ETV Bharat / international

తప్పు ఒప్పుకున్న గద్దె విజయ.. బైడెన్ స్టోరీపై ట్విట్టర్​లో ఆంక్షలు నిజమేనట!

author img

By

Published : Feb 9, 2023, 3:42 PM IST

హంటర్ బైడెన్ ల్యాప్​టాప్ కథనం​ సెన్సార్​షిప్​పై ట్విట్టర్ మాజీ ఉద్యోగి విజయ గద్దె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ పోస్ట్ కథనంపై ట్విట్టర్ తాత్కాలికంగా నిషేధం విధించడం నిజమేనని అంగీకరించారు. మరోవైపు, భారత్​లో ట్విట్టర్ బ్లూ సేవలు ప్రారంభమయ్యాయి.

Twitter vijaya gadde
Twitter vijaya gadde

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్​టాప్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​ రహస్యాలపై న్యూయార్క్ పోస్ట్ రాసిన కథనాన్ని ట్విట్టర్ తాత్కాలికంగా నిషేధించినట్లు ట్విట్టర్ మాజీ ఉన్నత ఉద్యోగిని విజయ గద్దె అంగీకరించారు. వెంటనే ఆ కథనాన్ని పునరుద్ధరించేలా ట్విట్టర్ చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ఇప్పుడు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికా చట్టసభ్యుల ముందు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. అయితే, ఆంక్షలు విధించడం వెనక ప్రభుత్వ హస్తమేమీ లేదని స్పష్టం చేశారు.

రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభ ఓవర్​సైట్ కమిటీ.. హంటర్ బైడెన్ ల్యాప్​టాప్ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. ఈ కథనంపై ట్విట్టర్ ఆంక్షలు విధించడంపై దర్యాప్తు చేస్తోంది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం మాజీ అధిపతి యోయెల్ రోథ్ చట్టసభ్యుల ముందు హాజరయ్యారు.

"తప్పుడు సమాచారాన్ని నియంత్రించడంపై మా దృష్టి ఉండేది. ఆ సమయంలో హంటర్ బైడెన్ కథనంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై గందరగోళం తలెత్తింది. అధ్యక్ష ఎన్నికలపై ఇతర ప్రభుత్వాలు సైబర్ దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజమో తెలియదు. అయితే, 2016 ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లను మేం పునరావృతం కానీయొద్దు అని అనుకున్నాం. ఈ విషయంలో ట్విట్టర్ పొరపాటు చేసింది."
-యోయెల్ రోథ్, ట్విట్టర్ మాజీ ఉద్యోగి

ట్విట్టర్ నిషేధించిన కథనంలో ఏముందంటే?
హంటర్ బైడెన్ ల్యాప్​టాప్ స్టోరీ విషయంపై 2020 ఎన్నికల సమయంలో జో బైడెన్ టీమ్​తో విజయ గద్దె జరిపినట్లు పేర్కొన్న సంభాషణలను ఇటీవల మస్క్ బయటపెట్టారు. ఓ స్వతంత్ర జర్నలిస్టు ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. 'హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​' అంశంపై సెన్సార్​షిప్ విధించడం వెనక విజయ గద్దె క్రియాశీలంగా పనిచేశారని స్వతంత్ర జర్నలిస్టు, రచయిత మాట్ తైబీ పేర్కొన్నారు.

మాట్ తైబీ వివరాల ప్రకారం.. 2020 అక్టోబర్ 14న హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​లోని రహస్య ఈమెయిల్స్ గురించి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ కథనం ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ట్విట్టర్.. తీవ్రమైన చర్యలకు పాల్పడింది. హంటర్ బైడెన్ న్యూయార్క్ పోస్ట్​ కథనానికి సంబంధించిన లింకులను తొలగించడమే కాకుండా, వాటికి వార్నింగ్ సందేశాలు జత చేసింది. "చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన కేసుల్లో వినియోగించే ఓ టూల్​ ద్వారా హంటర్ బైడెన్ స్టోరీ ఎక్కువగా రీచ్ కాకుండా ట్విట్టర్​ అడ్డుకుంది. ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ఉన్నతస్థాయి ఉద్యోగులే తీసుకున్నారు. కానీ ఈ విషయం అప్పటి సీఈఓ జాక్ డోర్సీకి తెలియదు. ట్విట్టర్ లీగల్, పాలసీ హెడ్ విజయ గద్దె ఇందులో కీలక పాత్ర పోషించారు" అని తైబీ వివరించారు.

హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​ కథేంటంటే?
తన కుమారుడు హంటర్ బైడెన్​ అవినీతి ఆరోపణలపై ఉక్రెయిన్​లో విచారణ జరగకుండా.. ఉపాధ్యక్ష పదవిలో ఉన్న జో బైడెన్ అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఉక్రెయిన్​కు చెందిన ఓ కంపెనీ ప్రతినిధితో జో బైడెన్ భేటీ కూడా అయ్యారని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. జో బైడెన్​ను కలిసే అవకాశం ఇప్పించినందుకు సదరు కంపెనీ ప్రతినిధి హంటర్ బైడెన్​కు ఈమెయిల్ రాశారని కథనంలో వివరించింది. ఇందుకు సంబంధించిన మెయిళ్లు హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​లో లభ్యమయ్యాయని రాసుకొచ్చింది. దీన్ని డెమొక్రాట్లు ఖండిస్తున్నారు.

భారత్​లో ట్విట్టర్ బ్లూ..
ట్విట్టర్ బ్లూ సబ్​స్క్రిప్షన్ ఆ సంస్థ భారత్​లో అందుబాటులోకి తెచ్చింది. వెబ్​ కోసమైతే బ్లూ వెరిఫికేషన్​తో కూడిన సేవలను నెలకు రూ.650కు అందించనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్​లకైతే రూ.900 వసూలు చేయనుంది. వార్షిక ప్లాన్ తీసుకున్నవారికి డిస్కౌంట్ సైతం అందిస్తోంది. రూ.6800కే 12 నెలల సబ్​స్క్రిప్షన్​ తీసుకునే వెసులుబాటు కల్పించింది. వార్షిక ప్లాన్ తీసుకుంటే నెలవారీ ఛార్జీలు రూ.566.67 మాత్రమే ఉంటాయని ట్విట్టర్ తెలిపింది. భారత్​తో పాటు బ్రెజిల్​లో ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. దీంతో ట్విట్టర్ బ్లూ సేవలు 15 దేశాల్లో అందుబాటులోకి వచ్చినట్లైంది. అమెరికాలోని ట్విట్టర్ బ్లూ సబ్​స్క్రైబర్లు ఒక ట్వీట్​లలో 4వేలకు పైగా అక్షరాలను పోస్ట్ చేయొచ్చని ట్విట్టర్ తెలిపింది. అయితే, వెబ్​లో ఈ ట్వీట్లను డ్రాఫ్ట్స్​లో సేవ్ చేసుకోలేమని, షెడ్యూల్ కూడా చేయలేమని వివరించింది.

ట్విట్టర్​లో సాంకేతిక లోపం..
అంతకుముందు.. బుధవారం ట్విట్టర్​లో సాంకేతిక లోపం తలెత్తింది. పలువురు ట్వీట్లు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొందరి ఖాతాలు ఓపెన్ అవ్వలేదు. డైరెక్ట్ మెసేజ్ సేవల్లోనూ అవాంతరాలు తలెత్తాయి. ఖాతాలను ఫాలో అయ్యే విషయంలోనూ ఇబ్బంది పడుతున్నట్లు కొందరు ఫిర్యాదులు చేశారు. ట్వీట్లు చేసిన వారికి.. 'మీ రోజువారీ లిమిట్ దాటిపోయింది' అని నోటిఫికేషన్లు వచ్చాయి.

గురువారం ఉదయం 5 గంటల వరకు సమస్య కొనసాగిందని సీఎన్ఎన్ తెలిపింది. గతంలో ఒక ఖాతా రోజుకు 2400 ట్వీట్లు మాత్రమే చేసేలా, 400 మందిని మాత్రమే ఫాలో అయ్యేలా ట్విట్టర్​లో నిబంధన ఉండేది. ఆ రూల్ మళ్లీ వచ్చిందేమోనని కొందరు అయోమయానికి గురయ్యారు. అయితే, కొద్దిసేపటి తర్వాత సమస్య సద్దుమణిగింది. ట్విట్టర్​లో ఇంజినీర్ల కొరత కారణంగా ఇలాంటి సమస్యలు తరచుగా వస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.