ETV Bharat / opinion

కొవిడ్​ కట్టడికి అప్రమత్తతే పరమౌషధం!

author img

By

Published : Nov 4, 2020, 7:15 AM IST

కొవిడ్​ ఉద్ధృతి రోజు రోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో 'లక్ష్యాత్మక' రక్షణ ద్వారా వైరస్​ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన ముగ్గురు సాంక్రామిక వ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయంపై ఓ నివేదికనూ సమర్పించారు. అయితే, ఈ ప్రతిపాదన వెలువడిన కొన్ని రోజులకే ఎనభై మంది శాస్త్రవేత్తలు దీనిని వ్యతిరేకించారు. హెర్డ్​ ఇమ్యూనిటీ సాధించడం అసాధ్యమని చెప్పుకొచ్చారు.

Covid 19
కొవిడ్​ కట్టడికై 'లక్ష్యాత్మక' రక్షణ!

కరోనా సృష్టించిన ఇబ్బందుల నుంచి జనసామాన్యం పాఠాలు నేర్చుకొంటూ- ఆ మహమ్మారి బారి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో వైరస్‌ సంక్రమించకుండా తమను తాము కాపాడుకొనేందుకు మాస్కు ధరించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడం, వీలైనంత భౌతిక దూరం పాటించడం మొదలైనవి త్వరగానే అలవాటు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వాటి ఆధారంగా శరీరంలో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే వ్యాధి నిరోధక వ్యవస్థ బలపడిందని భావించలేం.

'లక్ష్యాత్మక' రక్షణ

ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన ముగ్గురు సాంక్రామిక వ్యాధుల నిపుణులు కలిసి కరోనా వైరస్‌ నుంచి ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడాలి అనే అంశంపై చర్చించి గ్రేట్‌ బారింగ్టన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించారు. సామూహిక అసంక్రామ్యత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) ఆధారంగా వారు చేసిన ఈ ప్రతిపాదన ప్రకారం వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన వారిని... అంటే పిల్లలు, యుక్త, మధ్య వయస్కులవారిపై ఆంక్షలు విధించకుండా వదిలివేసి, వ్యాధికి సులభంగా లొంగిపోయే వృద్ధులకు రక్షణ కల్పించాలి.

వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగినవారివల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గిపోతుంది. తద్వారా వయసు పైబడినవారిని రక్షించినట్లవుతుంది. 'లక్ష్యాత్మక రక్షణ' (ఫోకస్డ్‌ ప్రొటెక్షన్‌) అని వారు పిలిచే ఈ విధానం ప్రకారం... నిర్బంధం విధించి వైరస్‌ వ్యాప్తిని ఆలస్యం చేయడం కంటే, వ్యాధిని ఎదుర్కొనే సమూహాల్లో వైరస్‌ సహజ వ్యాప్తికి ఆటంకం కలిగించకుండా ఉంటే- కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టి, వ్యాక్సిన్‌ వచ్చేనాటికి మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చనేది గ్రేట్‌ బారింగ్టన్‌ డిక్లరేషన్‌ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తల వాదన.

పిల్లలు, యువత మనోవికాసానికి సహకరించే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను పునఃప్రారంభించడం... వీటితో పాటు క్రీడా సముదాయాలను, రెస్టారెంట్లను, సినిమా హాళ్లు, ఇతర వర్తక, వాణిజ్య సముదాయాలను పూర్వస్థితికి తీసుకురావడం, తరచూ చేతులను శానిటైజ్‌ చేసుకోవడం, యుక్తవయస్కులను కలవాల్సి వచ్చినప్పుడు వయోవృద్ధులు సాధ్యమైనంత భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తపడటం, ఆస్పత్రి సిబ్బందికి, ఆస్పత్రికి వచ్చేవారికి తరచుగా కరోనా పరీక్షలు చేయడం అనేవి వారి ప్రతిపాదనలోని మరికొన్ని అంశాలు.

వ్యతిరేకత..

అయితే ఈ ప్రతిపాదన వెలువడిన కొన్ని రోజులకే దీనికి వ్యతిరేకంగా ఎనభై మంది శాస్త్రవేత్తలు కలిసి 'జాన్‌ స్నో మెమోరాండం' ప్రచురించారు. హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడం అసాధ్యమని, దానికసలు ఎలాంటి శాస్త్రీయతా లేదని వారు వాదిస్తున్నారు. ఆంక్షలు లేకపోతే తక్కువ రిస్క్‌ కలిగిన పిల్లలు, యువతలో కూడా వైరస్‌ విజృంభించి వారిద్వారా ఇన్‌ఫెక్షన్‌, మరణాల రేటు గణనీయంగా పెరుగుతాయని, అందువల్ల ప్రమాదకరమైన, 'లక్ష్యాత్మక రక్షణ' విధానాన్ని అమలు చేయరాదని గ్రేట్‌ బారింగ్టన్‌ డిక్లరేషన్‌పై వారు ధ్వజమెత్తారు.

