అగ్రరాజ్య వైమానిక దాడుల్లో ఇరాన్ అనుకూల ఉద్యమకారులు చనిపోవడంపై.. ఇరాక్ రాజధానిలో బాగ్దాద్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనకారులు బాగ్దాద్లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేశారు. రాళ్లు విసిరి సెక్యూరిటీ కెమేరాలు ధ్వంసం చేశారు. కార్లతో దౌత్యకార్యాలయం గేట్లు పగలగొట్టిన నిరసనకారులు ప్రాంగణంలోని చెక్ పోస్టుకు నిప్పుపెట్టారు. లోపల ఉన్న అమెరికా బలగాలు బాష్పాయువులు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశాయి.
గతవారం ఇరాక్లో పనిచేస్తున్న ఒక అమెరికా కాంట్రాక్టర్ రాకెట్ దాడిలో చనిపోయారు. అందుకు ప్రతీకారంగా ఇరాన్ అనుకూల హషద్ అల్ షాబీ గ్రూప్పై అమెరికా.. వైమానిక దాడులు చేసింది. ఆ ఘటనలో 25 మంది మృతిచెందారు. ఈ దాడిపై ఇరాకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాక్ దళాలకు శిక్షణ ఇస్తున్న అమెరికా బలగాలు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. మహిళలు సహా వేలాది మంది ఇరాకీ ప్రజలు అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేశారు.
వైమానిక దాడి తర్వాత ఇరాక్ నుంచి అమెరికా దళాలను వెళ్లగొట్టాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. అమెరికా మాత్రం తమ ప్రయోజనాలు కాపాడడంలో ఇరాక్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.