వ్యక్తిగత గోప్యత.. గాలిలో దీపం!

author img

By

Published : Sep 20, 2021, 7:05 AM IST

personal privacy

సాంకేతికతతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కాలంలో అన్ని కార్యకలాపాల ఇంటర్నెట్‌పైనే ఆధారపడి జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత వివరాలన్నీ డిజిటల్‌ రూపంలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో వ్యక్తిగత గోప్యతకు అభద్రత ఏర్పడుతుంది. సైబర్​ నేరగాళ్లు పిషింగ్‌ ఎటాక్​లకు పాల్పడి భారీగా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఆపై బెదిరింపులకు దిగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఆధునిక సాంకేతిక యుగంలో మానవుడి కార్యకలాపాలు దాదాపుగా ఇంటర్నెట్‌తో అనుసంధానం అయిపోయాయి. వ్యక్తిగత వివరాలన్నీ డిజిటల్‌ రూపంలోకి వెళ్లిపోతున్నాయి. స్మార్ట్‌ఫోనులు అందరి చేతుల్లో ఒక అవసరంగా అమరిపోయాయి. ఆహారం ఆర్డర్‌ చేయడం నుంచి షాపింగ్‌ దాకా, గేమింగ్‌ నుంచి సమాచారం తెలుసుకోవడం వరకు ఇబ్బడి ముబ్బడిగా యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా వ్యక్తిగత సమాచార చౌర్యానికి అవకాశాలు పెరిగాయి. సాధారణంగా 'ఓపెన్‌ సోర్స్‌ ఎనలిటిక్స్‌' పేరుతో పెద్ద సంస్థలు వినియోగదారుల అంతర్జాల కార్యకలాపాలను విశ్లేషించి తమ వ్యాపార అవసరాలకు వాడుకుంటాయి. దాన్ని దాటిపోయి ప్రస్తుతం కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్ల నుంచే వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోంది. చాలా సందర్భాల్లో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందే వినియోగదారుల సమాచారాన్ని తస్కరిస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. సాధారణంగా హ్యాకింగ్‌, తెలియక జరిగిన పొరపాట్లు (పిషింగ్‌ ఈమెళ్లను తెరవడం), నిర్లక్ష్యం (సమాచార పరిక్షణలో సంస్థ నిబంధనలను పాటించకపోవడం), సంస్థ ఉద్యోగుల స్వార్థప్రయోజనాలు తదితరాల వల్ల వినియోగదారుల సమాచారం చీకటి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.

కొన్నిసార్లు సంస్థ ఉద్యోగుల సాయంతోనూ ప్రత్యర్థి కంపెనీలు, హ్యాకింగ్‌ రాయుళ్లు సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కంపెనీలో పదోన్నతులు దక్కనివారు, త్వరలో ఉద్యోగానికి ఉద్వాసన లభిస్తున్నట్లు తెలిసినవారు కొంతమంది విద్వేషపూరితంగా కంపెనీ సమాచారాన్ని విధ్వంసం చేయడం, లేదంటే ప్రత్యర్థులకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరికొన్ని సార్లు కొందరు ఉద్యోగులు పాత కంపెనీ డేటా మొత్తం సేకరించి ప్రత్యర్థి కంపెనీలోకి దూకుతున్నారు. మొత్తంగా ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల 71శాతం సమాచారం, సంస్థ నిబంధనల బేఖాతరు వల్ల 68శాతం, ద్రోహ చింతన వల్ల 61శాతం డేటా తస్కరణకు గురవుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఇటీవలి కాలంలో యాప్‌లు, కొత్త తరం కంపెనీలు యథేచ్ఛగా వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇది ఎవరి దగ్గర ఉంటుంది, దానితో ఏం చేస్తారన్నది బయటి ప్రపంచానికి సరిగ్గా తెలియడంలేదు. వెరిజోన్‌ వార్షిక సమాచార చౌర్య నివేదిక ప్రచారం 80శాతం సమాచార తస్కరణ ఘటనలు ధనార్జన కోసం జరుగుతుండగా, వ్యవస్థీకృత నేర ముఠాలు 55శాతం ఘటనలకు పాల్పడుతున్నాయి. అధికశాతం చౌర్యాలు యాప్‌లు, క్లౌడ్‌ ద్వారా సాగుతున్నట్లు వెరిజోన్‌ పేర్కొంది.

