భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మధుకర్ రెడ్డి, మోయిజ్ పాషను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
అసలేమైందంటే..
దంపతులైన వినోద, మధుకర్ రెడ్డి... అర్జున్ పౌల్ట్రీ ఫామ్ పేరుతో రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం బాల్ రెడ్డి, మోయిజ్ పాషా, నర్సింహారెడ్డితో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారు. ఇబ్రహీంపట్నంలోని శేరిగుడలో రెండెకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి... ఐదేళ్ల క్రితం ఆర్బీఎల్లో రూ.3.7 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తంలో 2.7 కోట్లు తిరిగి చెల్లించకుండా బకాయిపడ్డారు.
దీనిపై ఆర్బీఎల్ ప్రతినిధులు అంతర్గత విచారణ చేపట్టగా... నకిలీ పత్రాలు పెట్టి బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించారు. సీసీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యం పట్టివేత