ్మీర్‌ సమస్య, చైనాతో సరిహద్దు వివాదాలు అపరిష్కృతంగా ఉండిపోయాయి.

నెహ్రూతో విభేదాలున్నా...
వివిధ అంశాల్లో నెహ్రూతో తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ నెహ్రూ-లియాకత్‌ ఒప్పందం(తూర్పు పాకిస్థాన్‌లో మత ఘర్షణలపై), కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 అంశాలపై కాంగ్రెస్‌లోనూ, బయట పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనా పటేల్‌ జోక్యం చేసుకుని నెహ్రూ ప్రధానమంత్రిగా కొనసాగేలా చూశారు. అయితే నెహ్రూ మాత్రం పటేల్‌ను కేబినెట్‌ నుంచి సాగనంపేందుకు గాంధీకి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గాంధీ హత్యకు గురికావడంతో తాను మరణించేవరకూ కేంద్ర హోంమంత్రిగా పటేల్‌ కొనసాగారు.

  • దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 15 నెలల్లోనే 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్‌ పాత్ర చిరస్మరణీయం.
  • లౌకిక భావనతో అంబేడ్కర్‌ నేతృత్వంలో భారత రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు ఘనత పటేల్‌దే. అంతేకాకుండా మైనారిటీల హక్కులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వంటి కీలక నిబంధనలు పటేల్‌ చలవే.
  • అంబేడ్కర్‌, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వంటి కాంగ్రెసేతర ఉద్ధండనేతలను ప్రభుత్వంలో చేర్చడంలో పటేల్‌ది ముఖ్యపాత్ర.
  • 'ద టేస్ట్‌ ఆఫ్‌ ఇండియా' నినాదంతో దేశవ్యాప్తంగా పేరుగాంచిన పాల ఉత్పత్తుల సంస్థ 'అమూల్‌'కు మూలపురుషుడు పటేల్‌.
  • తన వ్యక్తిత్వంపై ఎటువంటి మచ్చలేకుండా, వేలెత్తి చూపే అవకాశం లేకుండా కడదాకా జీవించారు.
  • పటేల్‌ను తీవ్రంగా విమర్శించే సోషలిస్టులు మరణానంతరం ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. నెహ్రూ మాత్రం అది కూడా పేర్కొనలేదు.

ప్రాచీన కాలం నుంచి భారత ఉపఖండం సాంస్కృతిక పరంగా ఏకత్వం ఉన్నా పరిపాలనలో భిన్నత్వంలో ఉండేది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో కూడా బ్రిటిష్‌ ఇండియా, రాచరిక భారత్‌గా ఉండేది. ప్రస్తుతం ఆ రెండు ఒక్కటై సమైక్య భారతదేశంగా అవతరించింది. ఈ ఘనతంతా పటేల్‌కే చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 'మహాత్ముడు' తరువాత గొప్ప భారతీయుడుగా పటేల్‌ జేజేలు అందుకుంటున్నారు.

(వ్యాసకర్త- పీఎస్‌ రామమోహన్‌రావు, తమిళనాడు మాజీ గవర్నర్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.