ETV Bharat / international

పుతిన్​ సేనల నిష్క్రమణ.. మానవహక్కుల మండలి నుంచి రష్యా ఔట్​!

author img

By

Published : Apr 8, 2022, 7:57 AM IST

RUSSIA OUT FROM UN ASSEMBLY
RUSSIA OUT FROM UN ASSEMBLY

Russia out from UNHRC: ఉక్రెయిన్​పై భీకర దాడి కొనసాగిస్తున్న రష్యాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యా సస్పెండ్ అయింది. ఐరాసలో గురువారం జరిగిన ఈ ఓటింగ్​కు కూడా భారత్​ దూరంగా ఉంది. మరోవైపు.. కీవ్​లోకి అడుగుపెట్టలేకపోయిన పుతిన్​ సేనలు రష్యాకు తిరుగుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

Russia out from UNHRC: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వారాల తరబడి పోరాడినా.. రాజధాని కీవ్‌లోకి అడుగు పెట్టలేకపోయిన పుతిన్‌ సేనలు అక్కడి నుంచి తిరుగుముఖం పట్టాయి. ఉక్రెయిన్‌ సైనికులతో పోరాడలేక ఆ దేశంలోని మరిన్ని ప్రాంతాల నుంచి వెనుతిరుగుతున్నాయి. ఉక్రెయిన్‌ ప్రభుత్వ స్థైర్యాన్ని దెబ్బతీసేలా.. తూర్పు ప్రాంతంపై భీకర దాడులకు రష్యా సిద్ధమవుతున్నట్టు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో పాటు అమెరికా తదితర దేశాల రక్షణ శాఖల నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించే తీర్మానంపై సర్వప్రతినిధి సభలో గురువారం ఓటింగ్‌ జరిగింది. మెజార్టీ దేశాలు మద్దతు పలకడంతో ఈ ప్రక్రియ దాదాపు ఖరారైనట్టేనని భావిస్తున్నారు.

పౌరుషముంటే.. యుద్ధం ఆపమనండి- జెలెన్​స్కీ: తూర్పు ప్రాంతంలో భీకర దాడులు చేపట్టేందుకు రష్యా వ్యూహాలు రచిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ చెప్పారు. ‘‘బుచా ప్రాంతంలో యుద్ధ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. పుతిన్‌ సేనలు అమాయక ఉక్రెయిన్‌ పౌరులను అత్యంత అమానవీయంగా హింసిస్తున్నాయి. రష్యన్లకు ఏమాత్రం పౌరుషమున్నా... యుద్ధాన్ని ఇక్కడితో ఆపాలని వారు డిమాండ్‌ చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కీవ్‌ శివారు ప్రాంతాలు, చెర్నిహైవ్‌ల నుంచి సుమారు 24 వేల మంది సైనికులు బెలారస్‌, రష్యాలకు వెనుతిరుగుతున్నట్టు నివేదికలు అందాయి. డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యన్‌ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. వీరి సాయంతో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా యోచిస్తోంది.

డాన్‌బాస్‌ నుంచి వెళ్లిపోండి: పుతిన్‌ సేనలు డాన్‌బాస్‌ను తదుపరి లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అక్కడి ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని ఉక్రెయిన్‌ అధికారులు హెచ్చరించారు. రష్యా దాడులు చేయడానికి కొన్ని రోజులు పడుతుందని, ఈలోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత తాము ఏమీ చేయలేమని ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్‌ పేర్కొన్నారు. కీవ్‌, చెర్నిహైవ్‌ తదితరచోట్ల రష్యా సైన్యం భారీగా దెబ్బతిందని, సేనలను సమీకరించి ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంపై దాడులు చేయడానికి కొంత సమయం పట్టవచ్చని రష్యా నిఘా అధికారి ఒకరు పేర్కొన్నారు.

చెల్లాచెదురుగా మృతదేహాలు: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేసిన పలు ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రాజధాని కీవ్‌కు వెలుపల రోజుల తరబడి పడి ఉన్న శవాలను సిబ్బంది సేకరిస్తున్నారు. మేరియుపొల్‌లో ఇప్పటివరకూ మరణించిన పౌరుల సంఖ్య 5 వేలు దాటినట్టు స్థానిక మేయర్‌ వెల్లడించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. రష్యా దాడుల ధాటికి మేరియుపొల్‌లోని మౌలిక సదుపాయాలు 90% ధ్వంసమయ్యాయి.

సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌కు భారత్‌ దూరం: ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించే అంశంపై ఐరాస సర్వప్రతినిధి సభలో గురువారం ఓటింగ్‌ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, వ్యతిరేకంగా 24 దేశాలు ఓటు వేశాయి. భారత్‌ సహా మొత్తం 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. దీంతో ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా తొలగింపు ఖరారైనట్టేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్‌లు శాంతియుత మార్గంలో హింసకు ముగింపు పలకాలని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి చెప్పారు. అందుకే తాము ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.

బుచా హింసను పునరావృతం కానివ్వొద్దు: బుచా ప్రాంతంలోని అమాయక పౌరులపై రష్యా సైనికులు సాగించిన దారుణ హింసాకాండను, లైంగిక వేధింపులను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తీవ్రంగా ఖండించారు. తూర్పు ప్రాంతంలో భీకర దాడులకు పాల్పడాలని రష్యా భావిస్తున్నందున.. అక్కడ ఇలాంటి ఘటనలు పునరావతృతం కాకుండా తమకు ఆయుధాలివ్వాలని ఉక్రెయిన్‌ మరోసారి పశ్చిమ దేశాలను అభ్యర్థించింది.

వాణిజ్య సంబంధాలను తెంచుకోనున్న అమెరికా: రష్యాతో సాధారణ వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకూ, ఆ దేశం నుంచి ఇంధన దిగుమతులను నిలిపివేసేందుకూ అమెరికా రెండు బిల్లులను సిద్ధం చేస్తోంది. రష్యా నుంచి భారత్‌ ఇంధనం, ఇతర వస్తువుల దిగుమతి చేసుకోవడం పట్ల అమెరికా మరోసారి తన అయిష్టతను వ్యక్తం చేసింది. మాస్కో నుంచి భారత్‌ ఇంధనం, ఇతర వస్తువుల దిగుమతులను పెంచుకోవాలని తాము కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌, రష్యాలు వ్యక్తిగత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాయన్నారు.

మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు: కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్‌ సైన్యాన్ని దీటుగా ఎదిరించలేకపోతున్న రష్యా.. జెలెన్‌ స్కీ సైన్యాన్ని, ఆయన సేనలను బలహీనపరిచేందుకు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడంపై దృష్టి సారించిందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొంది. సైనికులు సరఫరా కొరత, నైతిక స్థైర్యం దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదని బ్రిటన్‌ రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారత్​లోని పవర్ గ్రిడ్​లపై చైనా సైబర్ దాడులు.. కీలక డేటా చోరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.