ETV Bharat / jagte-raho

యూట్యూబ్​లో చూసి నేర్చుకుని లక్షలు వసూలు చేశారు...!!

author img

By

Published : Oct 9, 2020, 6:02 PM IST

MIMICRY GANG ARRESTED IN MAHABOOBNAGAR
MIMICRY GANG ARRESTED IN MAHABOOBNAGAR

పోలీసులు ఉన్నతాధికారి గొంతుతో మిమిక్రీ చేసి... బాధితులను బుట్టలో వేసుకునేవారు. ఉద్యోగాలిస్తామని... వాళ్లకు కావాల్సిన పనులు చేసిపెడతామని నమ్మబలికేవారు. ఒక ఉన్నతాధికారే తనకు ఫోన్​ చేసి పని చేసిపెడతానంటే... జనాలు నమ్మకుండా ఎలా ఉంటారు. అలా నమ్మిన ఎంతో మంది బాధితుల నుంచి లక్షలకు లక్షలే వసూలు చేసి జల్సాలు చేశారు. పాపం పండకా మానదు... దొంద దొరకకా మానడు అన్నట్లు చివరికి ఆ మిమిక్రీ ముఠా పోలీసులకు చిక్కింది.

పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, విజిలెన్స్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వివిధ రకాల పనులు చేసి పెడతామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను మహబూబ్​నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కాగా... దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులు మహబూబ్​నగర్​లో పట్టుబడ్డారు. హన్వాడకు చెందిన చంద్రశేఖర్... అతని సహచరులు దొమ్మరి రవి, మాదాసు బాలయ్య, మాదాసు తేజలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు జక్కరయ్య పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 2 సెల్ ఫోన్లు, 4 ద్విచక్రవాహనాలు, రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

యూట్యూబ్​లో చూసి నేర్చుకుని...

యూట్యూబ్​లో ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ వీడియోలు చూసి... ఆయనలా మాడ్లాడటం నిందితులు అభ్యాసం చేశారు. పోలీసుశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇతర పనులు చేసి పెడతామని ఫోన్లు చేసి బాధితులను నమ్మించేవారు. ఉన్నతాధికారే మాట్లాడుతున్నాడన్న భ్రమలో బాధితులు నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్లు. ఇలా మొత్తం రూ. 28లక్షల 8వేలు బాధితుల నుంచి తీసుకున్నారు. జల్సాలకు, విలాసాలకు డబ్బు ఖర్చు చేశారని పోలీసులు వెల్లడించారు.

ఎక్కడెక్కడా... ఎతెంతా...???

తెలకపల్లి పీఎస్ పరిధిలో ఒకరి నుంచి రూ.7లక్షలు, బిజినెపల్లి పీఎస్ పరిధిలో ఒకరి నుంచి రూ. 5లక్షల 29వేలు, షాద్​నగర్ పీఎస్ పరిధిలో ఒకరి నుంచి రూ.5లక్షల 13వేలు, జడ్చర్ల పీఎస్ పరిధిలో ఒకరి నుంచి రూ. 2లక్షల 66వేలు, అలంపూర్​కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. ఆరున్నర లక్షలు, షాద్​నగరలో ఒకరి నుంచి లక్షన్నర తీసుకుని మోసం చేసినట్లుగా నిందితులపై పలు కేసులు నమోదయ్యాయి.

ఇవి కాకుండా గతంలోనే ఇలాంటి మోసాలకు సంబంధించి వీరిపై హన్వాడ, తిరుపతి, మహబూబ్ నగర్, బాలనగర్​లోనూ కేసులు నమోదయ్యాయి. పూర్తి విచారణ అనంతరం అవసరమైతే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: మైనర్​ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన బాలుడిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.