ETV Bharat / international

టర్కీలో ధరల భగభగ.. తిండి కూడా కొనుక్కోలేని దుస్థితి!

author img

By

Published : Jan 3, 2022, 7:23 PM IST

Turkey Inflation crisis: టర్కీలో ధరలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం వల్ల.. టర్కీ ప్రజలు నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అధ్యక్షుడి ఒత్తిడితో వడ్డీ రేట్లపై టర్కీ కేంద్ర బ్యాంకు కోతలు విధించడం వల్ల.. కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది.

turkey inflation
turkey inflation

Turkey Inflation crisis: టర్కీలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. వార్షిక ద్రవ్యోల్బణం రేటు 19 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ డిసెంబర్​ నాటికి 36.08 శాతానికి ఎగబాకింది. డిసెంబర్​లో వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే 13.58 శాతం మేర పెరిగిందని టర్కీ గణాంక సంస్థ ప్రకటించింది. ఆహార ధరల్లో వార్షిక పెరుగుదల 43.8 శాతంగా ఉందని తెలిపింది.

Turkey original inflation rate 2021

అయితే, స్వతంత్రంగా పనిచేసే 'ద్రవ్యోల్బణ పరిశోధన బృందం' మాత్రం దేశంలో ద్రవ్యోల్బణం 83 శాతానికి చేరిందని పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే డిసెంబర్​లో 19.35 శాతం పెరిగిందని వెల్లడించింది.

కరెన్సీ పతనం

Turkey currency crisis: ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా.. 2002 సెప్టెంబర్​ తర్వాత అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఇదే. ఓ వైపు ధరలు భారీగా పెరుగుతుంటే.. టర్కీ కరెన్సీ లిరా.. రోజురోజుకూ పతనమవుతోంది. అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఒత్తిడితో కీలక వడ్డీ రేట్లపై టర్కీ సెంట్రల్ బ్యాంకు కోతలు విధించడం వల్ల.. కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. తద్వారా దిగుమతులు కష్టతరమయ్యాయి. దీంతో దేశంలో ప్రతి వస్తువు ధర భారీగా పెరిగింది. ఫలితంగా దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తోంది.

Turkey economy crisis: గతేడాది డాలర్​తో పోలిస్తే లిరా 44 శాతం పతనమైంది. ఒక డాలరుకు 18.36 లిరాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఎర్డోగన్. ఆ తర్వాత కరెన్సీ కొంతవరకు కోలుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఒత్తిళ్ల మధ్యే కొనసాగుతోంది.

బంగారం, విదేశీ కరెన్సీ కొనుగోళ్లు..

టర్కీలో 8.4 కోట్ల మంది నివసిస్తున్నారు. అందులో చాలా మంది కనీసం ఆహారం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది తమ సేవింగ్స్​ను కాపాడుకునేందుకు విదేశీ కరెన్సీని, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

అయితే, 2021లో దేశ ఎగుమతులు 32.9 శాతం పెరిగి, 225.4 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయని సోమవారం ఎర్డోగన్ ప్రకటించారు. వాణిజ్య లోటు 7.8 శాతానికి పరిమితమైందని చెప్పారు. 2022కు ఎగుమతుల లక్ష్యాన్ని 250 బిలియన్ డాలర్లగా నిర్దేశించుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: సుడాన్​లో రాజకీయ ప్రతిష్టంభన- ప్రధాని రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.