ETV Bharat / opinion

ప్రణాళికే ప్రాణవాయువు - ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం

author img

By

Published : May 19, 2021, 8:46 AM IST

oxygen shortage in india, దేశంలో ఆక్సిజన్ కొరత
ఆక్సిజన్​ ప్లాంట్లు

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కారణంగా ఆక్సిజన్​కు కొరత ఏర్పడింది. పలు రాష్ట్రాలు ముందు చూపుతో తగిన ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయడానికి తెలుగు రాష్ట్రాలు తక్షణం చర్యలు తీసుకోవాలి.

కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రజల ఊపిరి తీసేస్తోంది. మొదటి దశతో పోలిస్తే ఈ దఫా రోగులకు ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతోంది. మే ఎనిమిది నాటికి తొమ్మిది లక్షల మంది రోగులు ఆక్సిజన్‌ మద్దతుపై ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇప్పటికీ అవసరానికి తగ్గ సరఫరా లేక ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. కేంద్రం నుంచి ఈ విషయంలో ఆశించిన మద్దతు లభించక పలు రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇప్పటికే కేంద్ర సర్కారు తీరును దుయ్యబట్టాయి. ప్రాణవాయువు లభ్యత, సరఫరా, పంపిణీపై పన్నెండు మంది నిపుణులతో సుప్రీంకోర్టు ఓ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలాంటి రాజకీయ కలహాలకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించింది. వాస్తవానికి మొదటి దశ పరిస్థితుల్ని చూశాక కేంద్రం ఆక్సిజన్‌ అవసరాల్ని ఊహించింది. 14 రాష్ట్రాల్లో 150కి పైగా ప్రెజర్‌ స్వింగ్‌ అడ్జార్ప్‌షన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ, వాటిని సత్వరం పట్టాలకెక్కించడంలో విఫలమైంది. ఆక్సిజనే కాదు.. సిలిండర్లు, వాటిని తరలించడానికి అవసరమైన క్రయోజనిక్‌ ట్యాంకర్లూ దేశంలో తగినంతగా అందుబాటులో లేవు. రవాణా పెద్ద ఇబ్బంది అవుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో సరఫరాలో జాప్యం మూలంగానే రోగుల ప్రాణాలు పోయాయి! ఈ పరిస్థితి ప్రభుత్వాల ప్రణాళికా వైఫల్యాన్ని చాటుతోంది.

ఆ రాష్ట్రాల ముందుచూపు

కేంద్రంతో సంబంధం లేకుండా ముందుచూపుతో వ్యవహరించిన కొన్ని రాష్ట్రాలు ఈ ఇబ్బందులను అధిగమించాయి. ఛత్తీస్‌గఢ్‌ కొవిడ్‌ కట్టడిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ- అప్రమత్తతతో వ్యవహరించి, ఆక్సిజన్‌ మిగులుతో ఇతర రాష్ట్రాల అవసరాలను తీరుస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు పెద్దయెత్తున సరఫరా చేస్తోంది. గతేడాది ఆక్సిజన్‌ అందుబాటుకు సంబంధించి అధిక ధరలు, రవాణా, ఇతర అంశాల్లో పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భాగెల్‌ చెబుతున్నారు. నిరుడు నవంబర్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పదమూడు జిల్లాల్లో పదిహేను ప్లాంట్లను సిద్ధంచేసింది. మరో ఏడు ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్‌ ఉత్పత్తి దాదాపు శూన్యం. అయినా, రోగులకు ఆ కొరత రానివ్వలేదు అక్కడి ప్రభుత్వం. దీనికోసం తొలుత మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యతను క్రమబద్ధీకరించింది. నలుగురు ఉన్నతాధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధం చేసి రోగుల అవసరాలు తీర్చడం సహా వృథాపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. సరఫరాదారులు, రీఫిల్లింగ్‌ ప్లాంట్లు, సెల్ఫ్‌ జనరేటర్లు.. అన్నీ ఉన్నతస్థాయి బృందం పర్యవేక్షణలో ఉండేలా చూసుకుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 13 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నడుం బిగించింది. కేరళ సైతం రోగులకు తగినంత ఆక్సిజన్‌ను నిరంతరాయంగా అందిస్తోంది. అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోగలమని చెబుతోంది. అంతే కాదు- ఈ ఆపత్కాలంలో తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు ప్రాణవాయువును అందించి ఎంతోమంది రోగులను రక్షించింది. రాష్ట్రంలోని కర్మాగారాలతో సమన్వయం చేసుకుంటూ ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంపుపై ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. సరఫరాలో ఇబ్బందులు ఎదురవ్వకుండా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి, గడచిన 25 రోజుల్లో 14 రాష్ట్రాలకు 15074 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువును పంపించింది.

తెలుగు రాష్ట్రాల చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన కేసులు నమోదవుతున్నాయి. కానీ అవసరాలకు తగ్గ స్థాయిలో ఆక్సిజన్‌ సరఫరా జరగడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్‌ లేక కొవిడ్‌ రోగుల ప్రాణాలు పోవడం- పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ముందస్తు సన్నద్ధత కొరవడటంతో విపత్తు సమయంలో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెలలోనే రూ.309.87 కోట్లను కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం కొరతను అధిగమించేందుకు ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి విమానాలు, ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ను పెద్దయెత్తున తెప్పిస్తోంది. ప్రాణవాయువు కోసం ఇతరుల మీద ఆధారపడొద్దని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కారీ దవాఖానాల్లో 48 ప్లాంట్ల ఏర్పాటుకు తాజాగా ఆదేశాలిచ్చారు. కొవిడ్‌ మూడో దశ ముప్పూ పొంచి ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయడానికి తెలుగు రాష్ట్రాలు తక్షణం చర్యలు తీసుకోవాలి.

- స్వాతి కొరపాటి

ఇదీ చదవండి : పిల్లలకు కొవాగ్జిన్​ 2,3 దశ ట్రయల్స్‌ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.