ETV Bharat / opinion

ఈశాన్యం గెలుపుతో బీజేపీలో జోష్.. నెక్స్ట్​ టార్గెట్​ సౌత్

author img

By

Published : Mar 5, 2023, 6:33 PM IST

ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని యోచిస్తోంది. దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాషాయ పార్టీ.

bjp target 2024 election
bjp target 2024 election

భారతీయ జనతా పార్టీ చూపు దక్షిణాదిపై పడిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో రెండింట్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. అలాగే మరో చోట కూడా ప్రభుత్వంలో భాగమవ్వనుంది. ఇప్పుడు అదే జోష్​ను కొనసాగిస్తూ దక్షిణాదిలోనూ పాగా వేయాలని యోచిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన ప్రారంభించింది కాషాయ పార్టీ. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిలోని 129 స్థానాల్లో కేవలం 29 నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది బీజేపీ. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనేక ప్రాంతాల్లో కమలం పార్టీకి బలం పెరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిలో పాగా వేసి.. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తహతహలాడుతోంది.

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. దీంతో పాటు బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న తెలంగాణలోనూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2024లో పరిస్థితులు బీజేపీకి అనుకూలిస్తాయో లేదో అన్నది ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడుతుంది. తెలంగాణలో వరుసగా రెండు ఉపఎన్నికలు, హైదరాబాద్​ మున్సిపల్​ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. అదే జోష్​తో 2024లోనూ గెలవాలని భావిస్తోంది. కానీ కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి.. బీజేపీకి సవాల్​గా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిలో గెలుపొందిన 29 స్థానాలు బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక సహా తెలంగాణలోనే ఉన్నాయి. కర్ణాటకలో ఉన్న 29 స్థానాల్లో 25 గెలవగా.. తెలంగాణలో నాలుగు చోట్లు గెలుపొందింది. తమిళనాడు, కేరళ సహా ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేని కేరళలో కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

తమిళనాడు
ద్రవిడ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తమిళనాడు పైనా కన్ను వేసింది బీజేపీ. 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే జోరును తట్టుకొని కూడా 4 నియోజకవర్గాల్లో విజయం సాధించింది కమలం పార్టీ. ఇందులో ద్రవిడ నాయకుడు, హేతువాది రామస్వామి పెరియార్​ జన్మించిన ఈరోడ్ జిల్లాలోను ఒక సీటును సంపాదించుకుంది. అదే ఊపును కొనసాగిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 15 లోక్​సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.

"రాష్ట్రంలోని 39 లోక్​సభ స్థానాల్లో 15 చోట్ల కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాం. మిగతా 24 నియోజకవర్గాలను మా భాగస్వామ్య పక్షాలకు కేటాయించాం. ఇప్పటికే గెలిచే స్థానాలను.. గతేడాది ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలను గుర్తించాం. నెలల వ్యవధిలో అనేక మంది కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇది పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తోంది."

--ఎమ్​. చక్రవర్తి, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు

"డీఎంకేలో సామాజిక న్యాయం లేదు. బీజేపీ మాత్రమే అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఫలితంగానే బీజేపీ సంస్థాగతంగా బలపడుతోంది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించిన వారందరూ మా కూటమిలో చేరొచ్చు."

--కే.అన్నామలై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

తెలంగాణ
కర్ణాటక తర్వాత దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానంలో గెలిచినా.. తర్వాత జరిగిన రెండు ఉపఎన్నికల్లో విజయం సాధించింది. 2020లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్​ ఎన్నికల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది కమలం పార్టీ. గత రెండేళ్లలో సంస్థాగతంగా బలపడుతూ అధికార బీఆర్​ఎస్​ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లోకి వెళుతోంది కాషాయ పార్టీ. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో బలంగా ఉన్న బీఆర్​ఎస్​ను గద్దె దించడం అంత అషామాషీ కాదనే చెప్పాలి. మరోవైపు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మారుస్తూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్​
మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ(వైకాపా, తెదేపా) పార్టీలు బలంగా ఉండటం వల్ల బీజేపీకి పొలిటికల్​ గ్యాప్​ దొరకడం లేదు. కమలం పార్టీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉండగా.. అధినేత పవన్ కల్యాణ్​ మాత్రం టీడీపీతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ పరిణామాలు బీజేపీకి కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.

కేరళ
వామపక్ష భావజాలం ఉన్న కేరళలో బీజేపీ గెలుపొందడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి.. కేరళలో మాత్రం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. రాజకీయంగా చైతన్యం కలిగిన కేరళలో బీజేపీ గెలిచి.. ప్రధాని ఆశయమైన దక్షిణాదిలో పాగా వేయడం అంత సులభం కాదన్నారు కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, అరుణాచల్​ ప్రదేశ్​ సహా అనేక రాష్ట్రాల్లో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో.. అలాంటి వ్యూహాలను అమలు చేసి కేరళలోను వస్తారేమోనని అభిప్రాయపడ్డారు.

యడియూరప్ప పేరుతోనే ఎన్నికల బరిలోకి
కర్ణాటకలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. అయితే ఇన్నేళ్లు పార్టీకి బలంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి నిర్మించి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప పైనే ఆశలు పెట్టుకుంది బీజేపీ. విజయాన్ని ప్రభావితం చేసే లింగాయత్​ సామజిక వర్గానికి చెందిన ఆయనే తమ గుర్తు అంటూ ప్రజల్లోకి వెళ్తోంది. అందుకోసమే యడియూరప్పను ఆకాశానికి ఎత్తేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోదీ సైతం యడియూరప్పను కొనియాడారు. ఆయన 80వ పుట్టిన రోజు సందర్భంగా శివమొగ్గలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ప్రజలు అందరూ తమ ఫోన్​ లైట్​లు ఆన్​ చేసి యడియూరప్పకు శుభాకాంక్షలు తెలపాలని పిలుపునిచ్చారు ప్రధాని. యడియూరప్ప ప్రసంగం ముగించగానే ప్రధాని సైతం లేచి చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ కాకుండా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్​ కూడా యడియూరప్పను పొగిడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.