ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​పై వరుస విమర్శలు.. కారణం ఏంటో తెలుసా?

author img

By

Published : Oct 31, 2022, 10:10 PM IST

uk-pm-sunak-criticised-for-planning-to-skip-un-climate-summit
బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​పై వరుస వివర్శలు

ఈజిప్టు వేదికగా త్వరలో జరగబోయే పర్యావరణ సదస్సుకు హాజరు కాకూడదని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌ వరుస విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిన్నటికి నిన్న సుయెల్లా బ్రేవర్మన్‌ను తిరిగి హోం సెక్రటరీగా తీసుకోవడంపై ఆయనపై వ్యతిరేకత రాగా.. తాజాగా వాతావరణ సదస్సులో పాల్గొనకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

ఈజిప్టు వేదికగా నవంబరు 6 నుంచి 18 వరకు పర్యావరణ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని సునాక్‌ హాజరయ్యే అవకాశం లేదని డౌనింగ్‌ స్ట్రీట్‌ గతవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర సమావేశాలు, కార్యక్రమాల నేపథ్యంలో ఆయన ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక, బ్రిటన్‌ రాజు, ప్రముఖ పర్యావరణవేత్త ఛార్లెస్‌ 3 కూడా ఈ సదస్సులో పాల్గొనట్లేదని అక్టోబరు మొదటి వారంలో యూకే మీడియా వెల్లడించింది. అప్పటి ప్రధాని ట్రస్‌ సలహా మేరకు ఛార్లెస్‌ 3 ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇప్పుడు ప్రధాని సునాక్‌ కూడా ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఈజిప్టు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సునాక్‌ నిర్ణయం, బ్రిటన్‌ రాజు సదస్సుకు హాజరవకుండా యూకే ప్రభుత్వం ఒత్తిడి తేవడం వంటి పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. యూకే తీరు ఆందోళన కలిగిస్తోందని.. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో బ్రిటన్‌ చేతులు దులుపుకోవాలని చూస్తోందా? అని పలు దేశాధినేతలు ప్రశ్నిస్తున్నారు.

గతేడాది గ్లాస్గోలో జరిగిన పర్యావరణ సదస్సుకు అప్పటి యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వం వహించారు. అప్పటి యూకే కేబినెట్‌ మంత్రిగా ఉన్న అలోక్‌ శర్మ అధ్యక్షతన ఆ సమావేశాలు జరిగాయి. బ్రిటన్‌ రాజు ఛార్లెస్.. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ హోదాలో ఆ సదస్సుకు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.