ETV Bharat / opinion

ఇంటి పంటతో ఆరోగ్యం మరింత పదిలం!

author img

By

Published : Sep 2, 2020, 11:30 AM IST

మనం పీల్చే గాలి నుంచి తినే ఆహారం వరకు అన్నీ కలుషితమైన తరుణంలో.. నేడు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఆహోరోత్పత్తిని పెంచేందుకు స్థాయికి మించి వాడే రసాయనాలు తీవ్ర విషపూరితమై ప్రజారోగ్య భద్రతకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఇప్పటికైనా ప్రజల్లో సురక్షితమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనంపై ఆసక్తి కలుగుతోంది. ఇందుకోసం రసాయనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించి.. సేంద్రియ వ్యవసాయ విధానాలకు ప్రాచుర్యం కల్పించాలి. ఇంటి పంటలను పెద్దయెత్తున సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Home grown crops are very healthy for us
ఇంటి పంటతో ఆరోగ్యం

ఆకు కూరల నుంచి అమ్మ పాల వరకు అన్నీ విషపూరితమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. పీల్చే గాలి నుంచి తినే ఆహారం వరకు అంతా కలుషితమైన వేళ పర్యావరణ పరిరక్షణ నేడెంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహారోత్పత్తులు పెంచేందుకు హరిత విప్లవం కాలంలో మొదలుపెట్టిన రసాయనాల వాడకం అన్ని పరిమితుల్నీ దాటేసింది. మోతాదులకు మించి ఇష్టానుసారం వాడుతున్న ఫలితంగా ఆహారం కలుషితమై విష రసాయన అవశేషాలు అమ్మ పాలల్లోకీ చేరి భయపెడుతున్నాయి. ప్రజారోగ్య భద్రతకు తూట్లు పొడుస్తున్నాయి. నిస్సారమైన భూముల్లో ఆశల సేద్యం కోసం అడ్డగోలుగా రసాయనాలు చల్లుతున్న ధోరణిని అడ్డుకోవాల్సిందే. సురక్షిత ఆహారం కోసం ప్రజలు ఇంటి పంటలు పండిస్తూ- రసాయనరహిత సేద్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరముంది.

రసాయనాలతో అనర్థాలు...

విచ్చలవిడి రసాయనాల వాడకంపై ఎంత అవగాహన కల్పిస్తున్నా వాటి వినియోగం ఆశించిన రీతిలో తగ్గడం లేదు. అశాస్త్రీయ పద్ధతుల్లో రసాయనాల వాడకం వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. భూసారం క్రమంగా క్షీణిస్తోంది. నేల ఆరోగ్య పరిరక్షణకు కేంద్రప్రభుత్వం 2015లో భూసార పరీక్ష కార్డుల విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినా- పరిస్థితిలో మార్పు రాలేదు. యూరియాను అధికంగా వినియోగిస్తే మంచి దిగుబడులు వస్తాయనే అపోహతో రైతులు అవసరం లేకపోయినా వాడేస్తున్నారు. భూసార పరీక్షలు చేయించుకుని నేలలోని పోషకాల ఆధారంగా ఎరువులు చల్లాల్సిన రైతులు అసలు పరీక్షలే చేయించడం లేదు. చేస్తున్న పరీక్షలూ తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఉదాహరణకు భూమిలో నత్రజని, భాస్వరం అధిక మోతాదులో ఉన్నప్పుడు వాటిని వాడాల్సిన పని లేదు. కానీ అదొక తప్పనిసరి వ్యాపకంగా చల్లేస్తే నేలలో వాటి నిల్వలు పేరుకుపోయి దిగుబడులు పెరగకపోగా రైతుల జేబులు ఖాళీ అవుతాయి.

రైతుల్లో కొరవడుతోన్న స్పృహ

తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50శాతం నేలల్లో జింక్‌, 30శాతంలో భాస్వరం, 17శాతం భూముల్లో ఇనుము, 12శాతంలో బోరాన్‌, అయిదు శాతం నేలల్లో మాంగనీస్‌లోపం ఉన్నట్లు ఒక అధ్యయనం పేర్కొంది. పొలానికి ఎంత అవసరమో అంత చల్లితే సాగు ఖర్చులు కూడా తగ్గుతాయన్న స్పృహ రైతుల్లో కొరవడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురుగు మందులను నిషేధించినా దేశంలో నేటికీ మనం అవి వాడుతున్నాం. కేరళలో ఎండోసల్ఫాన్‌విచ్చలవిడి వాడకం దుష్ప్రభావాలను నేటికీ చవిచూస్తున్నాం. కొన్నేళ్లుగా పలు రకాల పురుగు మందుల్ని నిషేధిస్తామంటూ కేంద్రం ముసాయిదా తీసుకురావడం, దానిపై అభ్యంతరాలు వెల్లువెత్తడం పరిపాటి అవుతోంది కానీ పటిష్ఠమైన చట్టం నేటికీ రూపుదాల్చలేదు.

