ETV Bharat / international

రష్యాకు దీటుగా ఉక్రెయిన్​ దాడులు.. యుద్ధనౌక ధ్వంసం!

author img

By

Published : Apr 7, 2022, 12:10 PM IST

Russia Ukraine War
రష్యాకు దీటుగా ఉక్రెయిన్​ దాడులు.

Russia Ukraine War: తనకంటే శక్తిమంతమైన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌... మరోసారి గట్టి ఎదురుదెబ్బ కొట్టింది! ఒడెసా నగరాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు వరుస బాంబులు కురిపిస్తున్న మాస్కో యుద్ధనౌక 'అడ్మిరల్‌ ఎస్సెన్‌'ను... నెప్ట్యూన్‌ క్రూయిజ్‌ క్షిపణితో ధ్వంసం చేసింది. ఈనెల 4న ఈ ఘటన జరిగిందని విశ్వసనీయ నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఉక్రెయిన్‌ నౌకాదళం మాత్రం దీన్నింకా ధ్రువీకరించలేదు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను కైవసం చేసుకునేందుకు పుతిన్‌ సేనలు నెల రోజులుగా చెమటోడ్చుతున్నా, ఇంతవరకూ ముందడుగు పడలేదు. రష్యా దాడులను ఉక్రెయిన్‌ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటూనే... దెబ్బతినే స్థితి నుంచి దెబ్బకొట్టే స్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట సరిహద్దులకు ఆవల రష్యా భూభాగంలోని భారీ ఇంధన నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసిన జెలెన్‌ స్కీ సేనలు.. తాజాగా ఆ దేశ యుద్ధనౌకను మట్టుబెట్టడంపై యుద్ధ నిపుణులను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిలకడగా పోరాడుతున్న ఉక్రెయిన్‌...తన శత్రువుపై క్రమంగా పైచేయి సాధిస్తోందని విశ్లేషిస్తున్నారు.

భీకర దాడులను నిలువరించేందుకే: ఒడెసా... ఉక్రెయిన్‌కు అత్యంత వ్యూహాత్మక ఓడరేవు. రష్యా తన అడ్మిరల్‌ ఎస్సెన్, అడ్మిరల్‌ మకరోవ్‌ యుద్ధనౌకలతో పాటు రెండు జలాంతర్గాములను కూడా ఇక్కడ మోహరించింది. ఎస్సెన్‌ను ఉపయోగించి పుతిన్‌ సేనలు 50 క్షిపణులను ఒడెసా నగరంపైకి ప్రయోగించాయి. భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఉక్రెయిన్‌ వ్యూహాత్మకంగా ఇక్కడున్న మాస్కో నౌకలను మట్టుబెట్టడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

2014 లోనే ఆరంభం.. ఉక్రెయిన్‌ దక్షిణ తీరానికి రక్షణ అంతంత మాత్రంగానే ఉంది. రష్యా ఆ ప్రాంతంలో తన నౌకాదళ కార్యకలాపాలను ముమ్మరం చేయడం వల్ల జెలెన్‌స్కీ సర్కారు ఆలోచనలో పడింది. రాజధాని కీవ్‌లోని ఇంజినీరింగ్‌ బ్యూరో 'లంచ్‌' ఆధ్వర్యాన 2014లో... యుద్ధనౌకలను మట్టుబెట్టే క్షిపణి వ్యవస్థల తయారీని ప్రారంభించింది. సోవియట్‌ రష్యా కేహెచ్‌35 క్రూయిజ్‌ మిసైల్‌ను పోలిన 'ఆర్‌కె-360 ఎంసీ నెప్ట్యూన్‌ క్రూయిజ్‌ మిసైల్‌' వ్యవస్థలను తయారుచేసింది.

ఇందుకు సంబంధించిన తొలి యూనిట్‌ 2021 మార్చిలో ఉక్రెయిన్‌ నౌకా దళానికి అందాయి. అయితే, రష్యా సైనిక చర్య ఆరంభంలోనే దీన్ని మట్టుబెట్టినట్టు భావిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం మరో యూనిట్‌ క్షిపణులు ఈ నెలలో అందుబాటులోకి రావాల్సి ఉంది. అలాంటప్పుడు ఉక్రెయిన్‌ నిజంగానే నెప్ట్యూన్‌ను ప్రయోగించిందా? అని పలువురు నిపుణులు అనుమానం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే వాటిని విజయవంతంగా పరీక్షించి ఉంటే, అది ఉక్రెయిన్‌కు శక్తిమంతమైన ఆయుధమే అవుతుందని పేర్కొంటున్నారు.

నల్ల సముద్రంపై పట్టు కోసమే.. ఉక్రెయిన్‌ ఎగుమతులు, దిగుమతుల్లో 70% నల్లసముద్రం మీదుగా నౌకా రవాణా ద్వారానే జరుగుతోంది. ఇందులో సగం వాణిజ్యం ఒడెసా రేవు కేంద్రంగానే సాగుతోంది. అందుకే రష్యా ఈ ప్రాంతంపై పట్టుకోసం భీకరంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు రేవులపై పట్టు సాధించిన మాస్కో సేనలు... ఒడెసాను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అదే జరిగితే, ఉక్రెయిన్‌ తన సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిగా కోల్పోతుంది. వాణిజ్య పరంగా భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది. అందుకే... కీవ్‌ను రక్షించుకోవడానికి ఆ దేశం ఎంతగా పోరాడుతోందో, ఒడెసా రేవుపై పట్టు నిలుపుకొనేందుకూ అంతే శ్రమిస్తోంది. 'అడ్మిరల్​ ఎస్సెన్‌' ధ్వంసానికి ప్రతీకారంగా రష్యా దీటుగా స్పందించవచ్చని... నెప్ట్యూన్‌ క్షిపణులను ప్రయోగించడంపై ఉక్రెయిన్‌ సేనలు ఎంత త్వరగా శిక్షణ పొందితే అంత త్వరగా నల్లసముద్ర తీరంపై పైచేయి సాధించే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి : రష్యాపై ఆంక్షలు మరింత కఠినం.. పుతిన్ కుమార్తెల ఆస్తులే లక్ష్యంగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.