సమర్థమైన, భద్రతాయుతమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేదాకా ఆంక్షలతో కూడిన జీవనాన్ని మాత్రమే అమలు చేయాలని, ప్రజలు గుమికూడే అవకాశం గల ప్రదేశాలపై ఆంక్షలు కొనసాగించాలని వారు సూచిస్తున్నారు. అక్టోబర్‌లో కేవలం కొద్దిరోజుల వ్యవధిలో వెలువడిన పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రతిపాదనల్లో 'గ్రేట్‌ బారింగ్టన్‌ డిక్లరేషన్‌'కు ఇప్పటిదాకా ముప్పైవేల పైచిలుకు ప్రజారోగ్య శాస్త్రవేత్తలు సానుకూలత వ్యక్తం చేయగా... కేవలం ఏడువేల మంది మాత్రమే 'జాన్‌ స్నో మెమోరాండం'ని సమర్థించడం గమనార్హం.

ముందు జాగ్రత్త చర్యలు కీలకం

సరైన జాగ్రత్త వహించనప్పుడు సమూహాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి సులభంగా జరిగిపోతూ ఉంటుంది. నిజానికి పిల్లల్లో పాజిటివ్‌ కేసుల రేటు కేవలం రెండు శాతం ఉన్న అమెరికాలో స్కూళ్లకు వెళ్ళడం తిరిగి ప్రారంభించగానే పాజిటివ్‌ కేసుల రేటు ఒక్కసారిగా పది శాతానికి ఎగబాకింది.

ఈ గణాంకాల ఆధారంగా చూసినట్టయితే జాన్‌ స్నో మెమొరాండమే సహేతుకమని అనిపించక మానదు. ఆంక్షలవల్ల ఇంతకాలం ఇంటిపట్టునే ఉన్నవారు బయటకు వస్తే వారిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, మనం దృష్టి సారించాల్సింది మరణాల రేటు మీదే. పాఠశాలలకు వెళుతున్న అక్కడి పిల్లల్లో స్వల్పంగానైనా (0.02%) మరణాల రేటు నమోదవడం కొద్దిగా కలవరపెట్టే అంశమే. అక్కడ ఫ్లూ వైరస్‌వల్ల ఏటా నమోదయ్యే మరణాలు ఇంతకంటే ఎక్కువే.

అందువల్ల మన దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాల, కళాశాల విద్యను పునఃప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల్ల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా సరైన పోషణను ప్రభుత్వమే అందించే అవకాశం కలుగుతుంది. పోషణ సరిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరిగి వారిద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశమూ తగ్గుతుంది. మాస్కులు ధరిస్తే రద్దీగా ఉన్న ప్రదేశాల్లో సైతం వైరస్‌ వ్యాప్తి చెందే రేటు కేవలం 1.5 శాతమేననన్న ప్రజారోగ్య శాస్త్రవేత్తల సూచనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేరవేయాలి.

శీతకాలంలో సహజంగానే ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి, బయటకు వెళ్ళినప్పుడు చలిగాలి నాసికా రంధ్రాల్లోకి చొరబడకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. మరికొంత కాలం వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదని ప్రముఖ సంస్థలే చెబుతున్నందువల్ల- వీలైనంతవరకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సరైన పోషకాలు తీసుకోవడంవంటి రక్షణ చర్యలు తప్పనిసరి. నడక, ప్రాణాయామం వంటివి ఆచరించాలి. ప్రభుత్వాలు చొరవ చూపి, ఆంక్షలన్నీ సడలించి, సాధారణ ప్రజా జీవితానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. లేదంటే ఈ మహమ్మారి ప్రజాజీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను మరింత అతలాకుతలం చేయకమానదు.

ప్రతిరక్షకాలపై చర్చ

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక విజృంభించిన పాజిటివ్‌ కేసులవల్ల ఆయా సమూహాల్లో వైరస్‌ను ఎదుర్కొనే ప్రతిరక్షకాల (యాంటీబాడీల) ఫలితంగా తదనంతరం వైరస్‌ సంక్రమణ గణనీయంగా తగ్గి ఉండవచ్చు. కానీ, కొవిడ్‌ వ్యాధికారక కరోనా వైరస్‌ను నిరోధించే యాంటీ బాడీల ఉత్పత్తి త్వరగా క్షీణిస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యాంటీబాడీలు గణనీయంగా పడిపోయిన తరవాత వైరస్‌ సంక్రమణ జరిగిన పక్షంలో పాజిటివ్‌ కేసులు మళ్ళీ పెరిగే అవకాశముంటుంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం...వైరస్‌ సంక్రమణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. గత అయిదు మాసాల సగటుతో పోలిస్తే, ప్రస్తుత కరోనా పాజిటివ్‌ కేసుల సగటు తగ్గడాన్ని ఆధారంగా చేసుకొని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల, కళాశాల విద్యను పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ అంశంపై అంటువ్యాధుల నిపుణులు, ప్రజారోగ్య శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు.

రచయిత- డాక్టర్‌ అమరేంద్ర వర్మ, జర్మనీలో ఇమ్యునాలజీ రీసెర్చ్‌ సైంటిస్ట్‌.

ఇదీ చదవండి:అధ్యక్ష ఎన్నికల వేళ న్యూయార్క్​ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.