ఒమిక్రాన్ భయాలు- రక్షణ చర్యలే తక్షణావసరం

author img

By

Published : Dec 21, 2021, 8:03 AM IST

omicron in india

Omicron in India: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఆందోళనకర వైరస్‌ రకంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన ఈ వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. కాబట్టి, తొలిదశ, రెండోదశల్లో కొవిడ్‌ విజృంభించినప్పుడు పాటించిన జాగ్రత్తలన్నింటినీ మళ్లీ పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందేనని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Omicron in India: ఆఫ్రికా ఖండంలోని బోట్స్‌వానాలో నవంబరు 11న, ఆ తరవాత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త రకం బి.1.1.529. ఒమిక్రాన్‌గా పిలుస్తున్న ఈ వైరస్‌ రకం భారతదేశంతో పాటు ప్రపంచాన్నే వణికిస్తోంది. అతి తక్కువ కాలంలోనే చాలా దేశాలకు వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లోకీ అడుగు పెట్టింది. దీన్ని ఆందోళనకర వైరస్‌ రకంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తించింది. అన్నింటిలోకీ డెల్టా, డెల్టా ప్లస్‌, ఏవై.12 రకాలే బాగా ప్రమాదకరమని, అవి అధికంగా, త్వరగా వ్యాపిస్తాయని ప్రపంచమంతా ఇంతకుముందు భావించింది. కానీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఒమిక్రాన్‌- డెల్టా కంటే ఆరురెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తోందని డబ్ల్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తలు చెబుతుండటం కొంత ఆందోళన కలిగించే అంశం. ఇతర ఆందోళనకర వేరియంట్ల కంటే, ఇందులో మరోసారి సోకే ముప్పు చాలా ఎక్కువ. ప్రస్తుత పరిణామాన్ని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రపంచ దేశాలూ అదే తరహాలో భావించాలని డబ్ల్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ చెబుతున్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి, వ్యాధి తీవ్రత, పరీక్షల ప్రభావశీలత, దాన్ని అడ్డుకోవడంలో టీకాల సామర్థ్యం... వంటి అంశాలపై అధ్యయనం చేయాల్సింది చాలా ఉందని, అందువల్ల ఇప్పుడప్పుడే దానిపై ఒక నిర్ణయానికి రావద్దన్న సూచనలు పరిశీలించదగినవి.

Omicron latest news

Omicron spike protein mutations

దక్షిణాఫ్రికాలో ఓ నమూనాను జన్యుక్రమ విశ్లేషణ చేయగా, అది బి.1.1.529 అనే కొత్తరకం ఉత్పరివర్తనానికి చెందినదని తేలింది. దానికే ఆ తరవాతి కాలంలో ఒమిక్రాన్‌ అని పేరు పెట్టారు. ఈ రకంలో వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ (కొమ్ము లాంటి భాగం) 30 రకాలకు పైగా ఉత్పరివర్తనాలు చెందుతుండటంతో... అన్ని రకాల రోగనిరోధక శక్తులను అధిగమించి వ్యాపిస్తోంది. ఇప్పటికే రెండు డోసుల టీకా వేయించుకున్న వారిని, ఒకసారి కరోనా వచ్చి తగ్గి, శరీరంలో తగిన సంఖ్యలో ప్రతిరక్షకాలు ఏర్పడి ఉన్నవారిని సైతం వదలడం లేదు. శరీరంలో ఉండే ప్రతిరక్షకాలు సాధారణంగా కొవిడ్‌ మళ్ళీ సోకకుండా అడ్డుకుంటాయి. కానీ వాటినీ ఇది ఛేదిస్తోంది. ప్రతిరక్షకాలు వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌ను గుర్తిస్తాయి. కానీ దీనిలోని ఉత్పరివర్తనాలు భారీసంఖ్యలో ఉండి వాటినీ బోల్తాకొట్టిస్తున్నాయి. టీకాల ప్రభావశీలతను సైతం ఇది తగ్గిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఈ రకం సోకిన వారిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నవారూ ఉన్నారు. ఇతర దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. టీకాలు రెండు డోసులూ వేయించుకున్న వారికీ ఒమిక్రాన్‌ సోకుతోందంటే... వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని వెతికి పట్టుకుంటుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 12 రాష్ట్రాలు తప్ప అన్నింటిలోనూ ఒమిక్రాన్‌ జాడలున్నట్లు తేలగా, యూకేలో రోజుకు దాదాపు లక్ష కేసులు బయట పడుతున్నట్లు విదితమవుతోంది. రెండు వారాల లాక్‌డౌన్‌ విధించే దిశగా అక్కడి ప్రభుత్వాలు యోచిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

