ETV Bharat / opinion

ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం.. సన్నద్ధత ఏది?

author img

By

Published : Aug 28, 2020, 7:10 AM IST

ప్రపంచంపై ఆహార సంక్షోభం పంజా విసురుతోంది. అఫ్గానిస్థాన్‌, హైతీ, జాంబియా, జింబాబ్వే, మడగాస్కర్‌ లాంటి దేశాలు ఎంతోకాలంగా కరవుకోరల్లో చిక్కి తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడిపోతున్నాయి. భారత దేశంలో ఇప్పటికీ కోట్ల మంది తిండికి మొహం వాచిన పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించకపోతే కరోనా కంటే ఎక్కువగా ఆకలి, పోషకాహారలోపాలే మనదేశంలో పేదలను కబళిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Editorial on food crisis in the world and India
ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం.. సన్నద్ధత ఏది?

కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న సంక్లిష్ట పరిస్థితుల్లో- ఆహార సంక్షోభం పంజా విసురుతోంది. వరదలు, కరవు వంటి పరిస్థితుల వల్ల 23 దేశాలు ఇప్పటికే తీవ్రమైన ఆహార సంక్షోభంలో చిక్కుకున్నాయని ప్రపంచబ్యాంకు నివేదిక చెబుతోంది. అఫ్గానిస్థాన్‌, హైతీ, జాంబియా, జింబాబ్వే, మడగాస్కర్‌ లాంటి దేశాలు ఎంతోకాలంగా కరవుకోరల్లో చిక్కి తీవ్రమైన ఆహారకొరతతో అల్లాడిపోతున్నాయి. చైనా, దక్షిణ కొరియాల్లో ఆహార కొరత ప్రమాదఘంటికలు మోగిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణతో- కోట్ల మంది గుప్పెడు మెతుకుల కోసం కళ్లలో వత్తులేసుకుని చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం ముఖ్య ఆర్థికవేత్త సయ్యద్‌ ఆరిఫ్‌ హుస్సేన్‌ హెచ్చరిస్తున్నారు.

కరోనా ప్రభావంతో ఇప్పటికిప్పుడు ఆకలిచావులు లేకపోయినా పరిస్థితి మున్ముందు మరింత సంక్లిష్టంగా మారుతుందని వాషింగ్టన్‌లోని ‘ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ జొహాన్‌ స్వినెన్‌ హెచ్చరిస్తున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ, రవాణాలకు కొవిడ్‌ కారణంగా ఏర్పడిన అవరోధాలు ఆహార సంక్షోభానికి దారులు తెరుస్తాయన్నది ఆయన ఆందోళన.

ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా సైతం ఇప్పుడు ఆహార సంక్షోభం ముంగిట నిలిచింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఆ దేశం దాదాపు 30శాతం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది. కరోనా నేపథ్యంలో దక్షిణాసియా దేశాల నుంచి ఆహార ధాన్యాల దిగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. మరోవైపు దక్షిణ చైనాలో వరదలు స్థానికంగా తిండిగింజల ఉత్పత్తిపై పెనుప్రభావం చూపాయి. ఒక వ్యక్తి భోజనంలో 93 గ్రాముల పదార్థాలను వృథా చేస్తున్నట్లు చైనా గుర్తించింది. ఇలా వృథా చేసే ఆహారంతో ఏటా 20 కోట్ల మంది కడుపు నింపవచ్చని చైనాలోని రెన్మిన్‌ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలో ఆచార్యుడిగా పని చేస్తున్న వెన్‌ టైజూన్‌ లెక్కగట్టారు. అందుకే ఆహార పదార్థాలను పొదుపుగా వాడుకోవాలంటూ.. ‘క్లీన్‌ యువర్‌ ప్లేట్‌’ పేరిట చైనా పెద్ద ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. పదిమంది హోటల్‌కు వెళితే 9 మందికే ఆహారం కొనుక్కుని దాన్నే పంచుకుని తినాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చెప్పడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ఉత్తర కొరియా కూడా ఆహార సంక్షోభం దిశగా అడుగులేస్తోంది. ఆహారకొరతను తీర్చడానికి ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలన్న అధ్యక్షుడు కిమ్‌ ప్రకటన దీనికి అద్దం పడుతోంది.

భారత్‌లో ఈ ఏడాది అన్ని పంటలూ మంచి దిగుబడినిచ్చాయి. మార్చి నుంచి జూన్‌ వరకు ఆహారధాన్యాల ఉత్పత్తుల ఎగుమతులు 23 శాతానికి పైగా పెరిగాయి. ఈ నాలుగు నెలల్లో రూ.25,552 కోట్ల విలువైైన తిండిగింజలను ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. మన ఎఫ్‌సీఐ గోదాముల్లో తిండిగింజలు ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా పోగుపడ్డాయి. అయితే వాటి పంపిణీలో అసమానతలు కొనసాగుతుండటంతో కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పట్టెడన్నం కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ - జీహెచ్‌ఐ) 2019 ప్రకారం 117 దేశాల్లో మన ర్యాంకు 102. పౌరులకు ఆహార లభ్యత, ఆకలి, పోషకాహారలోపం వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని దీన్ని నిర్ధారిస్తారు. అంతకు ముందు సంవత్సరం 119 దేశాల్లో మన ర్యాంకు 103. పాకిస్థాన్‌ (94), బంగ్లాదేశ్‌ (88), నేపాల్‌ (73), శ్రీలంక (66) కంటే మనం వెనుకబడి ఉన్నాం. ప్రపంచంలో ఆకలి సంక్షోభస్థాయిలో ఉన్న 45 దేశాల్లో భారత్‌ కూడా ఉందని జీహెచ్‌ఐ నివేదిక కుండబద్దలు కొట్టింది. అయితే జీహెచ్‌ఐ కోసం గణాంకాలు లెక్కించే పద్ధతి కాలం చెల్లినదని, భారత్‌ పరిస్థితి నివేదికలో చెప్పినదానికంటే బాగుందని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అంటున్నారు. తమ లెక్కల ప్రకారం జీహెచ్‌లో భారత్‌ స్థానం 102 కాదు... 91 అన్నది ఆయన వాదన. ఇప్పటికీ దేశంలో కోట్ల మంది తిండికి మొహం వాచిన పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించకపోతే కరోనా కంటే ఎక్కువగా ఆకలి, పోషకాహారలోపాలే మనదేశంలో పేదలను కబళిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.