వివరాలతో బెదిరింపులు

దొంగిలించిన సమాచారాన్ని చాలా వరకు డార్క్‌వెబ్‌లో విక్రయిస్తారు. వినియోగదారుల వివరాలు, చిరునామాలు, వారు నెట్‌లో దేనికోసం అన్వేషించారు, ఏయే వస్తువులను ఆర్డర్‌ చేశారు, వేటిని తిరస్కరించారు, ఈ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలు అందులో ఉంటాయి. వీటి సాయంతో ఆన్‌లైన్‌లో నకిలీ అకౌంట్లు సృష్టించవచ్చు. క్రెడిట్‌ కార్డు నంబర్లు, సెక్యూరిటీ కోడ్‌లతో నకిలీ కార్డులను సృష్టించే అవకాశం ఉంది. కొత్త క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ-మెయిళ్లు, సెల్‌ఫోన్లకు మాల్‌వేర్లలో కూడిన సందేశాలనూ గుట్టలుగా పంపించడానికి ఆస్కారం లభిస్తుంది. వీటిని తెరిస్తే మన డిజిటల్‌ ఉపకరణాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. వాటిని విడిపించుకోవాలంటే వారు అడిగినంతా సమర్పించుకోవాలి. ఒక్కోసారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డంపెట్టుకొని హ్యాకర్లు బలవంతపు వసూళ్లకూ దిగుతున్నారు. ఆరోగ్య రంగ సమాచారం ఇటీవల హ్యాకర్లు, డేటా తస్కర రాయుళ్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ వివరాలతో సైతం వారు బెదిరింపులకు దిగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

నిరంతర నిఘాతోనే అడ్డుకట్ట

దిగ్గజ సంస్థలు ఏ ఉద్యోగి ఏ సమాచారంపై పనిచేస్తున్నారన్న దానిపై కన్నేసి ఉంచుతాయి. చాలా సంస్థల్లో దీనిపై సరైన నిఘా ఉండటంలేదు. 2018-20 మధ్య కాలంలో వినియోగదారులు, కంపెనీ సమాచారాన్ని దుర్వినియోగం చేసిన 80 మంది ఉద్యోగులకు గూగుల్‌ ఉద్వాసన పలికింది. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్రమార్కులు రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అంతర్జాల వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి. ఐబీఎం అంతర్గత చౌర్య నివేదిక ప్రకారం సంస్థల ఉద్యోగులు సమాచార తస్కరణకు పాల్పడుతున్న ఘటనలు 2016 నుంచి మూడు రెట్లు పెరిగాయి. కంపెనీలు పని విధానాన్ని బట్టి సమాచారాన్ని విభజించి, నిర్ణీత ఉద్యోగులకు ఆ మేరకు అప్పగించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల చౌర్యం జరిగితే, దోషులు ఎవరన్నది తేలిగ్గా గుర్తించడానికి వీలవుతుంది. భారత్‌లో వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు ప్రస్తుతం పెండింగులో ఉంది. త్వరగా దీన్ని చట్ట రూపంలోకి తేవాలి. వినియోగదారులు అనవసర యాప్‌లకు దూరంగా ఉండటంతో పాటు, వ్యక్తిగత సమాచార భద్రతకు కంపెనీలు శక్తివంచన లేకుండా కృషిచేస్తేనే అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది.

రచయిత- ఎం.అక్షర

ఇదీ చూడండి: భూకంపాలను గుర్తించే ఫోన్​లు వచ్చేస్తున్నాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.