ETV Bharat / international

'మోదీజీ మా దేశాన్ని ఆదుకోండి'.. జెలెన్​స్కీ విజ్ఞప్తి

author img

By

Published : Apr 12, 2023, 1:49 PM IST

Updated : Apr 12, 2023, 2:49 PM IST

తీవ్ర సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్​ ప్రపంచ దేశాల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే సహాయం కోరుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ. అందులో ఏముందంటే?

ukraine russia war
ukraine russia war

ఏడాదికి పైగా జరుగుతున్న ఉక్రెయిన్​-రష్యా యుద్ధం మంటలు ఇంకా చల్లారలేదు. దీంతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది ఉక్రెయిన్​. ఈ క్రమంలో దేశ పునర్నిర్మాణం కోసం ప్రపంచ దేశాల సహకారం కోరుతోంది ఉక్రెయిన్​ ప్రభుత్వం. ఇందులో భాగంగానే మానవతా దృక్పథంతో తమకు చేయుతనందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ. ఈ లేఖలో పలు వైద్య పరికరాలతో పాటు ఔషధాల కొరతను తీర్చే విధంగా అదనపు మానవతా సాయం అందించాలని జెలెన్​స్కీ అభ్యర్థించారు.

ఉక్రెయిన్​ విదేశాంగ ఉప మంత్రి ఎమినే జపరోవా భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి జెలెన్‌స్కీ రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్య సామగ్రి వంటి అదనపు మానవతా సాయం అందించాలని అందులో కోరారు. అందుకు భారత్‌ ముందుకువచ్చిందని వెల్లడిస్తూ మన విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్విట్టర్​లో స్పందించారు. అలాగే ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం భారత సంస్థలకు ఓ అవకాశమని జపరోవా తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం భారత్‌ నుంచి ఆమె మరింత సహకారాన్ని కోరారు. మోదీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని అభ్యర్థించారు. అయితే.. ఇతర దేశాలతో భారత్‌కున్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశంలేదన్నారు. రష్యా నుంచి భారత్‌ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఈ దిగుమతులు పెరిగాయి.

భారత్​ ఓ విశ్వగురువు..: ఉక్రెయిన్​ మంత్రి
యుద్ధం తర్వాత మొదటిసారి భారత్‌లో పర్యటిస్తోన్న ఉక్రెయిన్​ ఉప విదేశాంగ మంత్రి ఎమినే జపరోవా.. భారత్​ను ప్రశంసించారు. " భారతదేశం ఒక గ్లోబల్‌ ప్లేయర్‌.. విశ్వ గురువు అని నేను భావిస్తున్నాను" అని ఆమె కొనియాడారు. అలాగే తాము విలువల కోసం పోరాడుతూ తీవ్ర వేదనను అనుభవిస్తున్నట్లు చెప్పారు.

గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమయిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది గడిచింది. అయినా ఈ మారణకాండకు మాత్రం ముగింపు పలకట్లేదు ఇరు దేశాలు. ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న దాడులకు ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో ఎన్నో బాంబులు మోగాయి. క్షిపణులు పేలాయి. ఇళ్లు, జీవితాలు కూలాయి. అప్పటికే అఫ్గానిస్థాన్‌ మానవ సంక్షోభంతో తల్లడిల్లిన అంతర్జాతీయ సమాజం ముందు ఉక్రెయిన్‌ సంక్షోభం వచ్చిపడింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచలోని పలు దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్న వేళ భారత్‌ మాత్రం ముందు నుంచి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తోంది. ఇతర దేశాల నుంచి అనేక ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వచ్చినా దేశ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యమని సూచిస్తూ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనికి ప్రధాన కారణం మనకు రష్యాతో ఉన్న మంచి సత్సంబంధాలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 12, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.