ETV Bharat / opinion

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు ఫైనలా? మార్చొచ్చా? ఫైజల్​ కేసు ఏం చెబుతోంది?

author img

By

Published : Mar 24, 2023, 4:01 PM IST

Updated : Mar 24, 2023, 5:34 PM IST

"కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు వేసిన లోక్​సభ సచివాలయం".. 24 గంటల వ్యవధిలో చకచకా జరిగిపోయిన పరిణామాలివి. మరి నెక్స్ట్ ఏంటి? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలకు రాహుల్ 8 ఏళ్లు దూరంగా ఉండాల్సిందేనా? పైకోర్టులో అపీల్ చేస్తే.. అనర్హత వేటు తప్పుతుందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్​ పోటీ చేయొచ్చా? లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ కేసు ఏం చెబుతోంది?

Rahul Gandhi disqualified
Rahul Gandhi disqualified

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. లోక్​సభ ఎంపీ పదవికి రాహుల్​ దూరం కావాల్సిందేనా? మరో 8 ఏళ్ల వరకు ఆయన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరాదా? అనర్హత వేటుపై లోక్​సభ సచివాలయం నిర్ణయాన్ని మార్చేందుకు ఏదైనా మార్గముందా? పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష విధించడాన్ని రాహుల్​ ఇప్పుడు పైకోర్టులో సవాలు చేసి, తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటే ఏం జరుగుతుందనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ.. కొన్ని నెలల క్రితం నాటి లక్షద్వీప్ ఎంపీ కేసును గుర్తుకు తెస్తున్నాయి. హత్యాయత్నం కేసులో ఏకంగా పదేళ్ల జైలుశిక్ష పడి, వెంటనే అనర్హతకు గురైన మహ్మద్​ ఫైజల్​కు.. కేరళ హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం.

ఫైజల్ కేసులో ఏం జరిగింది?
పీపీ మహ్మద్ ఫైజల్.. లక్షద్వీప్ లోక్​సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన మహ్మద్ సలీహ్​పై ఫైజల్​తోపాటు మరికొందరు దాడి చేశారన్నది ప్రధాన అభియోగం. ఫలితంగా హత్యాయత్నం కేసులో నిందితుడిగా సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు మహ్మద్ ఫైజల్.

2023 జనవరి 10న మహ్మద్​ ఫైజల్​ కేసులో తీర్పు వెలువరించింది కవరట్టి సెషన్స్ కోర్టు. హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఫలితంగా.. ఫైజల్​పై అనర్హత వేటు వేస్తున్నట్లు జనవరి 13న లోక్​సభ సచివాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. దోషిగా తేలిన రోజు(జనవరి 10) నుంచే ఆయనపై చర్యలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. అనర్హత వేటుతో ఖాళీ అయిన లక్షద్వీప్ లోక్​సభ నియోజకవర్గం ఉపఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

అయితే.. హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు మహ్మద్ ఫైజల్. ఈ కేసులో జనవరి 25న అసాధారణ నిర్ణయం తీసుకుంది కేరళ హైకోర్టు. ఫైజల్​ కోరినట్టుగా హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని నిలుపుదల చేసింది. ఫలితంగా ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లకుండా పోయింది.

ఫైజల్​కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు. ఫైజల్​పై అనర్హత వేటుతో తలెత్తే అసాధారణ, మార్చలేని పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశ ఖజానాకు భారమయ్యే ఉపఎన్నికను నివారించేందుకు ఇలా చేయడం అవసరమని చెప్పింది. ఉపఎన్నికల వల్ల లక్షద్వీప్​లో అభివృద్ధి పనులు కొన్ని వారాలపాటు ఆగిపోతాయని వ్యాఖ్యానించింది. కొత్త సభ్యుడు ఎన్నికైనా.. వారు పని చేసేందుకు 15 నెలలు మాత్రమే సమయం(ప్రస్తుతం లోక్​సభ కాలం గడువు తీరే వరకు) ఉంటుందని అభిప్రాయపడింది. అయితే.. ఓ ప్రజాప్రతినిధి దోషిగా తేలిన వెంటనే ఆటోమెటిక్​గా అనర్హులు అవుతారని, పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని అప్పుడు కేంద్రం వాదించినా.. హైకోర్టు అంగీకరించలేదు. 2018లో లోక్​ ప్రహారీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గుర్తు చేసింది. నాటి నిర్ణయం ప్రకారం.. ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే.. అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు.. లక్షద్వీప్ ఉపఎన్నికకు నోటిఫికేషన్​ విడుదలపై సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఫైజల్. ఫలితంగా ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ప్రశ్నలెన్నో..
ఫైజల్​ను దోషిగా తేల్చడంపై స్టే ఇచ్చి, అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేశాక.. కేంద్ర ఎన్నికల సంఘం లక్షద్వీప్ ఉపఎన్నికను వాయిదా వేసింది. అయితే.. ఫైజల్​ సభ్యత్వాన్ని మాత్రం లోక్​సభ సచివాలయం పునరుద్ధరించకపోవడం గమనార్హం. ఫలితంగా.. ఫైజల్ కేసులో కేరళ హైకోర్టు ఆదేశాలు అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. దోషిగా తేలిన వెంటనే అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తుంటే.. అపీలుపై స్పష్టత వచ్చే వరకు ఎంపీ సీటు ఫైజల్​దేనని కేరళ హైకోర్టు అంటోంది. ఇలాంటి సందిగ్ధతల నడుమ.. ఇప్పుడు రాహుల్​ గాంధీ అపీలుకు వెళ్తే ఏం జరుగుతుందనేది సర్వత్రా ఆసక్తికరం.

'అనర్హతపై త్వరగా.. పునరుద్ధరణ మాత్రం ఆలస్యం'
రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడంపై లోక్​సభ సభ్యత్వ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్​ ఫైజల్​ స్పందించారు. లోక్​సభ సచివాలయం అనర్హత వేటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకుందని.. కానీ పునరుద్ధరణకు మాత్రం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఓ క్రిమినల్ కేసులో కవరట్టి సెషన్స్​ కోర్టు ఫైజల్​ను​ దోషిగా తేలడం వల్ల.. లోక్​సభ ఎంపీగా ఉన్న ఆయనపై చర్యలు తీసుకుంది. అనంతరం కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు పడింది. వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్​సభ సచివాలయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తీర్పు వెలువడిన మార్చి 23నే రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడైనట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి

ఇవీ చదవండి : రాహుల్​ గాంధీపై అనర్హత వేటు.. 8ఏళ్లు ఎన్నికలకు దూరం!

'ప్రజాస్వామ్యం ఖూనీకి వారి ప్రయత్నాలు.. అదానీ వ్యవహారంపై విపక్షాల ఐక్య పోరాటం'

Last Updated : Mar 24, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.