తూర్పు ఉక్రెయిన్​లో రెఫరెండం.. 99% మంది ఓటు రష్యాకే!.. విలీనం ఖరారు

author img

By

Published : Sep 28, 2022, 3:27 PM IST

russia-referendum-results

ఉక్రెయిన్‌లో ఆక్రమిత భూభాగాల్లో చేపట్టిన రెఫరెండంలో రష్యాలో విలీనానికి భారీ ఎత్తున ప్రజలు మద్దతు పలికినట్లు రష్యా నియమించిన ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెఫరెండం ఫలితాలు ప్రకటించిన అధికారులు ఈ భూభాగాలను రష్యాలో చేర్చుకోమని కోరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగంలో రెఫరెండం గురించి మాట్లాడవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌, అమెరికా, ఐరోపా దేశాలు ఈ జనాభిప్రాయ సేకరణను బూటకమని కొట్టిపారేశాయి.

Russia referendum results : ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆక్రమించిన నాలుగు భూభాగాలను శాశ్వతంగా కలిపేసుకోవడానికి రష్యా చేపట్టిన జనాభిప్రాయ సేకరణలో ఆ దేశానికి అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు రష్యా నియమించిన ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడించారు. దొనెట్స్క్ ప్రావిన్స్‌లో జరిగిన రెఫరెండంలో రష్యాలో విలీనం కావడానికి 99 శాతం మంది అనుకూలంగా ఓటు వేసినట్లు వెల్లడించారు. లుహాన్స్క్‌లో 98 శాతం, జపోరిజియాలో 93 శాతం, ఖేర్సన్‌లో 87 శాతం మంది ప్రజలు రష్యాలో విలీనానికి మద్దతుగా స్పందించారని రష్యా నియమించిన ఎన్నికల అధికారులు ప్రకటించారు. రష్యాలో ఈ ప్రాంతాల విలీనానికే ప్రజలు అనుకూలంగా స్పందించడంతో వీటిని రష్యాలో చేర్చుకోమని పుతిన్‌ను కోరారు.

ఈ నెల 23న మొదలు పెట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ మంగళవారంతో ముగిసింది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో కలిపేసుకునే కార్యక్రమం లాంఛనంగా ఈ నెల 30న పూర్తికావచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగంలో రిఫరెండం గురించి మాట్లాడవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల విలీనాన్ని అక్టోబరు 4న శాసనకర్తలు పరిగణనలో తీసుకుంటారు.

తుపాకులతో బెదిరించి..
ఉక్రెయిన్‌లో పారిశ్రామిక కేంద్రమైన డాన్‌బాస్‌ ప్రాంతంలోని లుహాన్స్క్‌, దొనెట్స్క్ ప్రావిన్సులు ఎనిమిదేళ్లుగా మాస్కో అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉన్నాయి. జనాభిప్రాయ సేకరణతో వాటిని సాధికారకంగా విలీనం చేసుకోవడం రష్యా లక్ష్యం. అమెరికా, నాటో దేశాలు ఈ జనాభిప్రాయ సేకరణ బూటకమని కొట్టివేస్తూ ఉక్రెయిన్‌ పక్షాన గట్టిగా నిలిచాయి. రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికీ వచ్చి ఉక్రెయిన్‌వాసులతో బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించాయి.

అసలు ఏడు నెలల యుద్ధం వల్ల ఇప్పటికే అత్యధిక ప్రజలు ఇళ్లూవాకిళ్లూ వదలి పరారు కాగా, మిగిలిన కొద్దిమందితోనే జనాభిప్రాయ సేకరణ తంతు ముగించారు. యుద్ధానికి ముందు తీర ప్రాంత పట్టణమైన మరియుపొల్‌ జనాభా 5 లక్షల 41 వేలు కాగా ఇప్పుడు లక్ష మంది మాత్రమే నగరంలో మిగిలారు. వారితోనే రష్యా సైనికులు నిర్బంధంగా ఓట్లు వేయించారని నగర మేయర్‌ వాడిం బోయ్చెంకో ఆరోపించారు.

ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం అయితే ఇక వాటిని ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇక సాధ్యం కాకపోవచ్చు. విలీనం తర్వాత ఈ నాలుగు ప్రాంతాలపై దాడిని రష్యాపై దాడిగానే పరిగణిస్తామని పుతిన్‌ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. వీటిని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఉపయోగించడానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. అదే జరిగితే 7 నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీవ్రరూపు దాల్చే అవకాశం కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.