రసాయనాల వాడకం- తెలుగు రాష్ట్రాల్లోనే అధికం

ఇటీవల కేంద్రం 27 ప్రధాన పురుగు మందుల్ని నిషేధిస్తూ ముసాయిదా పత్రం తీసుకొచ్చింది. మానవారోగ్యాన్ని అవి ఎంతగా నాశనం చేస్తున్నాయో ముసాయిదాలో వివరించిన కేంద్రం కొన్ని దశాబ్దాలుగా వాటి వాడకాన్ని నిషేధించడానికి తాత్సారం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఆహార నాణ్యతకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా రసాయనాల వాడకం తగ్గించాల్సిన స్థితిలో అధికం కావడం కలవరపెడుతోంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో రసాయనాల వాడకం అధికంగా ఉందని ఇటీవల వార్తలు రావడమే ఇందుకు నిదర్శనం. ఈ తరుణంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కొనాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి వస్తోంది. పంట రైతు చేతులు దాటాక కూడా కృత్రిమంగా పక్వతకు తీసుకొచ్చేందుకు అధిక గాఢత కలిగిన మందుల్ని చల్లుతుండటం కలవరపెడుతోంది.

కరోనాతో పెరిగిన అవగాహన

కరోనా దృష్ట్యా రోగనిరోధకశక్తిని పెంచుకునే సురక్షిత ఆహారంపై ప్రజల్లో అవగాహన ఎంతో పెరిగింది. భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సూచనల ప్రకారం నిత్యం ప్రతి మనిషీ రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఈ తరుణంలో ఇంటి పంటల సాగు పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అన్నింటా కల్తీ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంటే, రసాయన అవశేషాలున్న ఆహారంతో క్యాన్సర్‌వంటి ప్రాణాంతక రోగాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ తరుణంలో మనకు దొరికే కాస్త జాగాలో అయినా పెరటి తోటలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

విస్తృతంగా ప్రచారం కల్పించాలి

గ్రామాల్లో ఇంటి చుట్టుపక్కల, పట్టణాల్లో మిద్దెలపైన, బాల్కనీల్లో అయినా- మార్కెట్లో కొనే అవసరం రాకుండా తమ ఇంటికి కావలసిన కూరగాయలను స్వయంగా పండించుకునే ధోరణి ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. ఉద్యానశాఖ వారు కూడా వీటి పెంపకానికి రాయితీలిచ్చి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. పెరటి, మిద్దె తోటల పెంపకంతో రసాయన అవశేషాలు లేని తాజా కూరగాయలను సంవత్సరం పొడవునా పొందడమే కాకుండా- కాలుష్యం తగ్గి పచ్చదనం పరచుకుని ఆహ్లాదకరమైన వాతావరణం సొంతమవుతుంది. వీటి పెంపకం వల్ల తగిన వ్యాయామం కలిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పైగా నచ్చిన కూరగాయలను ఎప్పటికప్పుడు తాజాగా పొందే సౌలభ్యం పెరటి, మిద్దె తోటలతో ఏర్పడుతుంది. వీటి సాగుకు ఉద్యానశాఖ రాయితీలు అందిస్తున్నా, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీటిని మరింత విస్తృతం చేయాలి. సేంద్రియ సాగు విధానాలపైనా రైతుల్లో అవగాహన కల్పించాలి.

ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే..

సురక్షిత ఆహారం దిశగా ప్రపంచ ప్రజల్లో వచ్చిన మార్పును సానుకూలంగా మార్చుకోవాలంటే ప్రభుత్వం పెద్దయెత్తున సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. సేంద్రియ సేద్యానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో రసాయనాల్లేని జీవన, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలి. వాటి నాణ్యతను పక్కాగా పరీక్షించేందుకు ఇటీవల కేంద్రం చర్యలు చేపట్టడం మంచి పరిణామం. ఇందులో భాగంగా ఎరువుల పరీక్షలపై నియంత్రణ, అందులో పనిచేసే వారికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. పంట మార్పిడి పాటించే క్రమంలో నేల నుంచి సారాన్ని తీసుకునే పంటలతో పాటు నేలకు సత్తువనిచ్చే పంటలతో మార్పిడి చేసుకుంటే భూమిలో సహజంగా ఉండే పోషకాలు తరిగిపోకుండా కాపాడుకోవచ్ఛు భారతీయుల మూలాల్లోనే ఉన్న సహజ, సేంద్రియ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలి. కరోనా అనంతర పరిస్థితులను ఒక అవకాశంగా మలచుకుంటే ఇంటి పంట సాగుతో ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణపరంగానూ ప్రయోజనాలు పొందవచ్చు.

సురక్షితం.. పర్యావరణహితం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన నేపథ్యంలో సురక్షితాహారం, ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ఆసక్తి పెరుగుతోంది. మనం తినే ఆహారం విషపూరితం కావడం వల్ల ప్రాణాంతక జబ్బులు సోకే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టడం నేడెంతో అవసరం. ఇందుకోసం, రసాయనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించడం, సేంద్రియ వ్యవసాయ విధానాలకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు ఇంటి పంటలను పెద్దయెత్తున సాగు చేసుకోవాలి.

- అమిర్నేని హరికృష్ణ, రచయిత

ఇదీ చదవండి: సేవ చేసిన ఎద్దుపై రైతు మమకారం.. విగ్రహం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.