ETV Bharat / international

జెలెన్​స్కీకి మోదీ ఫోన్.. శాంతికి సహకరిస్తామని హామీ.. ఆ విషయంపై హెచ్చరిక

author img

By

Published : Oct 4, 2022, 8:50 PM IST

అణు యుద్ధం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో ఫోన్​లో మాట్లాడిన మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లభించదని మోదీ తెలిపారు.

narendra modi ukraine russia
ఉక్రెయిన్ రష్యా యుద్ధం

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లభించదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీతో ఫోన్​లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు. శత్రుత్వాన్ని వీడి దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

అన్ని దేశాల సమగ్రత, సార్వభౌమత్వానికి గౌరవం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు. ఐరాస చార్టర్, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా శాంతిస్థాపనకు భారత్ కృషి చేస్తుందని మోదీ ఉద్ఘాటించారు. శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు సహకారం అందించేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అణు యుద్ధం తీవ్ర ప్రమాదాలను తెచ్చి పెడుతుందన్నారు ప్రధాని మోదీ. అణు యుద్ధం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణం అతలాకుతలమవుతాయని హెచ్చరించారు.

పుతిన్​కూ హితవు..
కొద్ది రోజుల క్రితం జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్- రష్యాల యుద్ధం అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. 'ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదు' అని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత ఈ ఇద్దరు నేతలు నేరుగా భేటీ కావడం అదే మొదటిసారి.

ఇవీ చదవండి: ముగ్గురు శాస్త్రవేత్తలకు 'భౌతిక' నోబెల్.. క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు పురస్కారం

మరోసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష.. పది రోజుల్లో ఐదు సార్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.