'పాకిస్థాన్​ అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటు'.. ప్రధాని షరీఫ్‌ ఆవేదన

author img

By

Published : Jan 15, 2023, 10:55 PM IST

pakistan economic crisis

పాకిస్థాన్​ ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆవేదన వక్తం చేశారు. ఒక అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్‌ కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే దేశ దుస్థితిపై ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల విషయమై మాట్లాడుతూ.. ఒక అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రొబేషనరీ అధికారుల పాసింగ్ అవుట్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. మరిన్ని రుణాలు కోరడం తనకు ఇబ్బంది కలిగించిందని చెప్పారు. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు విదేశీ రుణాలు సరైన పరిష్కారం కాదని, వాటిని మళ్లీ చెల్లించాల్సి ఉంటుందని షెహబాజ్‌ తెలిపినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.

కొంత కాలంగా పాక్‌ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. వాణిజ్య బ్యాంకులతో కలిపి సుమారు 10.18 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్పం. ఈ క్రమంలో డాలర్లను కాపాడుకొనేందుకు పాక్‌ అనేక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం ఖరారయ్యే వరకు తక్షణ ప్రాతిపదికన అదనపు డిపాజిట్ల కోసం స్నేహపూర్వక దేశాలతో, ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా.. రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయని షెహబాజ్‌ షరీఫ్‌ గతంలోనూ ఓసారి ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.