omicron vaccine news

ఆఫ్రికా ఖండంలో టీకాలు పూర్తిగా వేయించుకున్నవారి శాతం చాలా స్వల్పం. మన దేశంలోనూ రెండు డోసుల టీకాలు పడినది సుమారు 56 కోట్ల మందికే! ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే, టీకాలకు పెద్దగా ఆర్డర్లు రాకపోవడంతో తాము ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు కొవిషీల్డ్‌ ఉత్పత్తిదారైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావాలా ఇటీవల పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం. ఒమిక్రాన్‌ రకం కారణంగా కొత్తగా భారీసంఖ్యలో వస్తున్న కేసుల నియంత్రణకు... 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాల బూస్టర్‌ డోసులు అందించాలని యూకే నిర్ణయించింది. దేశ ప్రజలంతా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించారు. భారత్‌లో మాత్రం ఇప్పట్లో బూస్టర్‌ డోసులు ఇచ్చే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వైద్యసిబ్బందితోపాటు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసులు ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ ముందుకొచ్చినా- ఐసీఎంఆర్‌ చెప్పేవరకు బూస్టర్‌ డోసుల ప్రస్తావన వద్దంటూ కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.

నిబంధనలు తప్పనిసరి

ఒమిక్రాన్‌ రకం స్వల్ప లక్షణాలే చూపుతోందని భావించడం తొందరపాటేనని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పట్టే సమయం క్రమంగా అన్ని దేశాల్లో తగ్గుతూ వస్తోంది. యూకేలాంటి చోట్ల రెండు మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయి. ప్రస్తుతం యువతకే పరిమితమైనా, పెద్దవయసు వారికీ సోకడం మొదలైన తరవాత అన్ని దేశాల్లో దీని విస్తృతి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాలు ఉంటాయని, ఈ నేపథ్యంలో పేద దేశాలకు టీకాలు విరివిగా ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ పిలుపిస్తున్నారు. తొలిదశ, మలిదశల్లో కొవిడ్‌ విజృంభించినప్పుడు పాటించిన జాగ్రత్తలన్నింటినీ మళ్ళీ పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందేనని అంతర్జాతీయ వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విదేశాల్లో కేసులు వెలుగు చూస్తున్నప్పుడే ప్రభుత్వం స్పందించి ఆయా దేశాల నుంచి విమానాల రాకపోకలను ఆపేసి ఉంటే పరిస్థితి చేయిదాటేది కాదని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. విమానాశ్రయాల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ముప్పు జాబితాలో లేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఒమిక్రాన్‌ కేసులు బయటపడటం, అవి వచ్చినట్లు నిర్ధారణ అయ్యేలోపే వాళ్లు పలుప్రాంతాల్లో సంచరించడం లాంటి వాటివల్ల ముప్పు మరింత పెరుగుతోంది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చినవారిలో 2-3శాతానికే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. కొన్నాళ్ళపాటు అన్ని దేశాల నుంచి రాకపోకలను నిలిపి వేయడంతో పాటు, తగిన స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటేనే ఒమిక్రాన్‌ విజృంభణను అడ్డుకోగలం.

కేసులు పెరుగుతున్నా...

ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసినప్పుడు అందులోని మూడు లక్షిత జన్యువుల్లో ఒకటి (ఎస్‌ జన్యువు) కనిపించకపోతే దాన్ని ఒమిక్రాన్‌గా అనుమానించాలి. సేకరించిన అన్ని నమూనాలనూ విశ్లేషణకు పంపాల్సిన అవసరం లేకుండా, ఎస్‌ జన్యువు లేని నమూనాలనే జన్యుక్రమ విశ్లేషణకు పంపితే అప్పుడు అది ఒమిక్రాన్‌ రకమేనా, కాదా అన్న విషయం నిర్ధారణ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేసులు ఎక్కువస్థాయిలోనే వస్తున్నా, ఆసుపత్రుల్లో చేరికలు... మరణాల సంఖ్య మరీ తీవ్రంగా లేకపోవడం కాస్త ఊరట కలిగిస్తున్న విషయం. ఒమిక్రాన్‌ బాధితులు ఆసుపత్రిలో చేరినా త్వరగానే కోలుకొని ఇంటికి వెళ్ళిపోతుండటం కొంతవరకు శుభవార్తే.

- కామేశ్వరరావు పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.