ETV Bharat / jagte-raho

మృత్యుమార్గం : మూడేళ్లలో 117 ప్రాణాలు బలి

author img

By

Published : Dec 3, 2020, 7:11 AM IST

accidents
ఆ దారి మృత్యుమార్గం... మూడేళ్లలో 117 ప్రాణాలు బలి

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది. గత మూడేళ్లలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మెయినాబాద్‌ ఠాణాల పరిధిలో 438 ప్రమాదాలు జరగ్గా 117 మంది చనిపోయారు. 423 మంది గాయపడ్డారు.

వివరాలిలా...

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు నిదర్శనాలివీ..!! నగర శివారు టిప్పుఖాన్‌ వంతెన నుంచి వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ వరకు మృత్యుమార్గంగా మారింది. గత మూడేళ్లలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మెయినాబాద్‌ ఠాణాల పరిధిలో 438 ప్రమాదాలు జరగ్గా 117 మంది చనిపోయారు. 423 మంది గాయపడ్డారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున కందవాడ-మల్కాపూర్‌ మధ్య బోర్‌వెల్‌ బండిని ఇన్నోవా కారు ఢీకొట్టడంతో పాతబస్తీకి చెందిన ఏడుగురు మృతిచెందడం విషాదం నింపింది. మరోసారి ఈ మార్గం దుస్థితిని తేటతెల్లం చేసింది.

60 అడుగుల నుంచి 45 అడుగులకు..

హైదరాబాద్‌ నుంచి బీజాపూర్‌ జాతీయ రహదారి ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. నగరం నుంచి కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్‌తోపాటు వికారాబాద్‌ జిల్లాకు వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం. విస్తరించాలని 15 ఏళ్ల నుంచి డిమాండ్‌ ఉంది. గతంలో నాలుగు వరుసలుగా 60 అడుగులు విస్తరించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించి భూసేకరణ చేశారు. ఆ తర్వాత ఎందుకనో నిర్మాణాన్ని నిలిపివేసింది. రెండు నెలల క్రితం కేంద్రప్రభుత్వం మళ్లీ పచ్చజెండా ఊపింది. విస్తరణను 45 అడుగులకు కుదించింది. దీంతో మరోసారి భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి పూర్తి వంకర్లు తిరిగి ఉంది. ప్రతి 2 కిలోమీటర్లకు మూలమలుపు ఉండటంతో వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

అదే ప్రాంతంలో మరో యువకుడు

చేవెళ్ల మండలం కందవాడ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినచోటుకు సమీపంలోనే మరో ఘటన జరిగింది. ఊరెళ్లకు చెందిన జి.సునీల్‌(23) అంబులెన్స్‌ డ్రైవర్‌. విధులు ముగించుకుని బైకుపై గ్రామానికి వస్తుండగా.. కందవాడ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.